– పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
లింగాల: నాగర్ కర్నూలు జిల్లా లో మండల కేంద్రమైన లింగాల శివారు లో గల పాత శివాలయం వద్ద సా.శ. 12వ శతాబ్దికి చెందిన వినాయక విగ్రహాన్ని ఒక్క చెట్టు కబలిస్తుందని, చారిత్రక ప్రాధాన్యత గల ఆ విగ్రహాన్ని వెలికి తీసి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్స్, సీఈఓ ఈమని శివనాగిరెడ్డి స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లింగాలకు రెండు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఉన్న శిధిల త్రికూటాలయం ముందు సా.శ.1167, ఏప్రిల్ 30, ఆదివారం నాటి కందూరు చోళ వంశానికి చెందిన రెండో గోకర్ణుని శాసన శకలం ఉందని, గోకర్ణని కుమారుడైన తొండయ లింగాలలో విష్ణు, శివ, సూర్య లకు త్రికుటాలయం నిర్మించి, కృష్ణా తీరంలో సోమేశ్వరాలయానికి లింగాల గ్రామాన్ని దానం చేసిన వివరాలు ఉన్నాయని, ఆలయంలోపల 12వ శతాబ్ది నాటి వీరభద్ర, భైరవ, సూర్య విగ్రహాలు, ఆలయం ముందు దీప స్తంభం, చెట్టు తొర్రలో వినాయకుడు, పక్కనే భిన్నమైన భద్రకాళి విగ్రహాలు ఉన్నాయని శివనాగిరెడ్డి చెప్పారు.
మరి కొంత కాలానికి వినాయక విగ్రహాన్ని చెట్టు పూర్తిగా తనలో కలిపేసుకుంటుందని, అందువల్ల విలువైన విగ్రహం కనుమరుగవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీటీసీ మల్లేష్ పాల్గొన్నారని ఆయన చెప్పారు.