దివాలా మాటున దోపిడీ.. అది జగన్‌ ప్రభావంతోనే జరిగిందని తేల్చిన సీబీఐ

-పీఏసీ చైర్మన్, టీడీపీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో కారుచౌకగా కట్టబెట్టిన అత్యంత విలువైన భూములవి! అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు.

ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్‌ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా కేవలం రూ.500 కోట్లకే!
అప్పటి కుంభకోణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌, అప్పటి ఇప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు సూత్రధారులు. దానికి కొనసాగింపుగా ప్రస్తుత స్వాహా కార్యక్రమంలో చేరిన కొత్త కంపెనీలో సాక్షాత్తూ సీఎం జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కుమారుడూ ఓ డైరెక్టర్‌. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సహనిందితులైన సంస్థలు, సన్నిహితంగా ఉన్న మరికొన్ని కంపెనీలు ఈ విషయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర పోషిస్తున్నాయి.

కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో భూ కేటాయింపులనే రద్దు చేసినా.. అప్పటికే ఈడీ జప్తులో ఉన్న భూముల్ని.. వాటిని తనఖా పెట్టుకుని రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం దివాలా ప్రక్రియ చేపట్టి చివరికి జగన్‌ సంబంధీకులకే కట్టబెట్టేస్తున్నాయి.రకరకాల పరిణామాల అనంతరం ఆ భూములన్నీ జగన్‌ సంబంధీకుల చేతుల్లోకి చేరుతున్నాయి.

తనఖాలోని విలువైన భూముల్ని వేలం వేయకుండా.. రుణం మొత్తాన్ని రాబట్టుకునే అవకాశమున్నా వాడుకోకుండా.. ఎనిమిదో వంతు దక్కని ఈ బేరాన్ని బ్యాంకులు ఎందుకు అంగీకరించాయి?
సీబీఐ, ఈడీ చూస్తూ ఎలా ఊరుకున్నాయి?అన్నీ సందేహాలు! అన్నీ ప్రశ్నలే!
“పేద, బడుగువర్గాలకు జీవనాధారమైన వేలాది ఎకరాల భూములను అధికారంలో ఉన్న పెద్దలు కొన్నాళ్ల కిందట కొల్లగొట్టారు. అదో పెద్ద కుంభకోణమని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చి, కేసుపెట్టింది. ఆ కేసులో ఏ1 అయిన వ్యక్తే.. ప్రస్తుతం ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికార పీఠంపై కూర్చుని ఉన్నారు. ఇప్పుడా వ్యక్తి తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారు? ప్రజలకు వాళ్ల భూములను తిరిగి అందించడానికా? లేక తాను కన్నేసిన అపార సంపదను ఎలాగైనా తన మనుషుల ద్వారా చేజిక్కుంచుకోవడానికా? సమకాలీన పరిణామాల్ని గమనిస్తున్న వారెవరికీ ఇవి కష్టమైన ప్రశ్నలు కావు.

ఎందుకంటే పదవిలోకి వచ్చాక ప్రజాప్రయోజనాన్ని కాపాడాలనుకునే వారెవరూ.. అంతకు ముందు కూడా జనాన్ని దోచుకోవాలనే ఆలోచన చేయరు. ఒకసారి దోపిడీ మొదలుపెట్టాక ఎంత ఎదిగినా.. బుద్ధి మారదు. ఇవన్నీ ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌’ కుంభకోణానికి సంబంధించి గతం, వర్తమానాలకు అన్వయించే అంశాలు.ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ ప్రభావంతో.. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో పేదలకు చెందిన వేల ఎకరాలను అభివృద్ధి పేరుతో ఆత్మీయ కంపెనీకి దోచిపెట్టారని సీబీఐ నిగ్గు తేల్చి, కేసు పెట్టింది.

ఇప్పుడు ఆ వ్యవహారంలో కొత్త అంకం మొదలైంది. ఆ భూముల్లో కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనవి.. ఇప్పుడు జగన్‌ ఆత్మీయ బంధువు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీకి అత్యంత కారుచౌకగా వెళ్లబోతున్నాయి.ఈ భారీ కుట్రకు సంబంధించిన తాజా వ్యవహారాలు అర్థం కావాలంటే.. గతంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలి.

వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలంటూ.. మాయాజాలం
యూనివర్సిటీ క్లస్టర్లు, సైన్స్‌, టెక్నాలజీ పార్కులు, ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు, లాజిస్టిక్‌ వ్యవస్థలు, ఆర్థిక జిల్లా – వీటన్నిటినీ అనుసంధానిస్తూ అధునాతన మౌలిక సదుపాయాలు.. వీటితో పాటు నివాస, వాణిజ్య, రిటైల్‌ సదుపాయాలు.. ఇందుకోసం రూ.పది వేల కోట్ల పెట్టుబడులు.. తద్వారా ఇంతకాలం బాగా వెనకబడి ఉన్న ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్షన్నర ఉద్యోగాలు.. అంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మాయజేసి ఉమ్మడి రాష్ట్రానికి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2004- 2009 మధ్య) ఆయన ప్రమేయంతో ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌’ కుంభకోణం జరిగింది.

పేదల నుంచి తీసుకున్న 8,844.01 ఎకరాల భూములను లేపాక్షి సంస్థకు అతితక్కువ ధరకే ధారాదత్తం చేశారు. వైఎస్‌ కుటుంబానికి అత్యంత దగ్గర సంస్థ అయిన ‘ఇందూ ప్రాజెక్ట్స్‌’కు సంబంధించిన సంస్థే ఈ లేపాక్షి. దాని అధినేత ఐ.శ్యాంప్రసాదరెడ్డి. ఇందూ నుంచి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లోకి రూ.70 కోట్లు పెట్టుబడుల రూపంలో తరలాయని సీబీఐ తేల్చింది.

నాలెడ్జి హబ్‌ పేరుతో చేస్తామన్న అభివృద్ధి పనులను ఆ కంపెనీ చేపట్టలేదు. పైగా ప్రాజెక్టుకు కేటాయించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీ ఎత్తున రుణాలు పొందిన ఇందూ సంస్థ వాటిని దుర్వినియోగం చేసింది. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి, శ్యాంప్రసాదరెడ్డి తదితరులను నిందితులుగా చేరుస్తూ 2013 సెప్టెంబరు 17న సీబీఐ ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది.

లేపాక్షికి భూకేటాయింపులను, ఇతర రాయితీలను ఖరారు చేస్తూ 2009 ఫిబ్రవరి 21న వైఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను (నం.112) రద్దు చేస్తూ తదుపరి ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 13న మరో ఉత్తర్వు (నంబర్‌ 44) ఇచ్చింది. లేపాక్షికి కేటాయించిన భూముల్లో 8,648.81 ఎకరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 2015 మార్చిలో జప్తు చేసింది. ఇదంతా చరిత్ర. ఇప్పుడు దీనికి రెండో అంకం ప్రారంభమైంది.

సొంత లాభానికే దివాలా!
ఇందూ ప్రాజెక్ట్స్‌ సంస్థ కొన్నాళ్ల కిందట దివాలా తీసింది. బ్యాంకులు, ఇతరత్రా సంస్థలకు కలిపి 2019 మార్చి నాటికి రూ.4,531.44 కోట్లు బకాయి పడింది. ఈ కంపెనీకి సంబంధించిన దివాలా పరిష్కార ప్రక్రియను హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) చేపట్టింది.దీనిలో భాగంగా రుణదాతలు క్లెయిం చేసిన రూ.4,531.44 కోట్లలో రూ.4,138.54 కోట్ల అప్పులను దివాలా ప్రకియకు సంబంధించిన యంత్రాంగం ఆమోదించింది.

ఈ మొత్తాన్ని మాఫీ చేసేందుకు ‘ఎర్తిన్‌’ ప్రాజెక్ట్స్‌ అనే కంపెనీ, కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ భాగస్వామ్యంతో రూ.500 కోట్లను చెల్లించగలమని ప్రతిపాదించింది. దీనికి రుణదాతల కమిటీ అంగీకరించింది. దీంతో ఎర్తిన్‌ కన్సార్షియానికి బ్యాంకుల వద్ద ఇందూ తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ వెళతాయి. వాటిలో లేపాక్షికి సంబంధించిన 4,191 ఎకరాలు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌లో డైరెక్టర్‌గా వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డి మేనమామ, కమలాపురం శాసనసభ్యుడైన పి.రవీంద్రనాథ రెడ్డి కుమారుడు పి.నరేన్‌రామానుజుల రెడ్డి చేరడం కీలక పరిణామం.

ఇదో దురదృష్టకర పరిస్థితి
లేపాక్షి భూములను తాకట్టు పెట్టి ఇందూ సంస్థ తీసుకున్న రుణాలను ప్రాజెక్టు అభివృద్ధిపై ఖర్చు పెట్టలేదు కాబట్టి.. వాటి కేటాయింపులను తాము ఎప్పుడో రద్దు చేశాం కాబట్టి.. వాటికి ఇందూ దివాలాlepakshi1 పరిష్కార ప్రక్రియతో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించాల్సింది.
భూములను కాపాడుకునేందుకు, కేసులు కొలిక్కి వచ్చాక ఆ భూములను తిరిగి పేదలకు ఇవ్వడానికి లేదా ఇతరత్రా ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సింది.
అయితే తొలి కుంభకోణంలో నిందితుడైన వ్యక్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది.ఈ క్రమంలోనే భూములు ఈడీ పరిధి నుంచి మళ్లీ ప్రభుత్వానికి కాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ఒక ప్రైవేటు కంపెనీకి దక్కబోతున్నాయి.
ఆ కంపెనీలో సీఎం మేనమామ కొడుకు డైరక్టర్‌గా చేరారు.ప్రజల ఆస్తిని కాపాడాల్సిన ప్రభుత్వం మాత్రం తన బాధ్యతను గాలికొదిలేసింది.

ఆ భూములు ఎంత విలువైనవంటే..
బెంగళూరు- హైదరాబాద్‌ రహదారిలో.. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు మొదలైనప్పటి నుంచి దాదాపు 18 కి.మీ. దూరం వరకు రెండు వైపులా ఈ భూములు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు నుంచి కర్ణాటక వైపుlepakshi సుమారు 65 కి.మీ. దూరంలోనే ఇదే రహదారిని ఆనుకుని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.దీన్ని బట్టి ఈ భూములు ‘రియల్‌ ఎస్టేట్‌’ కోణంలో ఎంతటి విలువైనవో అర్థమవుతుంది.
లేపాక్షి భూముల కుంభకోణంపై 2013లో వేసిన ఛార్జిషీట్‌లో సీబీఐ వాటి విలువ సగటున ఎకరా రూ.15 లక్షల చొప్పున మొత్తం 8,844 ఎకరాల విలువ రూ.1326.60 కోట్లు ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. అంటే దివాలా ప్రక్రియ ప్రకారం ఎర్తిన్‌ సొంతం కాబోతున్న 4,191 ఎకరాల విలువ 2013 నాటి అంచనా ప్రకారమే రూ.628.65 కోట్లు. ఈ తొమ్మిదేళ్లలో ఆ ప్రాంతంలో అనేక మార్పులు వచ్చాయి.ఆంధ్ర సరిహద్దు నుంచి హైదరాబాద్‌ వచ్చే రహదారిలో లేపాక్షి భూములు దాటాక ‘కియా’ సంస్థ కార్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.

చుట్టుపక్కల అనుబంధ పరిశ్రమలూ రావడంతో ఆ ప్రాంతంలో భూముల విలువలు అనూహ్యంగా పెరిగాయి.ప్రస్తుతం లేపాక్షి ప్రాంతంలో రోడ్డు పక్క భూమి రూ.కోటి వరకూ, లోపలి భూములు రూ.30, 40 లక్షల వరకూ పలుకుతున్నాయి. సగటున రూ.60 లక్షలు అనుకున్నా.. ఆ 4,191 ఎకరాల ధర రూ.2,514 కోట్లు ఉంటుంది.

ఇంతకీ ఎర్తిన్‌ స్థాయి ఏమిటి?
ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ ఓ సాధారణ కంపెనీ.2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దాని మొత్తం ఆస్తులు రూ.4.49 కోట్లు. వ్యాపార పరిమాణం రూ.21.92 కోట్లు.

దివాలా ప్రక్రియలో తొలి నుంచీ జగన్‌ ‘నీడ’లు
ఇందూ దివాలా ప్రక్రియలో తొలి నుంచీ జగన్‌తో సంబంధమున్న సంస్థలు పాలుపంచుకోవడం గమనార్హం.ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియను ఎన్‌సీఎల్‌టీ 2019 ఫిబ్రవరి 25న ప్రారంభించింది.కొంత మొత్తం చెల్లించి.. ఇందూ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు 7 సంస్థలు ఆసక్తి చూపాయి. వాటిలో శ్యామరాజు అండ్‌ కంపెనీ, రాంకీ ఎస్టేట్స్‌ అండ్‌ ఫార్మ్స్‌ లిమిటెడ్‌ (సర్కిల్‌ సి కాంట్రాక్ట్స్‌ సంస్థ భాగస్వామ్యంతో) దివాలా ప్రక్రియకు అవసరమైన ప్రణాళికలను సమర్పించాయి.

వీటిలో రాంకీ గ్రూపునకు సంబంధించిన మరో కంపెనీ.. జగన్‌ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు సీబీఐ నిర్ధారించింది. రెండింటిలోనూ శ్యామరాజు కంపెనీ ఎక్కువ మొత్తాన్ని ప్రతిపాదించినా వారి ప్రణాళికను రుణాలిచ్చిన బ్యాంకర్ల కమిటీ ఆమోదించలేదు. ఇది 2020 జనవరి 24న జరిగింది.

ఈ క్రమంలో ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ ఆసక్తి తెలిపింది. రుణదాతల కమిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని.. ఎర్తిన్‌తో పాటు ఇతరులెవరైనా కూడా ప్రణాళికలను సమర్పించేందుకు సమయాన్ని పొడిగిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఆమోదాన్ని తెలిపింది. రెండోసారి ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ (కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ భాగస్వామ్యంతో), అరబిందో రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ అనే మూడు సంస్థలు ప్రతిపాదనలు ఇచ్చాయి.

వీటిలో అరబిందో రియాలిటీ జగన్‌కు అత్యంత సన్నిహిత సంస్థ. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని కాకినాడ సెజ్‌, కాకినాడ సీ పోర్టుల యాజమాన్యాలు మారిపోయి ఆ కంపెనీలు అరబిందో పరమైన సంగతి తెలిసిందే. ఏస్‌ అర్బన్‌ సంస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భారీ విద్యుత్తు ప్రాజెక్టులు చేపడుతున్న వారిది. పై మూడు సంస్థల ప్రతిపాదనలను పరిశీలించిన రుణదాతల కమిటీ.. ఎర్తిన్‌ కన్సార్షియం ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ 2021 అక్టోబరు 1న దివాలా పరిష్కారానికి ఆమోదం తెలిపింది.

దివాలా ప్రక్రియ అమల్లో భాగంగా ఎర్తిన్‌ కన్సార్షియం తరఫున ఈఎండీగా రూ.5 కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చారు. అయితే ప్రణాళికలో పేర్కొన్న మొత్తాన్ని నిర్ణీత గడువు 90 రోజుల్లో ఎర్తిన్‌ కన్సార్షియం చెల్లించలేదు. గడువు పొడిగించాలన్న ఎర్తిన్‌ కన్సార్షియం విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ శాఖ 2022 మార్చి 1న నిరాకరించింది. ఈఎండీ మొత్తాన్ని స్వాధీనం చేసుకోమని, తదుపరి చర్యలు చేపట్టమని రుణదాతల కమిటీని ఆదేశించింది. దీనిపై ఎర్తిన్‌.. చెన్త్నెలోని ట్రైబ్యునల్‌కు అప్పీలు చేసింది. హైదరాబాద్‌ శాఖ ఉత్తర్వుపై ట్రైబ్యునల్‌ 2022 మార్చి 7న స్టే ఇచ్చింది.

మరో నెలకు (2022 ఏప్రిల్‌ 8న) జగన్‌ మేనమామ కొడుకు నరేన్‌రామానుజుల రెడ్డి ఎర్తిన్‌లో డైరెక్టర్‌గా చేరారు.దివాలా ప్రక్రియ అమలుకు ఎర్తిన్‌ కన్సార్షియం డబ్బు చెల్లించాల్సిన గడువును పెంచుతూ ట్రైబ్యునల్‌ 2022 ఏప్రిల్‌ 13న ఉత్తర్వులిచ్చింది. తొలుత రూ.50 కోట్లను మే నెలలో చెల్లించారు.

సీబీఐ ఛార్జిషీట్‌లో ప్రస్తావించిన అంశాలివీ..
తాము కన్నేసిన ప్రాంతంలో భూములను ఏపీఐఐసీ పేరుతో కొట్టేసేందుకు 2006 నుంచే అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో తమకు 1,654 ఎకరాలు సేకరించి ఇవ్వాలని ఏపీఐఐసీ నుంచి రెవెన్యూ అధికారులకు ఉత్తరాలు వెళ్లాయి. ఇది ఆ పరంపరలో తొలి లేఖ.
అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జి హబ్‌కు భూములు సేకరించే విషయమై 2008 మార్చి 24న తమ వద్ద జరిగే సమావేశానికి హాజరుకావాలని వివిధ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం అదే నెల 17న నోట్‌ పంపింది. ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌’ అనే పేరు అధికారులకు తొలిసారి తెలిసింది అప్పుడే.

ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన రోజునే లేపాక్షి పేరుతో దాని ఎండీ బాలాజీ సమీకృత నాలెడ్జి హబ్‌ ఏర్పాటుకు తమకు పది వేల ఎకరాలు కేటాయించాలని.. ఆ సంస్థ అధ్యక్షుని హాదాలో ఏపీఐఐసీకి లేఖ ఇచ్చారు. పలువురు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో, అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో తమకు ఒప్పందాలు కూడా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఆ రోజుకు ఆ కంపెనీ ఉనికిలోనే లేదు. దీన్ని బట్టే ఎంత బరితెగింపుగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారో అర్థమవుతుంది.
తమది ఎంతో బడా సంస్థ అని చెప్పుకుంటూ ఏపీఐఐసీకి లేఖ ఇచ్చిన రెండు రోజుల తర్వాత 26.03.2008న రూ.లక్ష పెట్టుబడితో లేపాక్షి కంపెనీని నమోదు చేశారు. అప్పటికే పై నుంచి ఆదేశాలు ఉండటంతో ఏపీఐఐసీ కూడా భూముల కేటాయింపునకు ముందుగా రూ.10 కోట్లు డిపాజిట్‌ కట్టమని ఆ కంపెనీ నమోదైన రోజే లేఖ పంపింది. అలా సీఎం తలచుకుంటే.. అన్నట్లు అన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. 2009 ఫిబ్రవరి నుంచి అక్టోబరులోపు మూడు దఫాలుగా విక్రయ పద్ధతిలో భూములను ఇచ్చేశారు.

ఇందూ ప్రాజెక్ట్స్‌కు తాము రూ.250 కోట్ల అప్పిచ్చామని ఇందుకు పూచీకత్తుగా ఏపీఐఐసీ కేటాయించిన 756 ఎకరాల భూములను తాకట్టు పెట్టడానికి లేపాక్షి నాలెడ్జి హబ్‌ అంగీకరించిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 2010 ఆగస్టు 31న ఏపీఐఐసీకి లేఖ రాసింది. అప్పటి వరకూ ఇందూ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.

జగన్‌ కంపెనీలోకి నిధుల మళ్లింపు
లేపాక్షి వ్యవహారంపై సీబీఐ ఛార్జిషీట్‌లో ఓ కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. హైదరాబాద్‌లో ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ నిర్మాణ పనుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ‘చిడ్కో’ అనే కంపెనీ పేరుతో రూ.40 కోట్లను రుణంగా పొందిన ఐ.శ్యాంప్రసాదరెడ్డి అందులో రూ.20 కోట్లను ‘వాల్డెన్‌’ అనే కంపెనీ ద్వారా జగన్‌ సంస్థ ‘కార్మెల్‌’లోకి పెట్టుబడి రూపంలో మళ్లించారని వివరించింది.
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ‘విండ్‌ టర్బైన్‌ జనరేటర్‌’ కోసం అంటూ వాల్డెన్‌ పేరుతో తీసుకున్న రూ.12.5 కోట్లలోనూ అయిదు కోట్లను కార్మెల్‌లోకి మళ్లించారని పేర్కొంది. మరి ఇందూ పేరుతో తీసుకున్న రూ.వేల కోట్లు అంతిమంగా ఏమైనట్లు?దీనిపై ఆరా తీసి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత బ్యాంకులకు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలకు గానీ లేదా?
వీటికి అదనంగా.. నిర్వహణ ఖర్చుల కోసం చేసిన అప్పులు రూ.291.34 కోట్లు, జీతాల బకాయిలు రూ.6.48 కోట్లు, ఇతరత్రా అప్పులు రూ.43.67 కోట్లు ఉన్నాయని జాబితాలో పేర్కొన్నారు. బ్యాంకులు క్లెయిమ్‌ చేసిన రూ.4,189.95 కోట్లలో రూ.3,910.85 కోట్ల మేరకు అప్పులను దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా గుర్తించారు.
వీటిని బదులుగా దివాలా ప్రక్రియ ద్వారా కంపెనీ ఆస్తులు పొందే సంస్థ చెల్లించే రూ.501 కోట్లలో రూ.477 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తారు.మిగిలినవారికి రూ.23 కోట్లు, మరో రూ.కోటి దివాలా ప్రక్రియ వ్యయంగా వెళతాయి.
తను చేసిన మొత్తం అప్పులకు లేపాక్షి భూములతోపాటు హైదరాబాద్‌లో తనకు, అనుబంధ సంస్థలకు సంబంధించిన మరికొన్ని ఆస్తులను కూడా ఇందూ సంస్థ బ్యాంకులకు తాకట్టు పెట్టింది. వాటిలో కొన్ని..
దుర్గం చెరువు వద్ద వీకే ప్రాజెక్ట్స్‌ కు ఉన్న 5 ఎకరాల స్థలం
సింధూర, ఆస్టివ సంస్థలకు మియాపూర్‌లో ఉన్న 11.3 ఎకరాలు
శామీర్‌పేటలో సండరి సంస్థ పేరుతో ఉన్న 35 ఎకరాలు
కూకట్‌పల్లి వద్ద ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌లోని 2,595.69 గజాల క్లబ్‌హౌస్‌
సైబరాబాద్‌ హైటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర సంస్థల్లో ఉన్న షేర్లు.

బ్యాంకులు ఒప్పుకోవడమే ఆశ్చర్యకరం
ఇందూ ప్రాజెక్ట్స్‌కు వేల కోట్ల అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దివాలా ప్రక్రియలో నామమాత్రంగానే డబ్బులు అందుతున్నాయి. ఈ సంస్థలు ఇచ్చిన అప్పులు 2019 మార్చి 5నాటికి రూ.4,189.94 కోట్లు. అప్పటి నుంచి వాటికి వడ్డీలు లెక్కించరు. ఇక మొత్తం అప్పుల్లో దివాలా ప్రక్రియలో ఆమోదించిన రూ.3,910.85 కోట్లకుగాను వాటికి దక్కేది కేవలం రూ.477 కోట్లు (12 శాతం మాత్రమే). ఈ ఏడాది మే నుంచి దశలవారీగా వాటి చెల్లింపులు కూడా మొదలయ్యాయి.
2019 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 8 శాతం వంతున రూ.3,910.85 కోట్లకు వడ్డీని లెక్కించినా.. ఆ మొత్తమే రూ.936 కోట్లకు పైగా అవుతుంది.దీన్ని బట్టి ఈ ప్రక్రియలో బ్యాంకులు ఏ స్థాయిలో నష్టపోతున్నాయో అర్థమవుతుంది.ఇందూకు ప్రస్తుతం ఉన్న ఆస్తుల విలువను పూర్తిగా విస్మరించి.. బ్యాంకులు దివాలా ప్రక్రియకు అంగీకారాన్ని తెలపడం విస్మయం కలిగిస్తోంది.
దివాలా తీసిన సంస్థ ఆస్తులు పొందేందుకు వివిధ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో కూడిన రుణదాతల కమిటీ పరిశీలించి ఆమోదించాలి. ఆ తర్వాతే దివాలా ప్రక్రియ ముందుకెళుతుంది.ఇందుకోసం కమిటీ సమావేశంలో ఓటింగ్‌ నిర్వహిస్తారు.ఇచ్చిన అప్పు పరిమాణాన్ని బట్టి బ్యాంకులకు ఓటింగ్‌ హక్కు శాతం ఉంటుంది.బ్యాంకుల వద్ద ఇందూ తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ అపారమని ఈ రోజు అందరికీ తెలుసు.
అనంతపురం జిల్లాలో జాతీయ రహదారి పక్కన ఉన్న 4,191 ఎకరాల విలువ వేల కోట్లలో ఉంది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద 5 ఎకరాల భూమి మొత్తం రూ.400 కోట్లకు పైగా విలువ చేస్తుంది. మియాపూర్‌లోని 11 ఎకరాలు రూ.200 కోట్ల పైనే ఉంటుంది. శామీర్‌పేటలోని 35 ఎకరాల విలువ కూడా మరో రూ.200 కోట్లకు పైగానే. ఇతరత్రా ఆస్తులు, షేర్లు కూడా విలువైనవే.వీటన్నింటినీ కేవలం రూ.477 కోట్ల కోసం వదులుకునేందుకు బ్యాంకులు సిద్ధపడటం గమనార్హం.
ఎవరైనా సామాన్యుడు అప్పు తీసుకుని అపార్టుమెంటు కొనుక్కుని వాయిదాలు కట్టలేకపోతే.. దాన్ని పత్రికల్లో ప్రకటించి, ఆస్తిని వేలం వేసి బ్యాంకులు తమ సొమ్మును వసూలు చేసుకుంటాయి. ఇందూ విషయంలోనూ అవి అలాంటి విధానాన్ని అనుసరించి తమ తాకట్టులోని ఆస్తులను విడిగా వేలం వేస్తే అసలును వడ్డీతో తిరిగి రాబట్టుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇందూకు వేల కోట్లు ధారాదత్తం చేసిన బ్యాంకుల్లో అధిక భాగం జాతీయ బ్యాంకులే. అవి ఇందూకు వదిలేసుకున్న డబ్బూ ప్రజల సొమ్మే.

వైఎస్‌లతో ‘ఇందూ’కి గాఢానుబంధం
వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి, వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డికి ఇందూ ప్రాజెక్ట్స్‌ సొంత సంస్థ వంటిదే. జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 క్విడ్‌ ప్రో కో (నీకిది- నాకది) కేసుల్లో మూడు ఇందూతో ముడిపడ్డ వ్యవహారాలే. లేపాక్షితో పాటు ఇందూటెక్‌ జోన్‌, హౌసింగ్‌ బోర్డు వ్యవహారాలకు సంబంధించిన విడిగా పెట్టిన మూడు కేసుల్లోనూ జగన్‌, ఇందూ ప్రాజెక్ట్స్‌ అధినేత శ్యాంప్రసాదరెడ్డి సహ నిందితులు.
ప్రభుత్వం తరఫున భూములను లేపాక్షికి అప్పగించే అంశానికి సంబంధించి.. ముందుగా ఇందూ బోర్డు సమావేశంలో శ్యాంప్రసాదరెడ్డి ప్రస్తావించిన అంశాలపై, కొద్ది రోజుల తర్వాత అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అధికారులకు సూచనలిచ్చినట్లు తమ పరిశోధనలో తేలిందని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
రాజశేఖరరెడ్డి.. శ్యాంప్రసాదరెడ్డి పట్ల ఎలాంటి పోషకత్వ (పేట్రనేజ్‌) వైఖరిని ప్రదర్శించేవారో తమకు దొరికిన ఆధారాలతో స్పష్టమవుతోందనీ సీబీఐ వెల్లడించింది. లేపాక్షి పేరుతో ఇందూకు నిబంధనలను ఉల్లంఘించి సహకరించిన తీరును పరిశీలిస్తే.. ఫలానా ప్రాంతంలో భూములు కొట్టేయాలన్న ఆలోచనకు వచ్చి, తదుపరి లేపాక్షి పేరుతో వ్యవహారాలు నడిపారని స్పష్టమవుతోంది.

అంతా అధర్మాన..
లేపాక్షికి భూ కేటాయింపుల విషయంలో నాడు వైఎస్‌ క్యాబినెట్‌లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.శామ్యూల్‌ ఇందూ అధినేత శ్యాంప్రసాదరెడ్డి, అతనికి సంబంధించిన కంపెనీలు తప్పుడు పద్ధతుల్లో వేలాది ఎకరాలను సొంతం చేసుకునేందుకు తోడ్పడ్డారని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
వారిలో శామ్యూల్‌ను ఏ-10గా, ధర్మానను ఏ-11గా చేర్చింది. ప్రస్తుతం జగన్‌ ధర్మానకు రెవెన్యూ మంత్రి పదవి ఇవ్వడం, శామ్యూల్‌ను కూడా సలహాదారు పదవి ఇచ్చి ఆదరించడం గమనార్హం. ఈ భూముల బదలాయింపులకు సంబంధించి క్యాబినెట్‌ అనుమతి పొందేందుకు రెవెన్యూ శాఖ రూపొందించిన ప్రతిపాదన పత్రంలో భూములను ప్రభుత్వ సంస్థ ఏపీఐఐసీకి బదలాయిస్తున్నట్లు పేర్కొన్నారు.ఏపీఐఐసీ వాటిని వెంటనే లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ అనే ప్రైవేటు కంపెనీకి బదలాయిస్తుందనేది వీరికి తెలుసు. అయినా మిగతా మంత్రులకు కూడా తెలియకుండా దాచారు.
లేపాక్షికి కేటాయించిన ప్రభుత్వ భూముల మార్కెట్‌ విలువను రూ.లక్షన్నర నుంచి రూ.50 వేలకు తగ్గించడం, భూబదలాయింపు ఛార్జీలను మినహాయించడం వంటి నిర్ణయాలను అప్పటి ముఖ్యమంత్రి ఏకపక్షంగా తీసుకుంటే వాటికి అడ్డగోలు పద్ధతుల్లో క్యాబినెట్‌ ఆమోదం పొందే ప్రక్రియను వీరిద్దరూ నిర్వర్తించారు.

తక్కువ ధరకు ఎలా కొట్టేశారంటే..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం లేపాక్షి పేరుతో కేటాయించింది మొత్తం 8,844.01 ఎకరాలు. అందులో ఎసైన్డ్‌ భూములు 5811.18 ఎకరాలు. మిగిలిన 3032.83 ఎకరాలు ప్రభుత్వ భూములు. వీటిని ఆ కంపెనీకి ఇచ్చేందుకు ప్రభుత్వం అతి తక్కువ ధరలు పెట్టింది. ఎకరా భూమి ఎసైన్డ్‌ది రూ.1.75 లక్షలు, ప్రభుత్వానిది అయితే రూ.50 వేల ధర నిర్ణయించారు.
ఏపీఐఐసీ అప్పట్లో తాను కేటాయించే భూములపై నిర్ణయించిన ధరకు అదనంగా 15 శాతాన్ని సేవారుసుం వసూలు చేసేది. కానీ లేపాక్షి నుంచి 2 శాతమే వసూలు చేశారు. ప్రాసెసింగ్‌ రుసుముగా వసూలు చేయాల్సిన రూ.8.84 కోట్లను పూర్తిగా మినహాయించారు. దీంతో మొత్తం 8,844.01 ఎకరాలు పొందడానికి భూమి ధర, సర్వీసు, ఇతర ఛార్జీలన్నీ కలిపి ఆ కంపెనీ తరఫున ఏపీఐఐసీకి వచ్చింది రూ.119.85 కోట్లు మాత్రమే.
మరోవైపు హబ్‌ భూములకు నీటి వసతి కల్పనకు తన తరఫున దాదాపు రూ.720 కోట్ల వ్యయాన్ని పైపులైన్లు తదితరాలకు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనిని బట్టే లేపాక్షి వ్యవహారాలు ఎంత అడ్డగోలుగా జరిగాయో తెలుస్తోంది.
ఈ ప్రాంత భూములు కర్ణాటకలో నిర్మాణం చేపట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో.. మార్కెట్‌లో రూ.5 లక్షల నుంచి 15 లక్షల వరకూ పలుకుతున్నాయని 2008 ఆరంభంలోనే రెవెన్యూ అధికారులు ఒక నివేదికలో పేర్కొన్నారు. అంటే ఎంత దుర్మార్గమైన కుట్రతో ఈ భూములపై నేతలు కన్నేసి, ఎంత తేలికగా వాటిని కొట్టేశారో అర్థం చేసుకోవచ్చు.ఆ భూమిలో ఏవో పనులు చేస్తున్నారన్న అభిప్రాయం కలిగించడానికి కంపెనీ తరఫున ఖర్చు పెట్టింది కేవలం రూ.8 కోట్లేనని ఏపీఐఐసీ అంచనా వేసింది.

కారు చౌక బేరం..
ఇందూ ప్రాజెక్ట్స్‌ సంస్థ కొన్నాళ్ల కిందట దివాలా తీసింది. బ్యాంకులు, ఇతరత్రా సంస్థలకు కలిపి 2019 మార్చి నాటికి రూ.4,531.44 కోట్లు బకాయి పడింది.ఈ కంపెనీకి సంబంధించిన దివాలా పరిష్కార ప్రక్రియను హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) చేపట్టింది.దీనిలో భాగంగా రుణదాతలు క్లెయిం చేసిన రూ.4,531.44 కోట్లలో రూ.4,138.54 కోట్ల అప్పులను దివాలా ప్రకియకు సంబంధించిన యంత్రాంగం ఆమోదించింది.
ఈ మొత్తాన్ని మాఫీ చేసేందుకు ‘ఎర్తిన్‌’ ప్రాజెక్ట్స్‌ అనే కంపెనీ, కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ భాగస్వామ్యంతో రూ.500 కోట్లను చెల్లించగలమని ప్రతిపాదించింది. దీనికి రుణదాతల కమిటీ అంగీకరించింది.ఈ మేరకు లా ట్రైబ్యునల్‌ అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ఈ 500 కోట్లకు అదనంగా యాజమాన్య మార్పు అనంతరం వివిధ పనులు చేపట్టేందుకు (వర్కింగ్‌ కేపిటల్‌గా) మరో రూ.40 కోట్లను ఆ సంస్థ సమకూర్చాలి.
ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించకుండా ఎర్తిన్‌ కన్సార్షియమే ఉపయోగించుకుంటుంది.దివాలా ప్రక్రియ ఖర్చుల కోసం రూ.కోటిని కన్సార్షియం చెల్లించాలి.బ్యాంకులకు, ఇతర రుణదాతలకు కలిపి కేవలం రూ.500 కోట్లు చెల్లించే ఎర్తిన్‌ కన్సార్షియానికి బ్యాంకుల వద్ద ఇందూ తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ వెళతాయి.
వాటిలో లేపాక్షికి సంబంధించిన 4,191 ఎకరాలు కూడా ఉండటం గమనార్హం.

ఈ క్రమంలోనే ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌లో డైరెక్టర్‌గా వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డి మేనమామ, కమలాపురం శాసనసభ్యుడైన పి.రవీంద్రనాథరెడ్డి కుమారుడు పి.నరేన్‌రామానుజులరెడ్డి చేరడం కీలక పరిణామం.
“ప్రజల భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదనేదే మా ఉద్దేశం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. ప్రజల భూములను కాపాడతారా.. మీ బంధువుల తరఫున నిలబడతారా ? అనేది సీఎం జగనే చెప్పాలి. ఆ భూములకు తెదేపా కాపలాగా ఉంటుంది తప్ప ఎవరికీ అప్పనంగా పోనివ్వం. నేను విషయాన్ని బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయట్లేదు? ఆ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆనాడు తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. రాంకీ, అరబిందో సంస్థలు మీ భాగస్వామ్య సంస్థలు కాదా? భూములను మళ్లీ ప్రజలకు అప్పగించేందుకు వైకాపా ప్రభుత్వం ఏమైనా చేసిందా? త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలోనైనా ఆ భూములపై మాట్లాడతారా? ఎన్‌సీఎల్‌టీలో ప్రభుత్వ వాదనలు ఎందుకు వినిపించలేకపోతున్నారు? రూ.10వేల కోట్ల విలువైన భూములను రూ.500 కోట్లకే కట్టబెడతారా?”

Leave a Reply