Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్యసామాన్యం

• సప్తసముద్రాలు దాటొచ్చి పోలింగ్‌లో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు
• ఎన్ఆర్ఐ టీడీపీ నేతలకు చంద్రబాబు కితాబు
• పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ కార్యక్రమం
• జూమ్ కాల్ ద్వారా పాల్గొని ఎన్ఆర్ఐల సేవలను కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుని దాదాపు నెల రోజులుగా ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడం అద్వితీయమని, వారి సేవలు మరవలేనివని కొనియాడారు.

మంగళవారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవి, గల్ఫ్ టీడీపీ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ కార్యక్రమంలో అధినేత చంద్రబాబునాయుడు జూమ్‌కాల్ ద్వారా పాల్గొని ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా… ఆయనతో సెల్ఫీలు దిగెందుకు పలువురు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపించారు.

వెంకట్ కోడూరి, మాలేపాటి సురేష్ తదితరులు ఎన్నికల వేళ తాము నిర్వహించిన విధులు, పోలింగ్ సరళిని చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… ఓటుహక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు.. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని, అలా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం దేశవిదేశాల్లోని ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ఎన్ఆర్ఐల సమస్యల కోసం పనిచేస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల సంక్షేమంపై దృష్టిపెట్టకపోవడంతో వారిద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా ఆగిపోయాయని, గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు ప్రమాదం బారినపడితే రూ.లక్ష, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షలు, అక్కడ వారికి ఏదైనా న్యాయ సమస్యలు తలెత్తితే రూ.50 వేల వరకు అందేలా నాడు టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు.

ఏపీఎన్ఆర్టీ విభాగం కింద టీడీపీ హయాంలో ఇమ్మిగ్రేషన్, ఇతర సమస్యలతో ఇబ్బంది పడేవారిని స్వదేశాలకు తరలించడంతోపాటు దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పించడం కోసం తమ ప్రభుత్వం రెండు శిక్షణ కేంద్రాలు నిర్వహించిందన్నారు. మన రాష్ట్రం నుంచి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి మంచి వేతనం లభించేలా, వారికి శిక్షణ అందించేలా సదరు కేంద్రాలను నడపడం జరిగిందన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం కృషి చేస్తామని, నేరుగా తనను కలిసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఏపీ భవిష్యత్తు కోసమే తాము కుటుంబ సభ్యులతో సహా స్వచ్ఛందంగా ఏపీకి తరలివచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నామని, స్వయంగా ఓటు వేయడం సంతోషంగా ఉందని పలువురు ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, కూటమి గెలుపు ఏపీకి మలుపు కాబోతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యనిర్వహక కార్యదర్శి పి.అశోక్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్, గన్నవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, పెనమలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోడె ప్రసాద్, గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ మహిళా చైరపర్సన్ నన్నపనేని రాజకుమారి, అమెరికా ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరామ్, అరవింద్ వేమూరు, చప్పిడి రాజశేఖర్ లతో పాటు సుమారు 500 మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంగళగిరి వీవర్స్ సోసైటీ బలోపేతం చేసేందుకు వారి అమ్మకాలను ప్రోత్సహించేలా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే హౌస్ కీపింగ్, ఆఫీస్ బాయ్స్, సెక్కూరిటీ సిబ్బందికి రూ. 2 వేలు విలువ చేసే గిప్ట్ చెక్స్ ను ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు అందజేశారు.

LEAVE A RESPONSE