Suryaa.co.in

Andhra Pradesh

నంది నాటకోత్సవాల విజేతలను ప్రభుత్వం అవమానపరచింది

-చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ ల కంటే జగన్ ప్రభుత్వంలో ఒక్క కొత్త పెన్షనైనా పేద కళాకారులకు ఇచ్చారా?
-రంగస్థల కళాకారులు చంద్రబాబుకు జేజేలు కొడుతున్నారు.. జగన్ ను ఈసడించుకుంటున్నారు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఈ నెల 29న గుంటూరులో జరిగిన నంది నాటకోత్సవాల విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకాకపోవడం ఈ ప్రభుత్వానికి, జగన్ కు కళాకారుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు..

జగన్ పాలనలో రంగస్థల కళాకారుల జీవితాలు చాలా అవహేళనకు గురయ్యాయి
జగన్ పాలనలో రంగస్థల కళాకారుల జీవితాలు చాలా అవహేళనకు గురయ్యాయి. రంగస్థల కళాకారుల్ని ముఖ్యమంత్రి, అడుగడుగునా అవమానిస్తున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో దర్జాగా తలెత్తుకొని తిరిగిన కళాకారులు, నేడు జగన్ పాలనలో క్షుద్బాధలు అనుభవిస్తున్నారు. రోజు గడవని కళాకారులను జగన్ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. పేదలకి పెన్షన్లిచ్చానని చెప్పుకునే జగన్ అత్యంత పేదవారైన కళాకారులకు పింఛనెందుకు ఇవ్వడంలేదు?

తెలుగువాడి సొత్తైన పద్యనాటకాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో మాట్లాడి పేద కళాకారులకు 15వందలు వచ్చే పింఛన్ ను రూ.3000 కు పెంచేలా చేయడం జరిగింది. చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ ల కంటే మీరు ఒక్క కొత్త పెన్షనైనా పేద కళాకారులకు ఇచ్చారా? రంగస్థల కళాకారులు చంద్రబాబుకు జేజేలు కొడుతున్నారు.. జగన్ ను ఈసడించుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో అన్ని దేవాలయాల్లో నాటకాలు ప్రదర్శించే జీవో ఇచ్చారు. జగన్ హయాంలో ఒక్క నాటకం వేయించలేదు, ఒక్కరికి జీవనభృతి కల్పించలేదు. కళలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కళా సంస్థలను ప్రోత్సహిస్తూ నాటకాలు వేయించాలి.

నంది నాటకోత్సవానికి ముఖ్యమంత్రి రాకపోవడం కళలపై ఆయనకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం
నంది నాటకోత్సవానికి ముఖ్యమంత్రి రాకపోవడం కళలపై ఆయనకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. కూచిపూడ నృత్యాన్ని అనాదరణకు గురిచేశారు. మన రాష్ట్రంలో కంటే, అమెరికాలో ఎక్కువ మంది కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నారు. కేంద్రం ఇస్తున్నట్లుగా, రాష్ట్రంలో కూడా రూ.6వేలు పేద కళాకారులకు పింఛన్ ఇవ్వాలి. నాటక రచయిత కాళ్లకూరి నారాయణ వ్యభిచార వృత్తి నిర్మూలనకై రాసిన చింతామణి నాటకాన్ని నిషేధించడం ఈ ప్రభుత్వ దుందుడుకు చర్య. కాళ్లకూరివారు రచించిన నాటకంలో అశ్లీలత లేదు, దానిపై నిషేధం వెంటనే తొలగించాలి. ఇంట్లో ఎలుక ఉంటే ఇంటినే తగులబెట్టినట్లుగా చిన్న లోపముందని చింతామణి నాటకాన్నే రద్దు చేశారు. డప్పు కళాకారుల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతి సందర్భంలో ఉపయోగించి వారికి ఆర్థిక భృతి కల్పించేవారు.

జగన్ ఏనాడూ డప్పు కళాకారులను ఆదరించలేదు
జగన్ ఏనాడూ డప్పు కళాకారులను ఆదరించలేదు. కళాకారులంటే సాంస్కృతిక రాయబారులు, దేశ విదేశాల సంబంధాలను పెంచుతారు. నాటకాలను నిర్లక్ష్యం చేసి జగన్ తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. కళాకారులను గౌరవించడం ఈ ప్రభుత్వం నేర్చుకోవాలి. తెలుగు సంస్కృతిని కాపాడాలి. చింతామణి నాటక నిషేదాన్ని తొలగించాలి. గతంలో చంద్రబాబు నంది నాటకోత్సవాల విజేతలకు బహుమతులను స్వయంగా అందజేసేవారు. ఈసారి నంది నాటకోత్సవాల విజేతలు (అవార్డు గ్రహితలు) జగన్ ముఖారవిందాన్ని చూసే అదృష్టానికి నోచుకోలేదు.

కళాకారులను బిక్షగాళ్లలా చూస్తారు
కళాకారుల్ని బిక్షగాళ్లలాగ చూస్తారు. సిగ్గుచేటు, బాధాకరం. మన తెలుగు సంస్కృతిని దశ దిశలా వ్యాపింపజేసిన కళాకారుల పట్ల ఛీదరింపులా? రంగస్థల కళాకారులంటే జగన్ కు ఎందుకంత ధ్వేషం, కోపం, అసూయ, నిర్లక్ష్యం? కళాకారులకు డబ్బులు బ్యాంకులో వేశామంటారు. బ్యాంకుకు వెళ్లి అడిగితే బ్యాంకు అధికారులు కూడా కళాకారులను ఛీదరించుకుంటారు. అనేకమంది కళాకారులు వారి బాధలను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి.

కళాకారులంటే భగవత్ స్వరూపులని గ్రహించాలి
సామాన్యులు పద్యాలు పడలేరు. అది ఒక కళ. కళాకారులంటే భగవత్ స్వరూపులని జగన్ గ్రహించాలి. భగవత్సవంతో పుట్టేవారు కళాకారులు. నంది కళాకారుల అవార్డు ఫంక్షన్ లో కళాకారులకు తీరని అవమానం జరిగింది. జగన్ ప్రజల్లోకి రవాడానికి భయపడతారు. చంద్రబాబు ఆద్యాంతం ఉండి నంది నాటకోత్సవ కళాకారులకు శాలువలు కప్పి అందర్ని అక్కున చేర్చుకునేవారు. తెలుగువారి సంస్కృతిని కాపాడుకుంటే జగన్ కు అవమానమేమో జగన్ తెలియజేయాలి. కళాకారుల గౌరవాన్ని పెంచటం సిగ్గుచేటా? సిలికాంధ్ర కూచిపూడి ఆనంద్ వేలాదిమంది నృత్య కళాకారులతోటి చంద్రబాబు నృత్య కళాకారులతో అనేక నృత్య ప్రదర్శనలు చేయించారు. మన సంస్కృతిని చంపేస్తున్నారు.

తెలుగువారి సంస్కృతిని జగన్ లాంటివారు చెడగొడుతుంటే అమెరికా వారు కాపాడుతున్నారు. కళాకారుల్లారా మూడు నెలలు ఓపిక పట్టాలి. మళ్లీ మీ గౌరవం మీకు వస్తుంది. ఇంకా రెట్టింపు గౌరవాన్ని పొందుతారు. కళాకారులను అభిమానించే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. కళాకారుడి అభిమాన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE