జనాలకేమో రచ్చబండ ..జగనేమో లండన్కి !
– కార్యకర్తలతో కలసి కదం తొక్కరా?
– కేసులు కార్యకర్తలకు.. జల్సాలేమో జగన్కా?
– వైసీపీ సీనియర్ల అసంతృప్తి
– ఇదేం తీరు నాయకా?
అనకాపల్లిలో మెడికల్ కాలేజీ స్కిట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి లండన్ బయలుదేరారు. పదిహేను రోజుల పాటు విహారయాత్ర కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్న ఆయన శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచే లండన్ బయలుదేరారు.
మళ్లీ నెలాఖరులో అంటే కోర్టు ఇచ్చిన పదిహేను రోజుల గడువు ముగిసే సమయంలో వస్తారు. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు లండన్ లో ఉంటున్నారని చెబుతారు. వారి చదువులు ఎప్పుడో పూర్తయ్యాయి. అయినా అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ నేతలకు ఆందోళనలు పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరులో టైం పాస్ చేసేవారు. ఈ సారి లండన్ వెళ్తూ.. మళ్లీ తాను వచ్చే వరకూ రచ్చబండలు నిర్వహించాలని అసైన్ మెంట్ ఇచ్చి వెళ్లారు. కోటి సంతకాలు తీసుకోవాలని చెప్పారు.
ఆ సంతకాల పుస్తకాలను తాను తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్ కు ఇవ్వాలని అనుకుంటున్నారు. అందర్నీ రచ్చబండ పేరుతో రోడ్లపైకి పోవాలని సూచించి తాను మాత్రం విహారయాత్రకు వెళ్లడం జగన్ స్టైల్. అయితే పార్టీ నేతలు పట్టించుకునే అవకాశాలు కనిపించడం లేదు.
జగన్ వైఖరిపై వైసీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ‘‘ నాయకుడంటే ముందుండి నడిపించాలి. కష్టమైనా నష్టమైనా భరించాలి. అవసరమైతే కేసులు పెట్టించుకోవాలి. అంతేగానీ లీడర్లు-క్యాడర్ను రోడ్డుపాలు చేసి, తాను మాత్రం కుటుంబంతో విదేశాలకు వెళ్లి ఖుషీగా ఉండాలనుకుంటే ఎలా? అది నాయకత్వ ప్రతిభ ఎలా అవుతుంది? జగన్ కూడా మాతో కలసి కదం తొక్కితే కింది స్థాయి కార్తకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుంది. కానీ అసలు నాయకుడే ముఖం చాటేస్తే, క్యాడర్ మాత్రం కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటుంది? ఆ వచ్చిన కొద్దిమందితో జరిగే కార్యక్రమ వార్తలు సాక్షిలో తప్ప ఎవరు రాస్తారు?’’ అని వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కార్యకర్తలు కూడా తెలివి మీరిపోయారని, వారిని బుజ్జగించడం కష్టమవుతోందని సీనియర్లు చెబుతున్నారు. అసలే కేసుల భయానికి చాలామంది వెనుకంజ వేస్తున్నారని, పోలీసులు కేసులు బనాయిస్తుంటే ఎవరూ సాయం రాకపోవడం కూడా కార్యకర్తల నిరుత్సాహానికి మరో కారణమంటున్నారు.
ఇన్చార్జిల వెంట ఉండే రెగ్యులర్ నేతలు తప్ప, పార్టీ కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అసలు విషయం చెబుతున్నారు. పోనీ డబ్బులిచ్చి జనాలను తీసుకువద్దామా అంటే.. అంత అవసరం ఇప్పుడు కనిపించడం లేదని మరో ఎమ్మెల్సీ మరో రహస్యం చెప్పారు. ఇప్పుడు డబ్బులిచ్చి జనాలను తీసుకువచ్చి మా విధేయత ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదని, ఎన్నికల నాటికి రాజెవరో రెడ్డెవరో చూద్దామని వ్యాఖ్యానించారు.
అదే జగన్ విదేశాలకు వెళ్లకుండా.. తమతో కలసి జిల్లాల వారీగా ఆందోళన కార్యక్రమాల్లొ పాల్గొని ఉంటే, సామాన్య కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొనేవారని ఆయన విశ్లేషించారు.
లండన్ నుంచి వచ్చిన తర్వాత సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. ఆయన కోర్టుకు వెళ్లకపోతూండటంతో సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టుకు వెళ్లడం అంటే.. జగన్ నామోషీగా ఫీలవుతున్నారు.
తనపై జరిగిన దాడి కేసులో సాక్షిగా సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లడం లేదు. చివరికి పాస్ పోర్టు కోసం కూడా వెళ్లలేదు. మరి లండన ్నుంచి వచ్చాక అయినా వెళతారా ..ఏదో ఓ సాకుతో పిటిషన్ వేస్తారా అన్నది చూడాల్సి ఉంది.