– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
వీవోఏల హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో వీవోఏలు చేపట్టిన ధర్నాలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు వీవోఏ లకు 26 వేలు జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. అసలు అధికారంలోకి వస్తామని వారికే నమ్మకం లేకుండే. అందుకే ఇష్టానుసారం హామీలు ఇచ్చారు. కానీ అనుకోకుండా తప్పుదారిన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలు గుర్తు లేవు.
ఆయనకు ఒక్క సోనియమ్మ తప్ప తెలంగాణ సోయి లేదు. జై తెలంగాణ అనకుండా జై సోనియమ్మ అంటున్నాడు. సోనియమ్మ కాదు. జీతాలు పెంచాలంటూ ధర్నా చేస్తున్న ఈ తల్లులను చూడాలని సీఎం ను కోరుతున్నా. 8 వేలు ఉన్న వీవోఏ ల జీతం రూ. 26 వేలు చేయాల్సిందే. వారి జీతం పెంచే వరకు వారికి జాగృతి అండగా ఉంటుంది.
మీరు లేకుంటే 64 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లలో మహిళలు ఊరుకుంటారా? ఈ ప్రభుత్వం నడుస్తదా? మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు చేస్తున్న పనికి మాత్రమే సరైన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. ఇంత పనిచేస్తున్న మనకు ఎందుకు యూనిఫాం లేదు? ఏడాదికి కచ్చితంగా రెండు జతల యూనిఫాంలు ఇవ్వాల్సిందే.