Suryaa.co.in

Telangana

మార్చి 31లోగా రైతు బంధు ఇస్తామని చెబుతున్నా

– ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దు
– హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా?

బీఆరెస్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ
కృష్ణా జలాలపై వాళ్లు మళ్లీ అవే అబద్దాలు
మోదీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా?
కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ కు కిషన్ రెడ్డి ఏం చేశారు?
ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు?

– సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారు. సింగరేణిని ప్రయివేటుపరం చేయడాన్ని బీఆరెస్ అడ్డుకోకపోగా ప్రోత్సహించింది. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకెళుతున్నాం.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదికి రూ.6వేల కోట్లు అప్పులు చెల్లించేది. పదేళ్లలో ఏడాదికి రూ.70వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే.. రూ.70వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి దివాళా తీయించారు. ఇంత ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా ప్రతీ నెలా మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం.

మార్చి 31లోగా రైతు బంధు ఇస్తామని చెబుతున్నా… నిస్సిగ్గుగ్గా బీఆరెస్ మమ్మల్ని విమర్శిస్తోంది. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా మా ప్రభుత్వం బడ్జెట్ ఖర్చు చేస్తోంది. మమ్మల్ని అభినందించాల్సింది పోయి.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అబద్దాలు చెబుతున్నారు. ఇది నలుగురి ఘోషనే తప్ప వాళ్ల పార్టీ వాళ్లు కూడా ఆమోదించడం లేదు. మేం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళుతున్నాం.

ఉద్యోగ నియామకాల్లో చిక్కు ముడులు విప్పుతూ 60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నిర్లక్ష్య ధోరణితో బీఆరెస్ గాలికి వదిలేస్తే మేం నియామకాయాలు చేపట్టాం.. మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. మీరు ఎక్కడికక్క వదిలేసిన సంసారాన్ని మేం చక్కదిద్దుతున్నాం..

మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది అంటుంటే…మేడిగడ్డలో నీళ్లు అన్నారంలో పోయాలని హరీష్ అంటున్నారు. హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా? ఎలా కుంగిపోయిందో సమాధానం చెప్పరు.. చూసొద్దామంటే రారు. బీఆరెస్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. కృష్ణా జలాలపై వాళ్లు మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారు. ఈ వేదికగా బీఆరెస్, బీజేపీ లకు సవాలు విసురుతున్నా

మీ 2014, 2018 ఎలక్షన్ మేనిఫెస్టో.. 2023లో మా ఆరు గ్యారెంటీల హామీలపై ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చిద్దాం. ఇందుకు బీఆరెస్, బీజేపీ సిద్ధమా? బీఆరెస్, బీజేపీ.. కాంగ్రెస్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాయి. మూడోసారి మోదీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా? కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ కు కిషన్ రెడ్డి ఏం చేశారు?

హైదరాబాద్ లో వరదలు వచ్చినపుడు నిధులు తెచ్చారా? మీకు కేసీఆర్ కు తేడా ఏం లేదు. ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? రేపు సాయంత్రం 5గంటలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ పథకాలను ప్రారంభిస్తున్నాం. మిమ్మల్ని ఆహ్వానించినా ఎందుకు రావడంలేదు? బాధ్యత లేకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

రాజకీయ కాంక్షతో ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురాశ తప్ప బీజేపీ, బీఆర్ కు వేరే ఆలోచనలేదు. బరువు, బాధ్యతతో ప్రజలకు సేవచేస్తున్నాం. శక్తినంతా కూడదీసుకుని ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం. మమ్మల్ని ప్రశ్నించే హక్కు బీజేపీ, బీఆరెస్ కు లేదు. గ్యారంటీల అమలు నిరంతర ప్రక్రియ.. అర్హులు ఎప్పుడైనా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దు.

 

LEAVE A RESPONSE