Suryaa.co.in

Political News

నకిలీకి కేరాఫ్‌ బీజేపీ

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ బయటపెడుతున్న నిజాలు. ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బీజేపీ పరివారం ఇంతకాలం సాగించిన అసత్యాల బాగోతాన్ని ఈ చాట్‌బాట్‌ ఆధారాలతో సహా తుత్తునియలు చేస్తున్నది.

– అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న టాప్‌-10 ఇండియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు
– అసత్య వార్తల్ని ప్రచారం చేసే వాళ్లంతా కమలదళమే
– పార్టీ నేతలు, సానుభూతి పరులు ఇలా అందరూ వాళ్లే
– నెటిజన్‌ ప్రశ్నకు ‘గ్రోక్‌’ చాట్‌బాట్‌ వివరణాత్మక జవాబు.

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ బయటపెడుతున్న నిజాలు ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బీజేపీ పరివారం ఇంతకాలం సాగించిన అసత్యాల బాగోతాన్ని ఈ చాట్‌బాట్‌ ఆధారాలతో సహా తుత్తునియలు చేస్తున్నది.

ఈ క్రమంలో ‘ఎక్స్‌’ వేదికగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న టాప్‌-10 ఇండియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్ల్లు జాబితాను విడుదల చేయాలంటూ ‘గ్రోక్‌’ను అఖిలేశ్‌ మౌర్య అనే ఓ నెటిజన్‌ కోరారు. ‘ఫ్యాక్ట్‌-చెకింగ్‌ డాటా మార్చి-2025’ ప్రకారం గ్రోక్‌ విడుదల చేసిన ఈ జాబితాలోని అందరూ దాదాపుగా బీజేపీ నేతలు లేదా ఆ పార్టీ సానుభూతిపరులు కావడం గమనార్హం.

నుపుర్‌ శర్మ :
గతంలో బీజేపీ ప్రతినిధిగా విధులు నిర్వహించారు. ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన డిబేట్‌లో మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆమె ఇప్పటికీ బీజేపీకి సానుభూతిపరురాలిగా కొనసాగుతున్నారు.

రాహుల్‌ రోషన్‌ :
ఓపీఇండియా వెబ్‌సైట్‌కు సహవ్యవస్థాపకుడు. బీజేపీకి అనుకూలంగా ఈ వెబ్‌సైట్‌ వార్తలను ప్రచురిస్తుందనే ఆరోపణలున్నాయి. 2020 ఢిల్లీ అలర్లు, కొవిడ్‌ వ్యాప్తికి సంబంధించి రాహుల్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెరిఫై చేసుకోకుండా పోస్టులు పెట్టడం వివాదమైంది.

అమిత్‌ మాలవీయ :
బీజేపీ ఐటీ సెల్‌కు ఇంచార్జ్‌. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 2020లో రైతన్నలు సాగించిన ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి తప్పుడు వార్తలు ప్రసారం చేశారన్న ఆరోపణలున్నాయి. రైతు ఆందోళనను తప్పుదోవ పట్టించడానికి వీడియోలను మార్ఫింగ్‌ చేసినట్టు వార్తలొచ్చాయి.

అర్ణబ్‌ గోస్వామి :
అర్ణబ్‌ గోస్వామి రిపబ్లిక్‌ టీవీ ఎండీగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఈయన చర్చా కార్యక్రమాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో తప్పుడు కథనాలను ప్రసారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

కంగనా అండ్‌ టీమ్‌:
కంగన బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ. 2020-21 రైతుల ఉద్యమం, 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లు, కొవిడ్‌-19, భారత స్వాతంత్య్ర పోరాటం ఇలా పలు అంశాలపై తప్పుడు వార్తల్ని ప్రచారాన్ని చేశారంటూ ఆరోపణలున్నాయి.

వివేక్‌ అగ్నిహోత్రి :
దర్శకుడు. బీజేపీ సానుభూతిపరుడు. కశ్మీర్‌పై బీబీసీ సర్వేను మార్ఫింగ్‌ చేశారని ఆరోపణలున్నాయి. నకిలీవార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిగా పేర్కొన్నందుకు అగ్నిహోత్రికి తాను క్షమాపణ చెప్పినట్టు జరుగుతున్న ప్రచారం తప్పేనని ‘గ్రోక్‌’ తేల్చిచెప్పింది.

షెహజాద్‌ :
బీజేపీ జాతీయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి అమెరికా 21 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసిందంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.

కపిల్‌ శర్మ :
ఢిల్లీ బీజేపీ మంత్రి. 2020 ఢిల్లీ అలర్లకు సంబంధించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ‘ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌’గా అభివర్ణిస్తూ ఆప్‌ను టార్గెట్‌ చేయడం వివాదానికి దారితీసింది.

సురేశ్‌ చావాంకే :
బీజేపీ అనుకూల మీడియా సుదర్శన్‌ టీవీ సీఎండీ. 2020లో ‘యూపీఎస్సీ జీహాద్‌’ పేరిట ఒక వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ ప్రోగ్రామ్‌ను ప్రసారం చేశారు. ఇది వివాదాస్పదమైంది. పలు నకిలీ వార్తలను ప్రచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

పుష్పేంద్రకుమ్‌:
ఈయన ఓ క్రిప్టో ఇన్‌ఫ్లుయెన్సర్‌. బిట్‌కాయిన్‌కు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.

– కాపు శ్రీనివాస్

LEAVE A RESPONSE