-పోచారం, గాజులరామారం స్వగృహ టవర్స్ కోనుగోలుకు ముందుకు వచ్చిన బిల్డర్లు, ఉద్యోగుల సంఘాలు
-పేమెంట్స్ గడువు పెంచాలని, సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించాలని కోరిన బిల్డర్లు, ఉద్యోగులు
-ప్రభుత్వానికి నివేదిస్తామన్న అధికారులు
హైదరాబాద్ : రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు సంబంధించిన టవర్లు అమ్మకాల కోసం సోమవారం జరిగిన ప్రి బిడ్ సమావేశం విజయవంతం అయ్యింది. ప్రీ బిడ్ సమావేశానికి 50 మందికి పైగా బిల్డర్లు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య ఆధ్వర్యం లో జరిగిన ఈ ప్రీ బిడ్ సమావేశానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) సెక్రెటరీ పి. చంద్రయ్య, హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి లతో పాటు గృహ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్ ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా అమ్మకాలకు పెట్టిన విషయం తెలిసిందే. పోచారంలో 9 అంతస్తుల నాలుగు(4) టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్ లో కనీసం 72 నుంచి 198 ప్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు(5) టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్ లో 112 ప్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది.
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి బిల్డర్లు, డెవలపర్లు, పలు ఎంప్లాయిస్ సొసైటీలు ఆసక్తి కనబరిచాయి. రేపట్లో పాల్గొన్న వారు కొన్ని సూచనలను చేశారు. ఫైనల్ పేమెంట్స్ గడువు పెంచాలని, సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించాలని, జీఎస్టీ భారం లేకుండా చూడాలని బిల్డర్లు, ఉద్యోగుల సంఘాలు ప్రతినిధులు అధికారులను కోరారు. ప్రీ బిడ్ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాజీవ్ స్వగృహ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య వారికి వెల్లడించారు.