కశ్మీరీ యాపిల్ పై ట్రాఫిక్ పంజా

(రాఘవశర్మ)

అందమైన సరస్సులు, సుందరమైన హిమాలయాలు, వాటి సానువుల్లో ఎత్తైన దేవదారు వృక్షాలు, లోతైన పచ్చని లోయలు, వాటిలో ఆపిల్ తోటలు, కుంకుమ తోటలు, పండ్ల తోటలు, ఓహ్.. ఒక భూతల స్వర్గం కశ్మీరం; అది ఒకప్పటి మాట.
ఇప్పుడు తుపాకీ నీడలో బిక్కుబిక్కుమంటున్న బతుకులు.
ఆ బతుకులపైన ట్రాఫిక్ రూపంలో రాజ్యం ఉగ్ర పంజా విసిరింది.
ట్రాఫిక్ లో కాసేపు ఇరుక్కుపోతే విసుగెత్తిపోతాం.
గంట సేపు ట్రాఫిక్ ఆగిపోతే మనకు ఊపిరాడదు.
వారం రోజుల పైగా ట్రాఫిక్ ఆగిపోతే!?
ఎప్పుడూ లేని ఆనరకయాతనను ఇప్పుడు కశ్మీర్ యాపిల్ రైతులు అనుభవిస్తున్నారు.
జమ్ము, శ్రీనగర్ మధ్య జాతీయ రహదారిలో, మూడు వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయింది.
ఎనిమిది వేల యాపిల్ పండ్ల ట్రక్కులు వారం రోజులుగా అలా నిలిచిపోయాయి.
ఆపిల్ రైతులు లబోదిబో మంటున్నారు.
ఇక సాధారణ ప్రయాణీకులు, ముఖ్యంగా పిల్ల పాపలు అల్లాడిపోతున్నారు.
సరుకుల రవాణా కూడా ఆగిపోయింది.
ట్రాఫిక్ దానంతట అది ఆగిపోలేదు.
అధికార యంత్రాంగమే ఆపివేసింది.
కార్పొరేట్ శక్తులకు భూములు అమ్మనందుకు, తమ చేతికి ఏ శ్రమా లేకుండా అధికార యంత్రాంగం ద్వారా రైతుల కడుపుపైన ఇలా ఒక్క దెబ్బ కొట్టారు.
ఒకటి కాదు, రెండు కాదు, 800 ట్రక్కుల్లో ఉన్న 56 లక్షల ఆపిల్ పండ్ల పెట్టెలు జాతీయ రహదారి మధ్యలో ఆగిపోయాయి.
ఆ దెబ్బకు 640 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లి, కశ్మీర్ లో 75 లక్షల ఆపిల్‌ రైతు కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి.
కశ్మీర్ ఆపిల్ చాలా ప్రసిద్ది చెందింది.
ఇక్కడ నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి.
విదేశాల్లో కూడా కశ్మీర్ యాపిల్ అంటే ప్రసిద్ది కనుక, ఇక్కడ నుంచి వివిధ దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
కశ్మీర్ లో 2014లో కురిసిన భారీ వర్షాలకు ఇతర రైతులతో పాటు ఆపిల్ రైతులు కూడా అతలాకుతలమైపోయారు.
ఆ భారీ నష్టం నుంచి ఇంకా కోలుకోనే లేదు.
ఈ ఏడాది తగిన వర్షాలు పడి, వాతావరణం అనుకూలించి ఆపిల్ పంట దిగుబడి బాగా పెరిగింది.
కాస్త ఊపిరి పీల్చుకుందామనుకుంటున్న సమయంలో ట్రాఫిక్ రూపంలో దెబ్బపడింది.
ఆపిల్ ట్రక్కులు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలో వారం రోజుల పైగా నిలిచి పోవడంతో ఇటు ఆపిల్ పండించే చిన్న మధ్యతరగతి రైతులే కాకుండా, అటు మండీ వ్యాపారులు, ట్రక్కుల యజమానులు, డ్రైవర్లు కూడా భారీగా నష్టపోతున్నారు.
ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయిందంటే, భారీ వర్షాలకు కొండచెరియలు విరిగి రోడ్డుపైన పడడం వల్లనో, జాతీయ రహదారి మరమ్మతుల వల్లనో, పునర్నిర్మాణం వల్లనో ట్రిఫిక్ ను మళ్ళించడం వల్ల ఆగిపోయిందని అధికారులు సాకులు చెపుతున్నారు.
ఇవేకారణాలైతే ట్రాఫిక్ ను క్రమ బద్ధం చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది!?
పాలనా యంత్రాంగం ఏం చేస్తోందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ట్రాఫిక్ లో ఆపిల్ ట్రక్కులు ఆగిపోయిన విషయాన్ని ఆపిల్ ఫార్మర్స్ ఫెడరేష ఆఫ్ ఇండియా (ఏఎస్ఎస్ఏ) నాయకులు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు.
ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అధికారులను ఆదేశించామని లెఫ్టినెంట్ గవర్నర్ ఏఎస్ఎస్ఏ నాయకులకు చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యం.
ట్రాఫిక్ అంగుళం కూడా కదలలేదు.
ఈ పరిస్థితిని నిరసిస్తూ ఆపిల్ మండీల వ్యాపారులు గత ఆది, సోమ వారాలలో బంద్‌ను పాటించాయి.
ఫలితంగా శ్రీనగర్, సోపూర్, షోపియాన్, పుల్ వామా, కుల్ గం, పచ్చర్, అనంతనాగ్, హింద్ వారా, బారాముల్లా, గుండుర్ బాల్ వంటి పది మండీలు మూత‌ప‌డ్డాయి.
ఇది ఆపిల్ పంట దిగుబడికి వచ్చిన కాలం.
ఎగుమతి చేయడానికి ఒక్కొక్క బాక్సులో 20 కిలోల ఆపిల్ పళ్ళు పెడతారు.
ఒక్క ట్రక్కుకు 1200 బాక్సులు పడతాయి.
మూడు వందల కిలోమీటర్ల మేర ఎనిమిది వేల ట్రక్కులు రోజుల తరబడి నిలిచిపోతే, ఆ ఆపిల్స్ ఎందుకైనా పనికివస్తాయా!?
ఒక వేళ పనికి వచ్చాయే అనుకుందాం, ఇన్ని ట్రక్కుల ఆపిల్ పండ్లు ఒక్క సారిగా మండీలకు వెళితే, అక్కడ బడా వ్యాపారులు మండీలకు దిగుబడి పెరిగిందని తగిన ధర ఇవ్వరు.
గిట్టుబాటు కాని ధరలకు వారు అమ్మనూ లేరు, వెనక్కి తీసుకు వెళ్ళనూ లేరు.
అడకత్తెరలో పోక చెక్కలాగా ఆపిల్ రైతులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు.
మార్కెట్ కు సరుకు సకాలానికి చేరకపోవడం వల్ల కార్పొరేట్ శక్తులు కృత్రిమ కొరత సృష్టించి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆపిల్ ధరలను విపరీతంగా పెంచేస్తాయి.
పేద మధ్యతరగతి రైతులు శీతల గిడ్డంగుల్లో పంట దిగుబడిని నిలువ చేసుకోలేరు.
వచ్చిన పంట వచ్చినట్టు అమ్ముకుంటే తప్ప నిలదొక్కుకోవడం సాధ్యం కాదు.
ఈ ట్రాఫిక్ తగ్గి మండీలకు ఒక్క సారిగా ఆపిల్ వెళితే, వాటి ధర దారుణంగా పడిపోతుంది.
ఆపిల్ కిలో 60 రూపాయల చొప్పునైనా తమ దగ్గర కొనందే గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు.
ఆపిల్ కనీస మద్దతు ధర ఇచ్చే ఏర్పాటు అధికార యంత్రాంగం వద్ద లేదు.
ఆపిల్ ధర మర్కెట్లో డిమాండ్, సరఫరాల దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి ఉంది.
కార్పొరేట్ శక్తులు దీన్ని ఆసరా చేసుకుని ఆపిల్ రైతులను దెబ్బతీయడానికి, తద్వారా వారి భూములను కారు చౌకగా కొనేయడానికి కాచుక్కూర్చున్నాయి.
దానికి ట్రాఫిక్ సమస్యను ప్రయోగించాయి.
కశ్మీరి ఆపిల్ రైతులు అసలు ఎవరు!?
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947లో పాకిస్థాన్ నుంచి సాయుధ మూకలు కశ్మీర్ లోకి చొచ్చుకు వస్తున్నప్పుడు వారిని నిలువరించడానికి ప్రాణాలను సైతం తెగించి పోరాడిన కశ్మీరీల వారసులు, వారి మనుమలు, మునిమనుమలు ఈ రైతులు.apple-disకశ్మీర్ మన భూభాగం అనుకుంటున్నప్పుడు అక్కడ నివసించే ఆపిల్ రైతులు మనభారతీయులు కాకుండా ఎట్లాపోతారు!?
వారిపైన ఈ ట్రాఫిక్ పంజా విసరడమేమిటి?
ఎనిమిదేళ్ళ క్రితం మోడీ, అమిత్ షా ద్వయం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పబ్లిక్ రంగ సంస్థలన్నిటినీ అమ్మకానికి పెట్టేశారు.
బీఎస్ఎల్, ఎల్‌ఐసీ, ఓడరేవులు, బ్యాంకులు, రైల్వేలు, బొగ్గుగనులతో పాటు చివరికి రక్షణ రంగం కూడా ఆదాని, అంబానీల చేతుల్లోకి ఒకటొకటిగా వెళ్ళిపోతున్నాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న దేశ సంపద చాలదన్నట్టు ఈ కొర్పొరేట్ శక్తుల కన్ను ఇప్పుడు కశ్మీర్ పై పడింది.
మూడేళ్ళ క్రితం వరకు మిగతా దేశం కంటే జమ్ము కశ్మీర్ ప్రజలు కొంత భిన్నమైన స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించే రాజ్యాంగంలోని 370 వ అధికారణాన్ని, 35 ఏ సెక్షన్ ను కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ శక్తుల కోసమే రద్దు చేసినట్టుంది.
అప్పటి నుంచి ఈ కొర్పొరేట్ శక్తుల కన్ను కశ్మీర్ పైన పడింది.
అక్కడి భూముల పైన పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ భూములను కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి ఆపిల్ రైతులు ససేమిరా అంటున్నారు.
కశ్మీరి రైతులకు అయాచితంగా వచ్చే ఎక్కువ డబ్బు పైన ఆశలేదు.
కన్న తల్లి లాంటి నేలను నమ్ముకున్నారు.తమ శ్రమశక్తి పైన తాము బతకగలమన్న ఆత్మవిశ్వాసం వారి గుండెల్లో బలంగా ఉంది.
కశ్మీరి రైతులను ఎలా లొంగ దీసుకోవాలి?
వారికి నయానా భయనా చెపితే వినేలా లేరు.
ఆపిల్ పంటచేతికొచ్చి, మండీలకు తరలించే సమయంలో అధికార యంత్రాంగమే ట్రాఫిక్ ను నిలుపుదలచేసింది.
ఒక్క ఏడాది పంట దెబ్బతింటే రైతు కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది!?అదే ఇప్పుడు జరగబోతోంది.
ఆపిల్ పంట ఇక గిట్టుబాటు కాదని భూములు అయినకాడికి కార్పొరేట్ శక్తులకు అమ్ముకునే పరిస్థితిని తెచ్చిపెడుతున్నారు.
లక్ష 44 వేల 825 హెక్టార్లలోని ఆపిల్ పంట, 1.7 మిలియన్ టన్నుల ఉత్పత్తి, ఆరువందల కోట్ల రూపాయల ఎగుమతులు ఈ ట్రాఫిక్ వల్ల ఏం కావాలి!?
జమ్ము, శ్రీనగర్ మధ్య తాజాగా గురువారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు ట్రక్కులనే కాదు, సాధారణ ట్రిఫికను కూడా అధికారయంత్రాంగం నిలిపివేసింది.
కశ్మీరునంతా పారామిటరీ దళాలు, సైన్యంతో ప్రభుత్వం నింపి వేసింది.
రోడ్డు నిర్మాణం, మరమ్మతులు, కొండచరియలు విరగిపడడం వల్లనే ఈ ట్రాఫిక్ స్తంభన జరిగితే, అక్కడే ఉన్న పారామిటరీ దళాలను, సైన్యాన్ని ట్రాఫిక్ పునరుద్ధరణకు ఎందుకు ఉపయోగించ కూడదు !?
చొరబాట్ల పేరుతో, ఉగ్రవాదం పేరుతో కశ్మీరీల ప్రాణాలను తీయడానికి బదులు వారి సేవలను ప్రకృతి విపత్తుల సమయంలో ఎందుకు వినియోగించుకోవడం లేదు!?

సమాధానం తెలిసిందే, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల సేవలో రాజ్య యంత్రాంగం తరిస్తోందనేది నేటి కథనం.

Leave a Reply