– భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్పేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా మూడేళ్లలో ఎంత మందికి లబ్దిచేకూర్చారని, ఎన్ని నిధులు ఖర్చుచేశారనని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆయన విమర్శించారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు పనిలేకుండా పోయిందన్నారు. పేరుకు 3 ఎస్సీ వెల్పేర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, 56 బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వైకాపా నాయకులకు ఈ కార్పొరేషన్ల ఛైర్మన్లు, సభ్యుల పదవులిచ్చి, జీతాలిచ్చి, కార్పొరేషన్లకు మాత్రం నిధులివ్వకుండా ఆయా వర్గాలను వంచించిందన్నారు.
పైగా కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి ఆ నిధులను దారి మళ్లించిందన్నారు. ఈ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు, జీవోనాపాధి పథకాలు, పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలను అమలుచేయకపోవడంతో లబ్దిపొందుదామనుకున్న ఆయా వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కార్పొరేషన్ ద్వారా అమలుచేసే పథకాలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చుచేశారో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకాలను పేదలందరికీ అమలుచేయక, కొన్నివర్గాలకు మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు.
ఈ పథకంలో కూడా కుల, మతాలకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయం చేయవద్దని విమర్శించారు. లబ్దిదారులైన వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలనే నిబంధన విధించడం సమంజసం కాదన్నారు. చదువుకున్న వారికి ప్రభుత్వం డబ్బులివ్వాల్సిన అవసరం లేదని, వారు పనిచేసుకుని బతుకుతారని, పేదలకు ఇవ్వాలని సూచించారు.