ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా… పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. అయితే.. అందరూ అనుకున్నట్లే ఐదు రాష్ట్రాల్ల ఎన్నికల్లో ఎక్కువ హడావుడి ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో మాత్రం సందడి కనిపిస్తోంది. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడులో కోలీవుడ్ ఉండటం వల్ల అక్కడ ఉదయాన్నే రజనీకాంత్, అజిత్ లాంటి సినీ ప్రముఖులు వచ్చి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ అయిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఓటు వేయడానికి తమిళనాడు వచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కమ్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.