పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వద్దిరాజు

ఖమ్మం: ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కీలకమైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత పెట్రోలియం, సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియామకం చేస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదలైంది. పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు చేపట్టిన పునర్నియామకాలలో వద్దిరాజు కు కీలకమైన స్థాయి సంఘం వరించింది.

ఆయన ఈ కమిటీ సభ్యుడిగా తన రాజ్యసభ పదవీకాలం వరకు కొనసాగుతారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, సహజవాయువు నిక్షేపాలు సంబంధిత అంశాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఉభయ సభలకు ఈ అంశాలపై అవసరమైన సూచనలు కూడా చేస్తుంది. పెట్రోలియం, సహజవాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన వద్దిరాజు రవిచంద్ర ను టీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సహచర పార్లమెంట్ సభ్యులు అభినందించారు.

Leave a Reply