కులపెద్ద రాచపుండు రాముకు భూదాహం ఎక్కువ.

– ఇతరుల కొనుగోళ్లపై ‘అనుమానాలూ’ ఈర్ష్య ఎక్కువే!
(విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు)

అరవై ఏళ్ల క్రితం చిట్‌ ఫండ్‌ కంపెనీ యజమానిగా అవతారమెత్తాడు. ‘చెరుకూరి రాము (సీహెచ్‌ రామోజీరావు). ‘డబ్బు కోసమేనా చింత, మార్గదర్శి ఉన్నది మీ చెంత ’ అనే నినాదంతో 1962లో మొదలైన చిట్టీల వ్యాపారంతో ఆగలేదు. ‘అరే, రైతు కొడుకునయి ఉండి నా తండ్రి పొలం అమ్మేశానే,’ అనే ‘అపరాధభావం’తో 1969లో రైతన్నల కోసం ‘అన్నదాత’ అనే మాసపత్రికను ప్రారంభించానని ఆయన చెప్పుకునేవాడు.
ఇలా తెలుగునాట వ్యవసాయాధారిత సామాజిక వర్గాల ‘ఆత్మబంధువు’గా కనిపించే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల తర్వాత 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ‘ఈనాడు’కు తెరతీశారు. మరుసటి ఏడాదే (1975) హైదరాబాద్, నాలుగేళ్లకు (1978) విజయవాడలో తన పత్రిక ఎడిషన్లు ప్రారంభించి తెలుగు పత్రికా ప్రపంచంలో విజృంభించారు. ఈ మూడు ఎడిషన్లూ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి ప్రోత్సాహంతోనే ఆరంభమయ్యాయి.

విశాఖలో ఈనాడు పెట్టిన ఏడాదిలోపే దేశంలో ఎమర్జెన్సీ విధించారు. పాలకపక్షం సహాకారంతో పత్రిక పెట్టినందువల్లో, ఎందుకొచ్చిన రిస్కు అనుకున్నారో గాని,భయంతో అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు అనుకూలంగానే ఈనాడు నడుచుకుంది. ఇక్కడ రాము స్వభావానికి సంబంధించిన అసలు విషయం చెప్పక తప్పదు. విశాఖ, హైదరాబాద్, విజయవాడ ఈనాడు కార్యాలయాలను ఇతరుల నుంచి లీజుకు తీసుకున్న భూములపై కట్టిన భవనాలలో నడిపించారు. ఈ స్థలాల యజమానులను విసిగించి, వేధించి ఇబ్బంది పెట్టారే గాని స్థలాలను ఖాళీ చేయలేదు.

చివరికి దిక్కులేని స్థితిలో ఈ భూముల ఓనర్లు వాటిని రాముకు మంచినీళ్లకు అమ్మక తప్పలేదు. రాముకు అస్సలు నచ్చని విషయం లీజుకు తీసుకున్న భూములను సకాలంలో ఖాళీ చేయడం. ఇతరుల ఆస్తులన్నా, భూములన్నా రాముకు వల్లమాలిన ప్రేమ. తాను అద్దెకు తీసుకున్న నేలలపై రాము గుండెల్లో పెరిగే ‘ప్రేమాభిమానాలే’ అంతిమంగా వాటిని ఆయన దక్కించుకునేలా (వాల్చుకునేలా) చేశాయని ఈనాడు మాజీ ఉద్యోగులు చెబుతారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి రైతు కుటుంబంలో పుట్టిన రాముకు వ్యవసాయం ఇష్టమైన పని కాదు కాని, ఆయనకు అపరిమితంగా భూములు సొంతం చేసుకోవాలన్న కోరిక చాలా బలమైనదనడానికి అనాజ్‌ పూర్‌ లో ఆయన చేసిన కొనుగోళ్లు చక్కటి నిదర్శనం.

వ్యాపారం కోసం సొంతూరులో పదెకరాలు అమ్మి , ప్రయోజనం పొందాక ఆయన వేలాది ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో సొంతం చేసుకున్నారు. రాముకు తన లావాదేవీలన్నీ సక్రమమే. తాను కొన్న భూముల్లోని చెరువులు, కుంటలు చక్కగా కలుపుకోవడం చట్టబద్దమే అంటాడు. తనకు ప్రత్యర్ధులుగా కనిపించేవారు చేసే భూముల కొనుగోళ్లు ఆయనకు సవ్యంగా అగుపించవు. గిట్టనివారు చట్టబద్ధంగా చేసిన వ్యాపార లావాదేవీల్లో ‘కుంభకోణాలు’ కనిపిస్తాయి. వాటిలో ఎంత రంధ్రాన్వేషణ చేసినా లొసుగులు కనిపించపోతే ఆయన బుర్ర వేడెక్కిపోతుంది.

ఫలితంగా, అబద్ధాలు, అర్థసత్యాలతో కూడిన కథనాలు రాయించి ఈనాడులో వేయించడం రాముకు ఆనవాయితీగా మారింది. నవంబర్‌ 16న 86 ఏళ్లు నిండుతున్న ఈ ‘పెద్ద మనిషి’ బుద్ధులు మరో నాలుగేళ్లకైనా మారతాయా? పాపి చిరాయువు అన్న సామెత నిజమేనా? సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అనైతికంగా క్షమించరాని అనేక తీవ్రనేరాలకు పాల్పడ్డ రాము చట్టం చేతిలో తప్పించుకోగలడేమో కానీ భగవంతుని చేతిలో ఈ జన్మలోనే శిక్ష అనుభవింపక తప్పదు. ఎందుకంటే మరోజన్మ ఉంటే ఇతనికి మానవజన్మకు అర్హుడు కాడు.

Leave a Reply