విజయవాడ హెల్త్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మార్పు

– శాసనసభలో సవరణ బిల్లు
-ఆ సవరణ బిల్లుపై మాట్లాడుతూ సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:

హెల్త్‌ యూనివర్సిటీకి గతంలో తెలుగుదేశం పార్టీ వారు ఎన్టీఆర్‌గారి పేరు పెట్టారు. ఆ పేరు మార్చి ఈరోజు వైయస్సార్‌గారి పేరు పెడుతున్న ఈ సవరణ బిల్లుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఉండి ఉంటే బాగుండేది. చంద్రబాబునాయుడుగారు కూడా వాళ్లతో గొడవ చేయించడం, వాళ్లు కూడా గొడవ చేసి సస్పెండై వెళ్లిపోవాలనే ఉద్దేశంతో రావడం మనం చూశాం.

కానీ ఎందుకు ఈ మాదిరిగా చేస్తున్నాం. కారణాలు ఏంటి? అవి సహేతుకమా? కాదా? అన్న అంశాల మీద చర్చలో వాళ్లు కూడా పాలుపంచుకుంటే బాగుండేది. ప్రభుత్వం తరపున ఎందుకు ఈ విధంగా చేస్తున్నామన్న దానికి కారణాలు కూడా వాళ్లు తెలుసుకుంటే బాగుండేది.

ఎన్టీఆర్‌గారు అంటే చంద్రబాబునాయుడుగారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్‌రెడ్డే ఇస్తాడు. ఎన్టీ రామారావుగారు అంటే నాకు ఎటువంటి కోపమూ లేదు. గతంలో కూడా ఎన్టీ రామారావుగారికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. అంతో ఇంతో ఆయన మీద ప్రేమ తప్ప ఆయన్ను అగౌరవపరిచే కార్యక్రమం నా వల్ల జరగదు. నందమూరి తారక రామారావు అనే పేరు మనం పలికితే చంద్రబాబునాయుడుగారికి నచ్చదు. చంద్రబాబుగారు ఎన్టీ రామారావు పలికితే పైనున్న ఎన్టీ రామారావుగారికి నచ్చదు.

ఎన్టీఆర్‌గారు గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి అని చెప్పని వారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే ఎవరూ ఉండరు. గొప్ప నటుడు, గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా దాదాపు 7 సంవత్సరాలు పరిపాలన చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే… బహుశా ఇంకా చాలా కాలంపాటు బ్రతికుండే వారు. ముఖ్యమంత్రిగా కూడా కచ్చితంగా రెండో దఫా పూర్తి చేసి ఉండేవారు. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవకపోయి ఉంటే, ఆయన బ్రతికి ఉంటే.. చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కూడా అయ్యి ఉండేవాడు కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్టీ రామారావుగారు రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని స్ధాపించడం మనం చూశాం.

1995లో ఆయన తన సొంత అల్లుడు వెన్నుపోటు, దానికి తోడు ఈనాడు రామోజీరావుగారి పథక రచన, మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఆయన డబ్బుల సంచులు మోయడం.. ఇటువంటి వాటివల్ల మానసిక క్షోభకు గురైన ఎన్టీఆర్‌గారు అకాల మరణం చెందారు. ఆయన మరణించి చాలా కాలం అయినప్పటికీ, మన పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా.. దివంగత మన ప్రియతమ నేత రాజశేఖర్‌రెడ్డిగారు ఆ రోజుల్లో ఎన్టీఆర్‌కు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో ఉన్నా.. ఎన్టీఆర్‌ గారిని మన పార్టీ తరపున ఏనాడు కూడా ఒక్కమాట కూడా అనలేదు.

నేను నా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెడతానని చెప్పడం..ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్‌ పేరు ఆ జిల్లాకు పెట్టాం. వీడియో క్లిప్పింగ్స్‌తో నా చెల్లెమ్మ ఆరోగ్య శాఖ మంత్రి రజని చంద్రబాబునాయుడుగారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మధ్య జరిగిన సంభాషణ వివరాలను కూడా స్క్రీన్‌ మీద చూపించారు. ఏ రకంగా 2019 ఎన్నికలకు వెళ్లేటప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుతూ.. ఎన్టీ రామారావుగారి పేరే లేకుండా చేయాలి, ఆయన పేరుని ఎలా మర్చిపోయేటట్లు చేయాలన్న మాటలు మనం చూశాం. ఆ మాట్లలో కూడా ఎన్టీఆర్‌ గారంటే ఏమాత్రం గౌరవం లేకుండా వాడు, వీడు అని సంబోధించడం కూడా మన కళ్లారా చూశాం.. మాటలన్నీ విన్నాం.

ఎన్టీఆర్‌ పేరు ఎందుకు మార్చాలనుకున్నాడో చంద్రబాబునాయడుకే తెలియాలి? చంద్రబాబునాయుడుగారికి ఎన్టీఆర్‌ తన కూతురుని బహుమతిగా ఇస్తే.. చంద్రబాబుగారు ఎన్టీఆర్‌ గారికి వెన్నుపోటును రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎన్టీఆర్‌ను మానసికంగా దెబ్బ తీసి, ఆయన ఆరోగ్యాన్ని పాడయ్యేలా చేసి, ఆయన మరణానికి కారణమైన వారు ఈరోజు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అంటూ నినాదాలు చేయడమంటే ఇంత కంటే దారుణం ఎక్కడా ఉంటుందా? ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నాను.

చంద్రబాబు గారు ఆనేకసార్లు చెప్పుకుంటారు. ఆయన కేంద్రంలో చక్రం తిప్పేసినట్టు.. తిప్పేసిన రోజులను కూడా మనందరికీ గుర్తుకు రావాలని, వచ్చేటట్లు కూడా ఆయనంతట ఆయనే జ్ఞాపకం చేసుకుని మనకు చెబుతుంటారు. ఎంతోమందిని రాష్ట్రపతులను చేశానని, ఎంతోమందిని ప్రధానమంత్రులను చేశానని, చివరకి మోదీగారు కూడా తనకన్నా జూనియర్‌ అని.. ఇటువంటి మాటలు అన్నీ సర్వ సహజంగా చంద్రబాబుగారి నోటి నుంచి చాలా సార్లు వినే ఉంటాం. ఎన్నో గొప్ప విషయాలు చెప్పిన ఈ వ్యక్తి చంద్రబాబుగారు ఎన్టీఆర్‌గారికి భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయాడో మాత్రం చెప్పనే చెప్పడు. అధికారంలో చంద్రబాబునాయుడుగారు లేనప్పుడు మాత్రమే ఎన్టీ రామారావుగారు చంద్రబాబునాయుడు గారికి గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి సహకరించిన ఈనాడు రామోజీరావు వంటి వారికి కూడా కేంద్రం నుంచి ఈయన అవార్డులు ఇప్పిస్తాడు. అవి వస్తాయి. కానీ ఎన్టీఆర్‌ గారికి మాత్రం భారతరత్న అవార్డు రాదు.

ఇటువంటి డ్రామాలు, మనసులో ఒకటి పెట్టుకుని బయట మరో రకంగా ప్రవర్తించే రాజకీయ నాయకులు మధ్య రాజకీయాలు నలుగుతున్నాయి. రాజకీయాల్లో ఇవాళ చిత్తశుద్ది కరవైన రోజుల్లో మనమంతా బ్రతుకుతున్నాం. ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు బిల్లుపై.. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. మనం చేస్తున్నది కరెక్టేనా? అని. అన్ని ఆలోచన చేసిన తర్వాత ఇది కరెక్ట్‌ అని అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేశాం.

ఈరోజు వైయస్సార్‌గారు (నాన్నగారు) డాక్టర్‌ వైయస్సార్‌గా అందరికీ చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 వంటి పథకాలన్నింటికి కూడా సృష్టికర్త ఎవరు?. అంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఆ దివంగత నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు. నాన్నగారు చదువురీత్యా కూడా ఎంబీబీఎస్‌ డాక్టర్‌. ఆయన ప్రారంభంలో పులివెందుల నియోజకవర్గంలో ఆస్పత్రి పెట్టి డాక్టర్‌గా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు.

పేదరికంలో ఉండే వారి కష్టాలు, పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి దివంగత నేత డాక్టర్‌ వైయస్‌.రాజశేఖరరెడ్డి. బ్రతికించడం తెలిసిన డాక్టర్‌. ప్రాణాల విలువ తెలిసిన డాక్టర్‌. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే.. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితుల్లోకి పోతుందని పూర్తిగా తెలుసుకుని దానికి ఒక డాక్టర్‌గా వైద్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి.

ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా, పేదల దగ్గరకు, వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహాశిఖరం ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డిగారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఆరోగ్య రంగంలో వెలిగే సూర్యుడు.. ఇవాళ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడి రూపకల్పన చేసే కార్యక్రమం వరకు ఎవరైనా, ఏదైనా చేస్తే దానికి ఆద్యుడు దివంగత నేత రాజశేఖరరెడ్డి గారే గుర్తుకు వస్తారు.

ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలు ఏమిటి అన్నవి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. వీటిలో 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు. తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపే అంటే 1983 కంటే ముందే వచ్చాయి. ఆ తర్వాత మిగతా 3 మెడికల్‌ కాలేజీలు శ్రీకాకుళం, ఒంగోలు, కడపలో వచ్చాయి. ఇవి పెట్టింది ఎవరు అంటే వైయస్సార్‌గారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే అందులో 8 కాలేజీలు టీడీపీ పుట్టక మునుపే ఉండే.. మిగిలిన 3 మెడికల్‌ కాలేజీలు దివంగత నేత, రాజశేఖరరెడ్డిగారి హయాంలో వచ్చాయి.

ఇక ఇప్పుడు మన ప్రభుత్వంలో అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో మరో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. ఆ 11, ప్రస్తుతం కడుతున్న 17.. మొత్తం 28 మెడికల్‌ కాలేజీలలో 20 కాలేజీలు వైయస్సార్‌గారి వల్లనో లేదా ఆయన కొడుకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం హాయంలోనే ఏర్పాటవుతున్నాయి. మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో వీళ్లు కట్టలేదు. వీళ్లు కట్టకపోయినా.. అధికారం ఉందని చెప్పి బలవంతంగా వాళ్లకు కావాల్సిన పేరు వాళ్లు పెట్టుకుని ఆ పేరే కొనసాగించాలని అడగడం ధర్మమేనా? అని అందరూ ఆలోచన చేయాలి.

28 మెడికల్‌ కాలేజీలలో 20 కాలేజీలు కట్టిన, కడుతున్న వైయస్సార్‌గారి పేరు పెట్టకూడదు అనడం న్యాయమేనా? అని ఆలోచన చేయమని కోరుతున్నాను. క్రెడిట్‌ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్‌ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్టీఆర్‌గారిని గౌరవించే విషయంలో ఎక్కడా కూడా మనసులో మాకు కల్మషం లేదు. ఆయన గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అని సంపూర్ణంగా నమ్ముతున్నాం. అందుకనే ఎవరూ అడగకపోయినా ఆయన పేరు విజయవాడ జిల్లాకు పెట్టాం. ఇంకా ఎక్కడైనా ఆయన హయాంలో కానీ, టీడీపీ హయాంలో కానీ కట్టి ఉంటే.. వాటికి ఆయన పేరు పెట్టాలని వాళ్ల దగ్గర నుంచి ప్రతిపాదన ఉంటే ఇవ్వమనండి. కచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అది తప్పేం కాదు. వాళ్లకు క్రెడిట్‌ రావల్సిన పరిస్థితి ఉంటే దానిక్కూడా సానుకూలంగా స్పందిస్తాం. కానీ క్రెడిట్‌ రావాల్సిన వ్యక్తికి, క్రెడిట్‌ ఇవ్వకపోవడం కూడా ధర్మం, న్యాయం కాదని అందరూ గుర్తెరగాలి.

ఈరోజు వైద్య రంగంలో రాష్ట్రంలో ఎక్కడా, ఎప్పుడూ చూడని మార్పులు జరుగుతున్నాయి. వైద్య రంగంలో విప్లవం చోటు చేసుకుంటుంది. నాన్నగారు ఒక అడుగు ముందుకువేస్తే.. ఆయన కొడుకుగా జగన్‌ నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నాడు. మన ప్రభుత్వం రానంత వరకు ఆరోగ్యశ్రీలో 1059 ప్రొసీజర్స్‌ మాత్రమే ఉంటే.. ఇప్పటికే 2400కు పైగా ప్రొసీజర్స్‌ను పథకంలో చేర్చాం. వచ్చే అక్టోబరు 5వ తేదీ (విజయదశమి) నుంచి ఏకంగా 3118 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలోకి తీసుకు వస్తున్నాం. ఇంకా ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారుస్తున్నాం.

ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆ రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో వైద్యులు సూచించినంత కాలం.. ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఇవ్వడం జరుగుతోంది. ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జ్‌ అయ్యే సమయంలోనే ఆరోగ్య ఆసరా కింద వారికిచ్చే ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం.

ఈరోజు శిధిలమైన పరిస్థితులలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు అన్నీ మారుతున్నాయి. ఫోన్‌ కొడితే రాని 108,104 పరిస్థితి నుంచి ఏకంగా 1088.. 108, 104 అంబులెన్స్‌లను బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇంకా 104 అంబులెన్స్‌లు అదనంగా రాబోతున్నాయి. 10వేలకు పైగా గ్రామాల్లో వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు రాబోతున్నాయి. ఇక ప్రై మరీ హెల్త్‌ సెంటర్‌లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల నుంచి, జిల్లా ఆసుపత్రులతో కలుపుకుని బోధనాసుపత్రుల వరకు రూపురేఖలు అన్నీ మారిపోతున్నాయి.

స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉంటే మరో 17 మెడికల్‌ కాలేజీలు అదనంగా చేరుతున్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రతినెలా బిల్లులు ఇస్తున్నాం. పెండింగ్‌ ఎక్కడా లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడేళ్ల కాలంలోనే 40,500 పోస్టులలో నియామకాలు చేశాం. అక్టోబరు 15 కల్లా మరో 4వేల మంది నియామకాలు పూర్తవుతాయి. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంత మంది వైద్యులు, నర్సులు ఉండాలో కచ్చితంగా అంత మంది ఉండేటట్లుగా చేసే అడుగులు పడుతున్నాయి.

ఇన్ని విప్లవాత్మక మార్పులు జరుగుతున్నప్పుడు.. ఇదే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇదే యూనివర్సిటీకి ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డిగారి పేరు పెట్టడం సమంజసమని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ.. ఇది ఎవ్వరినీ కూడా అగౌరవ పరిచే కార్యక్రమం కాదని తెలియజేస్తున్నాను. వాళ్లకు ఎక్కడైనా రావాల్సిన క్రెడిట్‌ రాకపోతే.. అడిగితే అది కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తూ.. ఈ బిల్లును ఆమోదించవలసిందిగా సభను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అంటూ సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.

Leave a Reply