– వారికి షేక్ షెహన్షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు
– సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు
– కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు
– ఎవరిదగ్గర ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు
– వివేకా కుటుంబంలోనే అంతర్గతంగా విభేదాలు
– ఎంపీ అవినాష్రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది..దాదాపు 4 గంటలకు పైగా ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ”మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అడిగాం. రెండు, మూడుసార్లు అడిగినా స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లాం. కేసు విచారణ వెనక రాజకీయ కుట్రలున్నాయి. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. అధికారుల వద్ద ఉన్నందున ఇవాళ కోర్టులో జరిగిన విషయాలు నాకు తెలియదు. తప్పుడు ఆధారాలు సృష్టించి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలోనే చెప్పాను. కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలను పక్కన పెట్టి చిన్నచిన్న విషయాలను ప్రస్తావిస్తూ పెద్దవి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టుకథ అడ్డం పెట్టుకుని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. సీబీఐ విచారణ కంచే చేను మేసిన చందంగా ఉంది” అని అవినాష్రెడ్డి ఆరోపించారు.
‘ఎంపీ టికెట్’ కోసమే ఈ హత్య జరిగిందని చేస్తున్న ఆరోపణలు వింటే నవ్వొస్తుంది. చనిపోయే ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో 300 ఇళ్లలో వైఎస్ వివేకానందరెడ్డి ఇంటింటికీ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాంరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్కు ఓటేయండి అని ప్రచారం చేశారు. అక్కడి ప్రజలను పిలిచి విచారణ చేయొచ్చు.. కానీ అలా చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డిని పిలిచి విచారణ చేయొచ్చు. అలా చేయలేదు. ఎవరిదగ్గర ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు. కేవలం వీళ్ల కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకున్నారు. హత్యకు సంబంధంచిన నిజాలను వెలికితీయాలనే ఆలోచనే లేదు. కట్టుకథను అడ్డంపెట్టుకొని.. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
నా సోదరి సునీత నాపై ఎన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉన్నా. ఈ విషయంలో వైకాపా కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు ఇవాళ నేను భరోసా ఇస్తున్నా. వివేకా కుటుంబంలోనే అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి.
వివేకానందరెడ్డికి 2006 నుంచి ఒకరితో సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ వివాహం చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారం తన పేరును షేక్ మహమ్మద్ అక్బర్గా మార్చుకున్నారు. వారికి షేక్ షెహన్షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా షేక్ షెహన్షాను ప్రకటించాలని వివేకానందరెడ్డి దృఢంగా భావించారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
హత్య జరిగిన తర్వాత కొన్ని సీల్డ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు స్టేట్మెంట్లో వెల్లడించారు. తప్పకుండా అవి నోటరైజ్డ్ డాక్యుమెంట్లే.. అవి ఆయన రాసిన వీలునామా అని నేను అనుకుంటున్నాను. ఆయన రెండో భార్య, లేదా వారి అబ్బాయికి ఆయన ఆస్తులు ఇవ్వాలని అనుకోవడం జరిగి ఉండొచ్చు. అయితే, ఈ ప్రక్రియను ఎవరు అడ్డుకోవాలనుకున్నారో? ఈ విషయంలో ఎవరికి ఆసక్తి ఉందో? అనేది తెలియాలి. ఈ కారణంతోనే వివేకానందరెడ్డిని హత్య చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను.
ఈ కేసుకు సంబంధించి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కోర్టు, మీడియా ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇంతకాలం నేను మాట్లాడకపోవడానికి ఇవే కారణాలు తప్ప మరొకటి కాదు. దీని వెనక ఉన్న రాజకీయ కుట్రలను ఛేదిస్తాం. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా” అని అవినాష్ రెడ్డి తెలిపారు