Suryaa.co.in

Andhra Pradesh

వక్ఫ్‌ బోర్డు భూములు స్వాహా చేశారు

-టీడీపీ హయాంలోనే ముస్లీంలకు న్యాయం
-నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

టీడీపీ హయాంలోనే ముస్లీంలకు న్యాయం జరిగిందని, ముస్లీంలను మోసగించిన జగన్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం ఆమె నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబమని, వైసీపీ వాళ్ల వేధింపులు తాళలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసు కుందన్నారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందన్నారు.

వక్ఫ్‌ బోర్డు భూములు స్వాహా చేశారు
80 శాతం వక్ఫ్‌ బోర్డు భూములను వైసీపీ నేతలు ఆక్రమిం చేశారు …30 వేల ఎకరాలను కబ్జా చేశారు..ప్రార్థనా స్థలాలు, స్మశాన స్థలాలను కూడా వదలలేదని దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో నంద్యాలలో 13 వేల టిడ్కో ఇళ్లను కడితే వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. 11 లక్షల ముస్లిం కుటుంబాలకు రూ.140 కోట్లతో రంజాన్‌ తోఫా, 200 కోట్లు వెచ్చించి 38 వేల మంది మైనారిటీ యువతులకు రూ.50 వేలు దుల్హన్‌ పథకం, మైనారిటీలకు కార్పొరేషన్‌ ద్వారా 44 వేల మందికి రూ.240 కోట్లను సబ్సిడీల కింద అందజేశారని వివరించారు.

సబ్‌ప్లాన్‌ అమలు చేయకుండా మాట తప్పారు..
ముస్లీం మహిళలకు దుల్హన్‌ పథకాన్ని రద్దు చేశారని, సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తామని మాట తప్పారన్నారు. మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా రూ.2,500 కోట్లను టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, ఏపీ నూర్‌ బాషా దూదేకుల ముస్లీం కార్పొరేషన్‌ ఫండ్‌ ప్రారంభించి రూ.40 కోట్లను వెచ్చించారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అంబేద్కర్‌ ఓవర్సీన్‌ విద్యా పథకం, ఎన్టీఆర్‌ ఉన్నత విద్యాదరణ వంటి పథకాల ద్వారా 5.40 లక్షల మైనారిటీ విద్యార్థులకు రూ.1000 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్‌లకు రూ.3 వేలు గౌరవ వేతనం అందించారని, 30,200 మంది దీని ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. 100 యూనిట్ల వరకు కరెంటు బిల్లుపై సబ్సిడీని అందించినట్లు చెప్పారు. రంజాన్‌ తోఫా, దుల్హన్‌, దుకాన్‌-మకాన్‌, స్వయం ఉపాధి రుణాలు వంటి 10 పథకాలను అమలు చేశారన్నారు. వైసీపీ అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు.

రాయలసీమకు సరిపడా నీరేది?
నూనెపల్లి గ్రామం 21వ వార్డులో రైల్వే ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయాన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు టీడీపీ పాలనలో 80 టీఎంసీ నీళ్లను రాయలసీమకు వదిలితే…వైసీపీ అధికారంలోకి వచ్చాక నీళ్లను సరిపడా ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్లు ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE