Suryaa.co.in

Andhra Pradesh

మా చివరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం

– రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు
– రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్ నైజం
– జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడు అవుతుంది
– రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అవసరం
– ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర తలరాతను మార్చాలి
– మే 13న రాక్షస పాలనకు ఓటుతో ఘోరీ కట్టాలి
– కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం
– శాంతిపురం మండలం, అనికెర, రేగడిదిన్నెపల్లె గ్రామస్తులకు భువనేశ్వరి పిలుపు

కుప్పం: కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు చంద్రబాబు కుటుంబం అన్ని వేళలా సిద్ధంగా ఉంది. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలకు మా కుటుంబమంతా జీవితాంతం రుణపడి ఉంటాం. మాకు కుప్పం ప్రజల నుండి ఏమీ అవసరం లేదు. చంద్రబాబుకు కూడా ఏమీ అవసరం లేదు. కానీ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల జీవితాలు వైసీపీ పాలనతో ప్రమాదంలో పడ్డాయి.

జగన్మోహన్ రెడ్డి, తన పార్టీ నాయకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, ఇసుక, మట్టి, గ్రావెల్, ఇలా ఏది దొరికితే దాన్ని దోచుకుని వైసీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు. వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై గత ఐదేళ్లుగా కక్షసాధింపు చర్యలు, దాడులు, హత్యలతో పేట్రేగిపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ధరల భారంతో ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు. కానీ నోరెత్తి ప్రశ్నించే పరిస్థితి లేకుండా వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా వైసీపీ నాయకులు ప్రజలకు లేకుండా చేశారు.

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల పక్షాన చంద్రబాబు, లోకేష్ నిలబడి పోరాడినందుకు వైసీపీ ప్రభుత్వం వారిని పెట్టని ఇబ్బంది లేదు. అయినప్పటికీ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మా కుటుంబం పోరాడుతోంది. రాష్ట్ర ప్రజలు కూడా తమను ఎవరు కాపాడతారు? ఎవరు దాడులు చేస్తారు? అనే అంశాలను పునరాలోచించుకోవాలి. రాష్ట్రాన్ని దోచుకోవడానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల భూములపై కన్ను పడింది. అందుకే ల్యాండ్ టైటిలింగ్ అనే భూదోపిడీ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీన్ని అమలు చేసి మనకు తెలియకుండానే మన భూములను తాకట్టు పెట్టి వాళ్ల జేబులు నింపుకోవాలని చూస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మేల్కొని తమకు అన్యాయం చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంసిద్ధం కావాలి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించి, ప్రజల ప్రభుత్వానికి స్వాగతం పలకాలని కోరుతున్నాను. రానున్న 6 రోజులు చాలా కీలకమైనవి. వైసీపీ ప్రలోభాలకు గురికాకుండా మీ భవిష్యత్తును ఓటుతో కాపాడుకోవాలి. వైసీపీ ప్రభుత్వాన్ని మే 13న జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మ్యానిఫెస్టోను ప్రకటించారు.

అదేవిధంగా మహిళల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సూపర్ సిక్స్, మహాశక్తి పథకాలను ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేసి ప్రజల పక్షాన నిలబడతారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతను ఆదుకుంటారు. రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి 75ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు.

రాష్ట్ర ప్రజలు తమ కోసం కష్టపడుతున్నది ఎవరు? ఇంట్లో కూర్చుని ప్రజలను దోచుకుంటుంది ఎవరు? అనే విషయాలను గమనించాలి. టీడీపీ కార్యకర్తలు తమ స్పీడును మరింత పెంచాలి…సైకిల్ స్పీడును పెంచాలి…అడ్డొచ్చే దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకు వెళ్లాలి…ఎక్కడా వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించే వరకు ఏ ఒక్కరూ విశ్రమించకూడదు

LEAVE A RESPONSE