బాబు చేసిన అప్పులకు వడ్డీనే ఏడాదికి 30 నుంచి 40వేల కోట్లు చెల్లిస్తున్నాం‌

-2024 ఎన్నికలకు వెళ్లేనాటికి ఇది చేశాం అని చెప్పి ఓట్లు అడుగుతాం‌
-2019లో జగన్ గడ్డపార దించబట్టే బాబు ఇంట్లో కూర్చుని రోజూ ఏడుస్తున్నాడు‌
-భవిష్యత్‌ తరాలకు శ్రీజగన్‌ పునాదులు వేస్తున్నారు‌
-ఎత్తిపోయిన పార్టీకి యువరాజులా లోకేష్‌ మాటలు‌
-14 ఏళ్లు సీఎంగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయనందుకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది బాబే‌
– ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
సామాజిక పెన్షన్లపై టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా దుష్పచారం చేస్తోందని, ఏ నెలకు ఆ నెల పెన్షన్‌ ఇస్తామంటే తప్పేంటని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక శాచురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తుంటే దాన్ని కూడా టీడీపీ కరపత్రాలుగా మారిన ఎల్లో మీడియాకు చెందిన మూడు సంస్థలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటున 39 లక్షలు పెన్షన్లు ఇస్తే… వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నదని చెప్పారు. బాబు హయాంలో పెన్షన్లకు సగటున రూ.500 కోట్లు ఖర్చు చేస్తే … దానికి మూడింతలు ఎక్కువగా రూ.1500 కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడుతున్నది తమ ప్రభుత్వమని సజ్జల తెలిపారు. టీడీపీ హయాంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంటే… తమ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రతినెలా 1వ తేదీన వాలంటీర్‌ ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.
“మా వాడు ముఖ్యమంత్రి కాకపోతే భరించలేమన్నట్లుగా” సామాజిక పెన్షన్లపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు టీడీపీ మీడియా కుట్ర పన్నుతోందని, ఆ మూడు మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా ప్రకటించుకుని, ఇలాంటి రాతలు రాస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని సజ్జల స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళల్లో చేసిన అప్పులకు వడ్డీనే ఏడాదికి రూ. 30 నుంచి 40వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ పాపం బాబుదేనని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ముందుగా వీటిపై సంజాయిషీ ఇచ్చి క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్‌ చేశారు.సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడరంటే‌…
సామాజిక పెన్షన్లకు సంబంధించి ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది. అన్యాయం జరిగిపోతుందన్నట్లు విష ప్రచారంలో భాగంగా పెన్షన్లకు ఎసరు పెడుతున్నారంటూ ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్లపై ఆధారపడి జీవితాలు గడుపుతున్న వృద్ధుల్లో, పెద్దవాళ్లలో అపోహలు పెంచడానికి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయడం జరిగింది.
పెన్షన్లకు సంబంధించి రెండున్నరేళ్లకు ముందు ఎలా ఉంది… ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఈ ఫలాలను అందుకున్నవారిని అడిగితే చెబుతారు. పిల్లలపై ఆధారపడకుండా వృద్ధులకు ఎంతోకొంత ఆసరాగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఎన్నికల ముందే తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ రెండువేలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే శాచురేషన్‌ పద్ధతిలో అర్హలైనవారికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇప్పుడు రూ.2250 పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వచ్చే అయిదేళ్లలో దశలవారిగా పెంచుకుంటు వెళతామని, అర్హతను బట్టి పెన్షన్లు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుస్తున్నాం. నెల తిరిగేసరికి పెన్షన్‌ తీసుకుంటున్న వృద్ధుల మొహాల్లో సంతోషం చూస్తున్నాం.
అదే చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సరిగ్గా 2019 ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా పెన్షన్లు పెంచుతూ ప్రకటన చేశారు. చంద్రబాబుగారికి ఏదీ సొంతంగా చేసే ఆలోచన లేదు. జగన్‌ గారు ప్రకటించగానే తాము పెన్షన్లు పెంపును ప్రకటించడం అందరూ చూసే ఉంటారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉన్నప్పటి నుంచి రెండు మీడియా సంస్థలు చంద్రబాబుకు అనుకూలంగా తమ వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో మీడియా సంస్థ కూడా తోడై.. ఆ మూడు మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడుఅధికారం పోయినప్పటి నుంచి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ కడుపుమంటతో ఉన్నారు. అధికారం తమకే పోయినంతగా బాధపడుతున్నాయి. 99 పనులు చేస్తూ ఆ ఒక్కటి ఎందుకు చేయడం లేదంటూ మాట్లాడుతున్నాయి. చెప్పిన పనులు చేస్తున్నది మేమే. చంద్రబాబు లాగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా భ్రమల్లో పెట్టడం లేదు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేశారు. ప్రజలు ఇచ్చిన ఈ అయిదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలు పూర్తి చేసి.. దాని ఫలితాలు, ఫలాలు పేదలకు అందుబాటులోకి తెచ్చి వాటి ఫలితంగా వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ యజ్ఞంలా చేస్తుంటే… ఈ మీడియా మాత్రం పెన్షన్లు ఎత్తివేస్తున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ హయాంలో పెన్షన్‌ ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. అలాంటిది మేము ఏ నెల పెన్షన్‌ ఆ నెలే ఇస్తామని చెప్పడం తప్పు అంటున్నారా? అనర్హులకు అడ్డగోలుగా ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ల బాధ ఏంటో అర్థం కావడం లేదు. దీనిపై కోర్టులను ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అసలు జరిగింది ఏంటి?
అర్హులకు పెన్షన్‌ అందించడం, అనర్హులను వాళ్లను తీసివేసుకుంటూ వస్తున్నాం. దానికోసం మాడిఫికేషన్‌ చేస్తూ వస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉన్నవారు నెల తర్వాత తీసుకోవచ్చన్నది మా ప్రభుత్వమే చెప్పింది. దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది పెన్షన్లను దుర్వినియోగం చేయడంతో… ప్రజల సొమ్ము దుబారా కాకుండా… అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఏ నెలకు ఆ నెలే పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించాం. పక్క రాష్ట్రంలో ఉన్నా పెన్షన్‌ తీసుకునేందుకు ప్రతినెలా వచ్చి తీసుకునేందుకు వీలును కూడా కల్పించాం. ఇందులో తప్పు పట్టడానికి అర్థం కావడం లేదు. అనర్హులు ఉన్నా ఇచ్చేయాలని రాస్తే బాగుండేది. మీడియా అనే బ్యానర్‌ ఉన్నంత మాత్రాన టీడీపీ కరపత్రాలుగా పనిచేస్తున్న మీకు ఆ అర్హత లేదని చెబుతున్నాం.
అయితే వ్యవస్థలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 60 లక్షల మందికి పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంటే దాంటో ఏమైనా తప్పులు ఉంటే ఎత్తిచూపితే ఫరవాలేదు. అలా కాకుండా దురుద్ధేశ్యంతో అసత్య ప్రచారం చేయడం సరికాదు. అందులో మీ దురద్దేశ్యాలు బయటపడుతున్నాయి. ‘మా వాడు సీఎం కాకపోతే ఎవరు ఉన్నా సహించం. మా సామాజిక వర్గం వ్యక్తే ముఖ్యమంత్రి కావాలన్నది’ ఆ మీడియా ఉద్దేశం అన్నట్లు ఉంది. ఆ హడావుడిలో ఇంతకాలం ఎవరు అధికారంలో ఉన్నారన్నది కూడా మర్చిపోతున్నారు.
పాత లెక్కలు చూస్తే చంద్రబాబు హయాంలో సామాజిక పెన్షన్లకు ప్రభుత్వం చేసిన నెలసరి వ్యయం రూ. 500 కోట్లు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం నెలకు చేస్తున్న వ్యయం రూ.1500 కోట్లు. అంటే పెన్షనర్ల సంఖ్య 50 శాతం వరకూ పెరిగితే.. ఇచ్చే పెన్షన్ డబ్బు ప్రభుత్వం నుంచి ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఇదీ నిజం. మన రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 60 లక్షలు. అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లు అందుకున్న వారి సంఖ్య, ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షలే. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా మరో 21 లక్షల మంది సామాజిక పెన్షన్లు అందుకుంటున్నారు.
జగన్‌ మోహన్‌ రెడ్డి సిన్సియర్‌గా నిబద్ధతతో తాను ప్రకటించిన పాలసీని అనుసరించి ముందుకు వెళుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటికీ దాదాపు 21లక్షలకు పైగా పెన్షన్లు అధికంగా ఇస్తున్నాం. ఇందులో బొక్కలు వెతకడానికి చూస్తే ఏమనాలి. మీ హయాంలో వృద్ధులు ఎన్నికలప్పుడు ఎలా పుట్టుకు వస్తారు. జగన్‌ హయాంలో అర్హత ఉన్నప్పుడే వృద్ధులు పెరుగుతూ వస్తారు. అనర్హులు ఉంటే తీసివేయడం అనేది ఏ ప్రభుత్వం అయినా చేయాలి. మీ హయాంలో పెన్షన్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే మా ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చి వెళుతున్నారు. ఇంత స్పష్టంగా ఉంది. ఇంతగా రెండేళ్లలో వ్యవస్థను ప్రక్షాళణ చేసి 60 లక్షల పెన్షన్లు చెప్పిన సమయానికి ఇవ్వడం ఒక ఎత్తు. దానికి బడ్జెట్‌ కేటాయించడం మరో ఎత్తు. వృద్ధుల గ్రోత్‌ రేటు ప్రకారమే పెన్షన్లు పెరుగుతాయి. ఎక్కడా డీవియేట్‌ కాకుండా శాచురేషన్‌ పద్ధతిలో రూ.1500 కోట్లు ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లకు కేటాయించిన బడ్జెట్‌ ఎక్కడ? ఇప్పుడు మా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు మూడింతలు ఎక్కువ.
ఇంత నిబద్ధతతో చేస్తుంటే.. విధానపరంగా చూస్తే ప్రభుత్వాన్ని ప్రశంసించాలే కానీ బండలు వేయడం కాదు. గ్రౌండ్‌ లెవల్‌లో వచ్చే ఇబ్బందులు వస్తాయి. అలాంటివి మీడియా పాయింట్‌ అవుట్‌ చేస్తే సెట్‌రైట్‌ చేసుకోవడానికి మేము ఇప్పటికీ సిద్ధమే. మీ దుర్భుద్ధి, అపోహలు క్రియేట్‌ చేసే వాటిలో గ్రౌండ్‌ రియాలిటీని కూడా పరగణనలోకి తీసుకుంటున్నాం. మా ప్రశ్న ఏంటంటే… టీడీపీని కరపత్రంలా రాస్తున్నాం అని ఒప్పుకుంటే దాన్ని మేము అంగీకరిస్తాం. అంతేకాని పేదలమీద ప్రేమ ఉన్నట్లు రాయడం కాదు. పెట్రోల్‌ ఉద్యమం అట… దాన్ని ఎవరు పెంచారు? ఏదైనా సరే ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లు ప్రీప్లాన్డ్‌గా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. పాలసీపరంగా రాయాలనుకుంటే టీడీపీ హయాంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. ముఖ్యమంత్రిగారు నిర్ణయాలు పొరపాటు ఉన్నాయని చెప్పండి. మేము స్వీకరిస్తాం. పరిధిలోలేని విషయాలను కూడా పెద్దది చేసి చూపించడం సరికాదు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు కొత్తరూపు సంతరించుకుంటే …వాటిని మానేసి రెండోదశలో చేపట్టే స్కూళ్లను చూపిస్తూ రాతలు రాయడమా? దీనివల్ల ఎవరిలో అపోహలు సృష్టించాలని మీ ప్రయత్నం.
విద్యుత్‌ సర్దుబాటు చార్జీల మీద కూడా అలాగే రాతలు రాశారు. అవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో చేయాల్సినవి. వాటిని వదిలేసి ఈ ప్రభుత్వం బాదుడుగా ఎలా చూపిస్తారు. ఈ రెండున్నరేళ్లలో డిస్కింల నష్టాలు రూ.4110 కోట్లు ఉంటే 2019 నాటికి 27,240 నష్టాలు ఎందుకు వచ్చాయి? సంజాయిషీ వాళ్లు ఇవ్వాలి. 2014-19 నుంచి డిస్ట్రిబ్యుషన్‌ కంపెనీస్‌ వార్షిక సరఫరా ఖర్చు రూ. 24,211 కోట్లు నుంచి రూ.46,400 కోట్లుకు చేరుకుంది. దాన్ని మేము రూ.39,324కోట్లుకు తీసుకు వచ్చాం. మరి మేము ఎలా తగ్గించగలిగాం. టీడీపీ సర్కార్‌…భవిష్యత్‌లో భారం ఎలా పెరుగుతుందో ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. అలా అని 24 గంటలు పాటు విద్యుత్‌ సరఫరా ఇచ్చింది కూడా లేదు.
చంద్రబాబు హయంలో విద్యుత్‌ అప్పులు మొత్తంగా 31,648 కోట్లు నుంచి రూ.62,463 కోట్లు చేరింది. వాటిపైనే రూ.6 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. రాష్ట్రం దివాలా తీసిందంటూ మీ మీడియాలో రికార్డులు వేయడం కాదు… మా రికార్డులు మాకున్నాయి. భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయగలిగేలా రాష్ట్రాన్ని దశాబ్దం తిరిగేనాటికి విద్యా,వైద్యం సహా అన్ని రంగాల్లో పునాదులు వేస్తున్నారు. మరి మీరు ఖర్చు చేసినవి ఎక్కడ పెట్టారు? వాటికి సంజాయిషీలు మాత్రం ఉండవు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అనుకున్నట్లు భారీ సోలార్‌ ప్రాజెక్ట్‌ ద్వారా తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఇవ్వగలిగితే రానున్న రోజుల్లో ఇప్పుడు పెడుతున్న ఖర్చు తగ్గుతుంది.
పోలవరం ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే… ఎత్తిపోయిన యువరాజు అక్కడ పర్యటించారట. చంద్రబాబు హయాంలో పునరావాస పనులు ఏవిధంగా ఉన్నాయి. కాపర్‌ డ్యామ్‌ గోడ ఎత్తితే నిర్వాసితులు ఎక్కడ ఉంటారనుకున్నారు. వారి కోసం ఎందుకు ఆలోచించలేదు. పోలవరం పనులు దాదాపు పూర్తవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌ ఉన్నా.. నిర్వాసితులు ఇబ్బంది పడకుండా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద వాళ్లకు అందచేయడం జరిగింది. వాళ్ల కష్టాలకు కారణం అయిన చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడేమి చేశారో దీనిపై మీరు సంజాయిషీ ఇవ్వాలి.
మా జగన్‌ అధికారంలోకి వచ్చిందే రెండున్నరేళ్లు. మరి ఉత్తరాంధ్రలో ఏంచేశారు, పోలవరం అంటూ ప్రశ్నలు చేయడం కాదు. ప్రతిచోట పనులు జరుగుతున్నాయి. 2024 ఎన్నికలకు వెళ్లే సమయానికి ప్రతిరంగంలోనూ విజిబుల్‌గా కనిపించే ప్రోగ్రెస్‌ను చూపిస్తాం. అలాంటి మా నాయకుడి గురించి… అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. జగన్‌గారు గాలిగాడో.. గడ్డపారో ప్రజలే 2019 ఎన్నికల్లో చూపించారు. అది కూడా స్పృహ లేకుండా ఉంటే ఎలా? ఆ రెండు పత్రికలు ఎందుకు రాయలేదో? మేము కూడా దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బూతుల మాట్లాడేవారి మీద ప్రజలే ఉమ్మేస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలనే మా లక్ష్యం. పాజిటివ్‌ క్రిటిసిజమ్‌ ఉంటే మేము స్పందిస్తాం. కడుపు మంటతో మాట్లాడేవాటి గురించి మాట్లాడటానికి ఏముంటుంది.
-పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారు? రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏమవుతుందో ఆయనకు ఏమి తెలుసు?
-చంద‍్రబాబు చేసిపోయిన ఛండాలాన్ని కొద్దిరోజులు భరించాల్సిందే. వర్షాకాలం అయిపోగానే రహదారులు పనులు ప్రారంభం అవుతాయి.
-అప్పు లేకుండా రాష్ట్రాన్ని జగన్‌ చేతిలో పెట్టి వెళితే టీడీపీ పాయింట్‌ అవుట్‌ చేయడానికి వీల్లేకుండా అప్పు చేయకుండా ప్రజలకు అభివృద్ధి అందించేవాళ్లం.
-మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే మాకు రూ.30 నుంచి 40వేల కోట్లు అవుతున్నాయి.

Leave a Reply