Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక ప్రగతి సాధించాం సరే .. మరి యువత మానసిక వికాసాన్ని విస్మరిస్తున్నామా?

– ఎంపి విజయసాయిరెడ్డి

ఇండియాలో 15–24 ఏళ్ల మధ్య వయస్కులైన 25 కోట్లకు పైగా ఉన్న యువతీయువకుల మానసిక అవసరాలకు కూడా వారి శారీరక ఆరోగ్యానికి ఉన్నంత ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. ఈ విషయాన్ని ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సామాజిక మాద్యమం వేదికగా ఈ అంశానికి సంబంధించి అనేక విషయాలు వివరించారు. యువత మనోవికాసమే సర్వతోముఖ అభ్యుదయానికి గీటురాయి అని పాశ్చాత్య దేశాల్లో రుజువైంది. ఈమధ్య ముంబై, ఢిల్లీ నగరాల్లో కొందరు యువకులు చేసిన హత్యలు, రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కొందరిని చుట్టుముడుతున్న హింసాప్రవృత్తి ఆలోచనాపరులను తీవ్ర అలజడికి గురిచేస్తున్నాయి. 21వ శతాబ్దంలో పుట్టిన టీనేజర్లు కొత్త వాతావరణంలో రూపుదిద్దుకుంటున్న, వేగంగా మారుతున్న, ఎదిగిపోతున్న ప్రపంచంలో బతుకున్నారు.

ఇంటర్నెట్‌ సర్వత్రా అందించే సమస్త సమాచారం కౌమారదశకు చేరిన నేటితరం పిల్లలకు పూర్తిగా మేలు చేసేదిగా లేదు. కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పరిజ్ఞానం, సమాచారం, విజ్ఞానం ఈ యువతకు భారంగానే కనిపిస్తున్నాయి. దీనికితోడు చదువు, తర్వాత ఏఏ వృత్తుల్లో ప్రవేశించి పైకి ఎగబాకాలనే అంశాలు యువతీయువకులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. వారిలో ఆతృతను, అలజడిని పెంచేస్తున్నాయి. భారతదేశంలోని పిల్లలకు ఏం చేయాలనే విషయంలో అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.

కానీ, తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, ఆర్థికంగా తగినంత మద్దతు, సరైన మార్గదర్శనం లేకపోవడం యువత ప్రధాన సమస్యలు. ఇంతకు ముందు తరానికి లేని సమాచారం ఇప్పుడు కొత్త తరం పిల్లలకు అందుబాటులో ఉన్నా దాని వల్ల వచ్చే ప్రయోజనాలు కనిపించడం లేదు. యువతీయువకులు తాము అనుభవిస్తున్న మానసిక సమస్యలు, అలజడి గురించి బయటకు చెప్పుకునే వాతావరణం ఇంకా మనం సృష్టించలేకపోతున్నాం. ఇంట్లోగాని, క్లాసురూముల్లోగాని వారి సమస్యలు చెప్పుకుని చర్చించలేకపోతున్నారు. దీంతో జనంతో అందరి మధ్య ఉన్నాగాని ఒంటిరితనం యువతను పీడిస్తోంది. ఈ పరిస్థితులు భారత యువజనుల మానసిక సమస్యలను జటిలంచేస్తున్నాయి.

సంపదతోపాటు చక్కదిద్దుకోవాల్సిన సామాజిక సమస్యలూ పెరిగాయని అన్నారు
ఇండియాలోని బాలబాలికలు, కౌమారదశకు చేరినవారిలో పది నుంచి 20 శాతం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చిక్కులు ఎదుర్కొంటున్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వారిలో అత్యధికులు అవసరమైన ఆసరా లేదా సాయం అడగరు. అడిగినా వారికి అవి లభించవు. మానసిక సమస్యలతో విపరీత లేదా అసాధారణ ప్రవర్తన 14 ఏళ్ల వయసు నుంచే మొదలవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 15–19 ఏళ్ల పిల్లల్లో మరణాలకు మూడో అతి పెద్ద కారణం ఆత్మహత్య. 2016లో చేసిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం దాదాపు కోటి మంది 13–17 మధ్య వయస్కులకు మానసిక సమస్యల విషయంలో వైద్యులు లేదా పెద్దల తోడ్పాటు లేదా ఆసరా అవసరమని తేలింది.

ఈ సంఖ్యా వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్ధుల్లో ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రేమ వ్యవహరాల పేరుతో పాతికేళ్ల లోపు యువకులు తోటి స్నేహితులనే క్రూరంగా చంపడం ఎక్కువైపోతోంది. వృత్తి విద్యా కళాశాలల్లో సీనియర్లు జూనియర్లను వేధించడం, లైంగిక దాడులు కూడా తరచు చూస్తూనే ఉన్నాం. 1991 నుంచి అమలు చేస్తున్న ఆర్థికసంస్కరణలు దేశంలో సంపద సృష్టించే ప్రక్రియ వేగం పెంచాయి. పేదరికం గణనీయంగా తగ్గుతోంది.

ప్రజల జీవనశైలి పాశ్చాత్య దేశాల స్థాయిలో మెరుగవుతోంది. విద్య, వైద్య సౌకర్యాలు, ఇతర అధునాతన మౌలిక సదుపాయాలు ఈ 30 ఏళ్లలో ఊహించనిస్థాయిలో మెరుగయ్యాయి. కాని, ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో అననుకూల పరిస్థితులను ఎదుర్కునే మానసిక స్థయిర్యం నేటి యువతకు లేదు. ఈ క్రమంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఆర్థికరంగంలో సాధించిన ప్రగతి సామాజిక లేదా కుటుంబ వ్యవహారాల్లో మనం చూడలేకపోతున్నాం. ఈవిషయంపై ప్రభుత్వాలు, రాజకీయపక్షాలు, అన్ని రంగాల నిపుణులు దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యిందని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE