Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డీ.. మీ ఉడతూపులకు భయపడబోం!

డ్రగ్ మాఫియా విచారణ కొనసాగుతుంటే క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు?
మా కార్యకర్తపైన పడిన ప్రతిదెబ్బకు ప్రతీకారం తీర్చకుంటాం
– పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు
తెలుగుదేశం పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని నంగనాచి కబుర్లు ప్రభుత్వం, పోలీసులకు వైసీపీ నేతలు మాట్లాడిన బూతులు సుభాషితల్లా విన్పిస్తున్నాయా.? తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ గూండాలు దాడి చేయడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ సంస్కృతికి నిదర్శనం. ఒకచెంపపై కొడితే రెండో చెంప చూపడానికి తామేమీ గాంధీజీ వారసులం కాదు, తమ కార్యకర్తపై పడిన ప్రతిదెబ్బకు ప్రతీకారం తీర్చుకునే తీరతాం.
పట్టాభి ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెబుతున్న డీజీపీకి గత రెండున్నరేళ్లుగా వైసిపి నేతలు మాట్లాడుతున్న భాష వినపడలేదా. డ్రగ్ మాఫియాపై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతోంది. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మార్చి.. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడతారా.? హత్య చేయాలని చూస్తారా.? రక్తపు మడుగులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తే.. దొమ్మీ కేసులు పెట్టి.. దాడి చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై హత్యాయత్నం కేసులు పెడతారా.? అసలు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పని చేస్తున్నారా.. లేక జగన్ రెడ్డి పీనల్ కోడ్ ప్రకారం పని చేస్తున్నారా.?
విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో వచ్చిన 21వేల కోట్ల రూపాయల హెరాయిన్ కు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఎ) ఇప్పటికే రంగంలోకి దిగింది, విజయవాడలో సోదాలు నిర్వహించి పలు కీలకపత్రాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఎ ఈనెల 9వతేదీన పత్రికా ప్రకటన విడుదల చేస్తే రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని డిజిపి ఏవిధంగా క్లీన్ చిట్ ఇస్తారు.?
హైదరాబాద్ సీపీ పత్రికా ముఖంగా తెలంగాణలో పట్టుకున్న గంజాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండే వచ్చిందని చెప్పడం.. ఏపీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది.? రాష్ట్రంలోని డ్రగ్, గంజాయి మాఫియాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ దాడులు చేశారన్నది అక్షర సత్యం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఫ్యాక్షన్ దాడులకు.. పోలీసులు వంతపాడడం దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు.. ప్రతి దాడులు తప్పవని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE