ఆ బంగారు రాజదండం ఇన్నాళ్లూ ఏ‘మాయ’?

-నాడు బ్రిటిషర్లు హిందూ సంప్రదాయం ప్రకారమే అధికార మార్పిడి చేశారా?
-తెల్లదొరలు చోళుల సంప్రదాయాన్నే అనుసరించారా?
-హిందూ రాజ్యానికి గుర్తుగా ఇచ్చిన దానిని నెహ్రు ఎక్కడ ఉంచారు?
-నెహ్రు దానిని ‘వాకింగ్ స్టిక్’గా ఉపయోగించుకున్నారా?
-ఇన్నాళ్లూ బంగారు రాజదండాన్ని చరిత్రలో ఎందుకు సమాధి చేశారు?
-సెక్యులరిజం ముసుగులో ఆ రాజదండాన్ని నెహ్రు మ్యూజియంలో ఎందుకు దాచిపెట్టారు?
-ఈ నేరానికి శిక్ష ఎవరికి విధిస్తారు?
-మళ్లీ 75 ఏళ్ల తర్వాత మోదీ పుణ్యాన పార్లమెంటులో బంగారు రాజదండం ప్రత్యక్షం
-మోదీ సాహసం ఇస్తున్న సంకేతాలేమిటి?
-75 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సంప్రదాయంలో బంగారు రాజదండం ప్రతిష్ఠ
-చరిత్రను చెత్తబుట్టలో కలిపిన పాపం కాంగ్రెస్‌దేనా?

హస్తినలో పార్లమెంటు నూతన భవనంలోకి మనం మరిచిన పురాతన చరిత్రతోపాటు.. మరుగున పడేసిన ఒక చోళ సంప్రదాయం మళ్లీ సాక్షాత్కరించనుంది. అది కూడా 75 సంవత్సరాల సుదీర్ఘ విరామానంతరం! నిజానికది సెక్యురిజం ముసుగులో, దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన అప్పటి కాంగ్రెస్ వేసిన పాతర. సెక్యులరిజం పేరుతో చరిత్రకు ఊపిరానంతగా కప్పేసిన ఓ ముసుగు. ఇప్పుడది మళ్లీ భారతీయుల దర్శనం కానుంది.
భారతీయులకు స్వాతంత్య్రం ఇస్తూ, అధికారబదిలీ చేసే సమయంలో.. పూర్తి హైందవ సంప్రదాయంలో, శాస్త్రయుక్తంగా వేదపండితుల ఆధ్వర్యంలో సుప్రసిద్ధ స్వర్ణకారులతో తయారుచేసిన ఓ రాజదర్ప చిహ్నాన్ని తెల్లదొరలు మనకు అందించిన ఓ హైందవ జ్ఞాపిక. ‘భగవంతుడి అనుచరుడైన రాజు స్వర్గంలో ఉన్నట్లుగా పాలించాలని మా ఆజ్ఞ’ అన్న శాసనంతో లిఖించిన బంగారు రాజదండం అది! చోళుల కాలంలో అధికార మార్పిడి అచ్చం అదే పద్ధతిలో జరిగేది. అంటే భారతదేశానికి స్వాతంత్య్రం కూడా చోళుల పద్ధతిలోనే బదిలీ అయిందన్న మాట.
మరి ఆ రాజదండం ఇన్నాళ్లూ ఎక్కడుందో తెలిస్తే మీ పిడికిళ్లు బిగిసిపోతాయ్. రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. నరాలు ఉడుకెత్తుతాయ్. రక్తం మరిగిపోతుంది. పాత పాలకుల కుశ్చిత బుద్ధి తెలిస్తే ఆగ్రహం.. ఆవేదన.. అసంతృప్తి.. కలసి వెరసి.. నవనాడులూ కుంగిపోతాయ్.
నిజంగా చోళుల సంప్రదాయం ప్రకారం రూపొందించిన ఆ రాజదండాన్ని, జవహర్‌లాల్ నెహ్రు నడించే వాకింగ్ స్టిక్‌గా వాడుకున్నారా?
ఆయన మృతి తర్వాత దానిని అలహాబాద్ మ్యూజియంలో భద్రపరిచారా?
అప్పటి కాంగ్రెస్ పాలకులు చరిత్రను ఇంతగా సమాధి చేశారా?
చోళుల రాజదండాన్ని చరిత్రకు తెలియకుండా మాయం చేశారా?
మళ్లీ మోదీ పుణ్యాన ఇప్పుడు ఆ రాజదండం పార్లమెంటులో ఎలా ప్రత్యక్షమయింది? ఎందుకు ప్రత్యక్షమయింది? ఈ పాపానికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు?
మీరే చూడండి.

పచ్చి మోసం… దగా….కుట్ర…..
తమ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అధికార మార్పిడి విధానంపై, భారత ప్రజలకు తెలియకుండా 70 సం. లుగా కాంగ్రెస్ దాచిన ఒక పచ్చి నిజం ఏంటో తెలుసుకోండి.
అది ఆగస్టు 1947 మద్రాస్ ప్రెసిడెన్సీ, తమిళనాడు. కొందరు ఒక ముఖ్యమైన మిషన్‌ను నిర్వహించడానికి పిలవబడ్డారు.
ఏమిటా ముఖ్యమైన కార్యం? ఎక్కడికి పిలువ బడ్డారు?
ఒక పాలకుడి నుండి మరొకరికి అధికార బదిలీని పవిత్రంగా చట్టబద్ధం గా చేయడం ఎలా? అనే అంశం. ఆ వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ.
ఆ రోజుల్లో భారత్ కి చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ పై, భారతీయులకు అధికారాన్ని అప్పగించడానికి పూర్తి చేయాల్సిన తతంగం నిర్వహించే బాధ్యత ఉంది. అప్పుడే అతనికి ఒక మామూలు ప్రశ్న వచ్చింది. అది ఏమిటంటే .. ఆ క్షణాన్ని.. అంటే అధికారాన్ని అప్పగించడం అనే తంతు ఎలా నిర్వహించాలి? వట్టి కరచాలనం చేయడం సరిపోదు, మరి అవలంబించవలసిన తంతు లేదా పద్దతి ఏమిటి?
ఆయన ఈ ప్రశ్నను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకి సంధించారు. మంచి ప్రశ్న, ఆలోచించాల్సిన విషయమే అన్నారు నెహ్రు.
అయోమయంలో ఉన్న నెహ్రూ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజగోపాలాచారిని సంప్రదించారు.
రాజాజీ పాండిత్యాన్ని , అతనికి తెలిసిన భారతీయ ఆచారాలు – భారత నాగరికత పై గల జ్ఞానం అంటే నెహ్రూ కి గౌరవం. రాజాజీ నెహ్రూ వేసిన ఈ ప్రశ్నకు, భారతదేశం గతం నుండి ఒక సమాధానం కనుగొన్నాడు.
భారతదేశంలోని అత్యంత పురాతనమైన , సుదీర్ఘమైన నిరంతర పాలనలలో ఒకటైన తమిళనాడులోని చోళ రాజ్యంలో, ఒక చోళ రాజు నుండి మరొక చోళ రాజుకు అధికార మార్పిడికి ఒక తంతు నిర్వహించడం చేసేవారు.
చోళులు అమిత భక్తులుగా ఆరాధించే శివుని దీవెనలను కోరుతూ, ఆనాటి ప్రధాన పూజారిచే ఆశీర్వదించబడిన పద్ధతి అది. 1000 సంవత్సరాలకు పైగా ఉన్న పురాతన దేవాలయాలలో, ఆ పద్ధతి నేటికీ కొనసాగుతోంది. అదే విధమైన వేడుక – ప్రతీకలను అనుసరించాలని రాజాజీ సిఫార్సు చేస్తే, నెహ్రూ దానికి అంగీకరించారు.

ఏమిటా తంతు (కార్యక్రమం) ?
ఒక పొడుగైన” రాజ దండం” అంటే ఇంగ్లిష్ లో ‘సెంగల్’ అంటారు. దానిని ఒక శుభ ముహూర్తం లో కొత్త రాజు లేదా పాలకునికి రాజ గురువు అందచేయడం.

మరి 1947లో అధికార మార్పిడికి అనుసరించిన పద్దతి ఏది?
5 శతాబ్దాల క్రితం స్థాపించబడిన ప్రముఖ ధార్మిక మఠం అయిన, తిరువా వడోతురై ఆధీనం లో అప్పుడు గల 20వ గురు మహాసన్నిధానం శ్రీల శ్రీ వినయం గారికి ఈ అధికార మార్పిడి చిహ్నమైన , ఒక “రాజ దండాన్ని” (SENGOL) తయారుచేసే బాధ్యతని రాజాజీ అప్పచెప్పారు.
ఆ స్వామీజీ మద్రాసులోని ప్రసిద్ధ స్వర్ణకారులు అయిన, బొమ్మిడి వారికి బంగారం తో ఈ “రాజ దండం” అదే “సింగిల్” తయారీ పని అప్పగించాడు. ఈ రాజ దండం పొడవాటి గొట్టం లా గుండ్రంగా ఉండి, దాని పై భాగంలో బలం, సత్యం మరియు ధర్మానికి ప్రతీక అయిన ఒక నంది బొమ్మ ఉంటుంది. నేటికీ ఉన్న 96 ఏళ్ల శ్రీ బొమ్మిడి యతిరాజులు దీనికి సాక్ష్యం.
ఆగష్టు 14, 1947 రాత్రి ప్రత్యేక విమానంలో ఈ ప్రతినిధి బృందాన్ని, నాదస్వర విద్వాన్ టి రాజరత్నం పిళ్లై ని కార్యక్రమములను నిర్వహించుటకు గాను ఢిల్లీకి తరలించారు.
ఈ బంగారు రాజదండం పవిత్ర జలంతో శుద్ధి చేయబడి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లబడింది. ఆ ఊరేగింపు లో తమిళ సెయింట్, తిరానా సంబందర్ స్వరపరిచిన తేవరంలోని కొల్లార పడిగం కీర్తనల నుండి, ఓడువర్ పద్యాలను పాడారు.
ఈ క్రింది వాక్యాలను తమిళ భాషలో ‘రాజ దండం’ పై చెక్కించారు.

“అడియార్‌గళ్ వాణిల్ అరసల్వార్, అనై నమదే” – అంటే
” భగవంతుని (శివుడు) అనుచరుడైన రాజు స్వర్గంలో ఉన్నట్లుగా పరిపాలించాలని మా ఆజ్ఞ.”

1000 సంవత్సరాల క్రితం నుండి, దక్షిణ మరియు ఉత్తరాల యొక్క అద్భుతమైన ఏకీకరణలో, దేశం ఒకటిగా ఆవిర్భవించినందుకు గుర్తుగా, నెహ్రూ .. రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఈ రాజ దండాన్ని, మౌంట్ బాటెన్ నుండి స్వీకరించారు. మఠానికి చెందిన స్వామిజి నెహ్రూకు పట్టు వస్త్రం కప్పి, ఈ బంగారు రాజ దండాన్ని అందజేశారు.
ఆ విధంగా, అధికారం 1947లో దేశ జెండా ఎగుర వేయక ముందే, ఒక హిందూ ‘రాజు’కి బదిలీ చేయబడింది, అతనిని ఒక హిందూ రాజు లాగే పాలించమని ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఈ దేశాన్ని పాలించే అధికార మార్పిడి , ఇక్కడ ప్రాచీన నాగరికత పద్ధతి ప్రకారం ఒక చిహ్నంతో జరిగింది.
ఈ కార్యక్రమం తరువాతే నెహ్రూ ఆగస్ట్ 14, 1947 అర్ధరాత్రి సమయంలో తన ప్రసిద్ధ ప్రసంగాన్ని చేశారు. ఈ రాజేంద్రప్రసాద్ గారే, తరువాత రోజుల్లో భారతదేశానికి మొదటి రాష్ట్రపతి అయ్యారు.
ఈ సంఘటన ఆ రోజుల్లో స్థానిక – అంతర్జాతీయ మీడియాలో నివేదించబడింది. ఆగస్ట్ 25, 1947 టైమ్ మ్యాగజైన్ ఈ నివేదికను ప్రచురించింది.
అంటే పూర్తి ప్రాచీన హిందూ సంప్రదాయం ప్రకారమే, భారత దేశ పాలన ఇక్కడ పాలకులకు అందచేయబడింది.
అయితే, మరి తరువాత కాలంలో ఈ బంగారు రాజ దండం ఏమయిపోయింది? అధికార మార్పిడికి ఆ పరంపర ఎందుకు కొనసాగించలేదు? ఈ పద్దతి నచ్చని కొన్ని వర్గాలను సంతుష్ట పరచడానికి, ఈ పద్ధతిని మరుగున పడేసి మెజార్టీ ప్రజలు అయిన హిందువులను వంచించారా?
ఈ రాజదండం తరువాత కాలంలో , ఏ పేరుతో ఎక్కడ భద్రపరిచారో తెలిస్తే.. కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో తెలుస్తుంది.
ఈ రాజదండాన్ని తరువాత కాలంలో “నెహ్రు నడక లో ఉపయోగించే వాకింగ్ స్టిక్ ” గా పేరు మార్చి అలహాబాద్ మ్యూజియం లో భద్ర పరిచారు.

మళ్ళీ 75 సం. ల తరువాత ఈ ‘రాజ దండానికి’ ప్రధాన మోడీ పునర్వైభవం తీసుకు వస్తున్నారు.ఎలా?
ఈ నెల 28వ తేదీన ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించబోతున్నారు కదా! ఆ రోజు తమిళనాడుకు చెందిన 20 మంది అధీనం ల సమక్షంలో తేవారం వచనంలోని, శైవ సంకీర్తనల మధ్య, తిరువడుతురై ఆధీనం మఠం అధిపతి ఈ 75 ఏళ్ల బంగారు రాజదండాన్ని మే 28న ఉదయం 7.20 గంటల సమయంలో, 20ని.ల హోమం తరువాత ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు.
దాని తరువాత, తమిళనాడు నుండి మఠాధిపతులు, నలుగురు ఊడువర్లు, ఒక మహిళతో సహా, కొత్త భవనంలోకి మోడీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి కాలినడకన వెళ్తారు. తిరువడుతురై అధీనం శ్రీ ల శ్రీ అంబాలవన దేశిక పరమాచార్య స్వామిగళ్‌తో సహా ప్రముఖులు , మఠాధిపతులు పార్లమెంట్ వెల్‌లో నిలబడగా, స్పీకర్ కుడివైపున ప్రత్యేకంగా రూపొందించిన పీఠంపై ప్రధాన మంత్రి ఈ “రాజ దండం” ని ఏర్పాటు చేస్తారు.

అంటే 1947, ఆగస్టు 14 రాత్రి ఎలా అధికార మార్పిడి వేడుక నిర్వహించారో.. మోడీ సరిగ్గా అటువంటి వేడుకే నిర్వహిస్తూ గత వైభవం గుర్తుకు తెస్తున్నారు.
అంత పవిత్రమైన చిహ్నాన్ని ఒక వాకింగ్ స్టిక్ గా మార్చి చరిత్రలో చెరిపెయ్యడానికి ప్రయతించడం మోసం..దగా…కుట్ర కాకుండా ఏమని పిలవాలి?
కేవలం 75 సం. ల క్రిందట సజీవ సాక్ష్యాలు ఉన్న ఇటువంటి చరిత్రనే సెక్యులరిజం పేరుతో మరుగున పడేసే ప్రయత్నాలు జరిగాయి అంటే.. భారత గత వైభవ చరిత్రను, మనకు అందకుండా ఎంత మరుగున పడేసి ఉంటారో ఊహించలేం.
ఇకనైనా కళ్లు తెరవండి.. భారతీయతకు పాతర వేసే విదేశీ ఇజాలు పక్కనబెట్టి, నిజాలు తెలుసుకోండి. నిజంగా చరిత్రను సమాధి చేసిందెవరు? ఆ సమాధులను తవ్వి, మళ్లీ చరిత్ర ను సగర్వంగా నిలబెడుతోంది ఎవరని ఆలోచించండి. మీ మస్తిష్కానికి పదునుపెట్టండి.

– ప్రసన కోతూరు

Leave a Reply