రంజాన్ తోఫా సంచిలో సరుకుల విలువ ఎంత..?

-అక్కచెల్లెమ్మలకు జగనన్న ఇస్తోన్న ఆసరా, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళు విలువెంత..?
-చర్చకు వస్తావా బాబూ?
– కర్నూలు ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌ సవాల్

చంద్రబాబుది కపట ప్రేమ
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏరోజూ ముస్లిం మైనార్టీ నాయకుల్ని దగ్గరకు తీసుకోలేదు. తన కొడుకు లోకేష్‌కు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసిన చంద్రబాబు.. అలాగే, ముస్లిం సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు…? . నంద్యాల ఉప ఎన్నిక వచ్చేదాకా ముస్లింలు గుర్తుకురాలేదా బాబూ..? . మీ పార్టీలో ఉన్న సీనియర్‌ మైనార్టీ నాయకులనే గుర్తించి గౌరవించలేని మీకు, ఇప్పుడు మైనార్టీలపై ప్రేమ పుట్టుకొచ్చిందా..?. మైనార్టీలపై మీప్రేమ ఏపాటిది అన్నది మా ముస్లిం మైనార్టీ సామాజికవర్గంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.

ముస్లిం మైనార్టీల సంక్షేమంపై చర్చకు వస్తావా బాబూ?
టీడీపీ హయాంలో ముస్లిం సంక్షేమంపై ఎంత ఖర్చు చేశారో మీరు చెప్పండి. మా హయాంలో ఏం చేశామన్నది మేము చెబుతాం. దమ్ముంటే చర్చకు వస్తావా చంద్రబాబూ…!. మీ హయాంలో ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్‌ ఇవ్వలేదు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. పైగా, ఎన్నెన్నో చేశానంటూ బాబు మాట్లాడుతుంటే.. వినడానికి ఇందే ఖర్మ అని ముస్లింలు అంటున్నారు. అందుకే, బాబు పర్యటనల్లో కూడా, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలే.. ఇదేం ఖర్మరా బాబూ.. అని అనుకుంటున్నారు. మోసపు మాటలతో, మీరు అధికారంలోకి వచ్చి మరొక్కసారి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తే.. ఇక్కడెవరూ నమ్మే పరిస్థితిలో లేరు..

ఉర్దూను రెండో అధికార భాషగా ఏనాడో గుర్తించాం..
ఉర్దూను రెండో అధికార భాషగా చేస్తానని ఈరోజు బాబు నోటివెంట కొత్త మాట వింటున్నాం. ఇది చాలా విడ్డూరమని చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత… అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం ఉర్దూను రెండో అధికార బాషగా గుర్తించకపోవడంతోనే ఉర్దూభాష అభివృద్ధికి నోచుకోలేదు. కానీ, మా గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఉర్దూని రెండో అధికార భాషగా ప్రకటించడంతో పాటు చట్టం చేశారు. ఫలితంగా ఉర్దూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అసెంబ్లీకి రాకుండా రోడ్లమీద తిరిగే బాబుకు మాత్రం ఈ విషయం తెలియదా..?. అసెంబ్లీకి వస్తే కదా తెలిసేది..? . ముస్లింల గురించి ఏనాడైనా ఆలోచిస్తే కదా మా సమస్యలు మీకు తెలిసేది?

మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా నడుస్తున్న ప్రభుత్వమిది..
అనాదిగా ఓట్లేయించుకుని పక్కనబెడుతూ అవమానిస్తున్న ముస్లిం మైనార్టీ సామాజికవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అక్కునజేర్చుకున్నారు. మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం కేవలం రూ. 2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ మూడున్నరేళ్లలో మా జగనన్న ప్రభుత్వం మైనార్టీల కోసం రూ. 14వేల కోట్లు ఖర్చు చేసింది. డీబీటీ ద్వారా మైనార్టీలకు రూ.7 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.7 వేల కోట్లు ఈ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించింది.

చంద్రబాబు ఖర్చు చేసిన రెండు వేల కోట్లు ఎక్కడ.. జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసిన 14 వేల కోట్లు ఎక్కడ..? మైనార్టీలకు మేం ఇంత చేశామని ఘనంగా చెప్పుకుంటున్నాం. చంద్రబాబు అధికారంలో ఉండగా, ఎవరికైనా కొత్తగా పెన్షన్‌ ఇవ్వాలంటే.. ఏళ్లుగా ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఊర్లో మరో పెన్షన్‌దారుడు చనిపోతేనే గానీ కొత్త పెన్షన్‌ పేరును జాబితాలోకి ఎక్కించేవారు కాదు. ఈరోజు మా జగనన్న ప్రభుత్వంలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పథకం, అమ్మఒడి, చేయూత, రైతుభరోసా, విద్యాదీవెన వంటి పథకాలు అన్నీ ముస్లిం మైనార్టీలకు అందుతున్నాయి. వైఎస్‌ఆర్‌ వాహనమిత్రలాంటి పథకాల్లో మెజార్టీశాతం మైనార్టీలే ఉపయోగించుకుంటున్నారు. ఇక, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకంతో లబ్ధిపొందిన ఎంతోమంది మైనార్టీలకు ప్రాణదాతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా హజ్‌ యాత్రికులకు జగన్‌మోహన్‌రెడ్డి గారు ఆర్థికసాయం అందించారు. హజ్‌యాత్రకు వెళ్ళే ముస్లిం సోదరులకు రూ.30వేల నుంచి రూ.60వేలు ఇస్తున్న ఘనత జగన్‌ గారి ప్రభుత్వానికే దక్కుతుంది.

ఇమాం, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు..
ఇమాం, మౌజమ్‌లను గౌరవించడంలో మా ప్రభుత్వం ముందుంది. ప్రతీనెలా గౌరవ వేతనం పెట్టి ఇమాంలు, మౌజమ్‌లకు ఇప్పటి వరకు రూ.248 కోట్లు గౌరవవేతనంగా అందించాం. చంద్రబాబు హయాంలో ఇమాంలకు రూ.5వేలు, మౌజమ్‌లకు రూ.3 వేలు మాత్రమే ఇచ్చేవారు. అదికూడా 2018-2019లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. పాదయాత్రలో నాడు జగనన్న మాట ఇచ్చిన ప్రకారం హామీల్ని నిలబెట్టుకుని ఇమాంలకు రూ. 10వేలు, మౌజమ్‌లకు రూ.5వేలు నెలనెలా గౌరవవేతనం అందిస్తున్నాం. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇమాంలు, మౌజమ్‌లకు సుమారు రూ.12కోట్లు బకాయిలు పెట్టి పోతే.. వాటిని కూడా మా జగనన్న ప్రభుత్వమే తీర్చింది.

రూ.6050 కోట్ల ఖర్చుతో పక్కాఇళ్ల నిర్మాణం
దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి.. గృహనిర్మాణాలు చేపడుతున్నాం. ఇందులో, ఒక్క ముస్లిం మైనార్టీలకు ఇళ్ల పట్టాలివ్వడానికి స్థల సేకరణ కోసం రూ.6050 కోట్లు ఖర్చు చేశాం.

చంద్రబాబు హయాంలో దుల్హన్‌ పథకం పేరుతో కేవలం రూ.50వేలు మాత్రమే ఇచ్చాడు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో రూ.69 కోట్లు బాకీ పెట్టి ఎగొట్టిన చరిత్ర చంద్రబాబుది. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌ దుల్హన్‌ పథకాన్ని రూ.1 లక్షకు పెంచారు. ఈ వాస్తవాలన్నీ గుర్తించి చంద్రబాబు ఇకనైనా నిజాలు మాట్లాడితే మేలని తెలుసుకోవాలి. బాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని మొత్తం 10వేల ఎకరాలు ఉంటే వాటిల్లో 5,350 ఎకరాల భూమిని ఇప్పటికే రీసర్వే చేయించాం. రంజాన్‌ తోఫా పేరిట అన్నీ నాశిరకమైన, థర్డ్‌ క్వాలిటీ సరుకులతో తూతూమంత్రంగా పంపిణీ చేశారు. మీ హయాంలో రంజాన్ తోఫా సంచిలో ఇచ్చిన సరుకుల విలువ ఎంత.. జగన్ గారి హయాంలో అక్కచెల్లెమ్మలకు ఇస్తోన్న ఆసరా, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళు విలువెంత..?. చర్చకు వస్తావా బాబూ..?

ముస్లిం యువతపై దేశ ద్రోహం కేసులు పెట్టింది మీరు కాదా?
గుంటూరులో నారా హమారా సభలో పథకాల కోసం ప్రశ్నించిన ముస్లిం యువతపై, చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టింది ఇంకా ముస్లిం సమాజం మరిచిపోలేదు. బాబూ.. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ముస్లింలు లేరు. ఇప్పటికైనా మంచి ఆలోచనలు, మంచి విలువలతో రాజకీయాలు చేస్తే మంచిది.

Leave a Reply