కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది.
ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.
అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.
దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు.
కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదుఇక. మొత్తం జనంతో నిండిపోతుంటారుంకొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు .
భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలోంపడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.
అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా, మనం చేసే దుష్క్ర్తులను పొగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం. కాబట్టి ఆశ్వయుజమాసం చివర వచ్చిన తిధినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు.

Leave a Reply