– రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్
తాడేపల్లి: కనీస గిట్టుబాటు ధర లేక నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వైయస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. అసలు జగన్ కదిలే వరకు, రైతులను ఆదుకోవాలన్న కనీస ఆలోచన సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.
జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైయస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ మంత్రి వెల్లడించారు. జగన్ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసులను మోహరించలేదని, అదే అనుమానాన్ని చివరకు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ తెలిపారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా ఏరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే తప్ప, చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
రైతులను పరామర్శించడానికి వైయస్ జగన్ వెళితే, యార్డు వద్ద కావాలనే రక్షణ వలయం ఏర్పాటు చేయలేదని మిర్చి రైతులే చెబుతున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రైతులతో మాట్లాడటానికి వస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం దేనికి నిదర్శనం?. అసలు జగన్ రైతులతో మాట్లాడితే, చంద్రబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను కూడా పార్టీ కార్యకర్తలను చూసినట్లే చూస్తున్నారు. పొలీస్ వ్యవస్థను పార్టీల పరంగా విడకొట్టే విష సంస్కృతికి చంద్రబాబు తెర తీశారు. పోలీస్ వ్యవస్థ వేధింపుల గురించి హైకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబుకి చీమ కుట్టినట్లు అయినా లేదు. ప్రతి మంగళవారం అప్పులు చేయడం తప్ప, 9 నెలల కాలంలో చంద్రబాబు నెరవేర్చిన హామీ ఒక్కటైనా ఉంటే చూపించాలి.