– మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదు
– వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం
– బిజెపి వికారాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారు?
బీసీలకు ఇప్పటికే బీసీ-బీ, బీసీ-ఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి. రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “కేంద్రం యూరియా ఇవ్వడం లేదు” అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులకు నిజమైన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదు. ఎరువుల దుకాణాల్లో యూరియా దొరక్కపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటు.
రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డొచ్చినా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును “అనంతగిరి జిల్లా”గా మారుస్తాం. అనంతగిరి పర్యాటక కేంద్రంగా దక్షిణ ఊటీగా ప్రసిద్ధి. అనంత పద్మనాభస్వామి ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో వికారాబాద్లో బీజేపీ మూడు అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలి.
తెలంగాణలో ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు – రెండూ ఒకే తీరుగా పాలనలో వైఫల్యం చెందాయి. బీఆర్ఎస్ పార్టీ “దళితబంధు, రైతుబంధు” అంటూ మాయమాటలు చెప్పి, సరిగ్గా అమలు చేయక మోసం చేసింది. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపారు.
కాంగ్రెస్ పార్టీ “రైతుభరోసా” కింద ప్రతి రైతుకి రూ.15,000 ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ వాస్తవానికి రెండు విడతల్లో కేవలం రూ.6,000 మాత్రమే ఇచ్చారు. ఇది రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పూర్తిగా విఫలమైంది.
వికారాబాద్ జిల్లాకు 14,000 ఇళ్లు మంజూరు అయినా, పనులు మొదలైనవి కేవలం 73 మాత్రమేనని సమాచారం. ఇళ్లు నిజమైన అర్హులైన పేదలకు ఇవ్వకుండా, కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయించడం సరికాదు. అర్హులైన బీదలకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వికారాబాద్లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు ఖాయం.
విద్యావంతులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు – అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాన్ని గుర్తించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ కు సక్రమంగా పెన్షన్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం జన్ధన్ యోజన, ముద్ర లోన్లు, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.12 లక్షల కోట్లను కేటాయించింది. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం. ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల ఇళ్లకు వెళ్లి కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులు వివరించాలి.