పెళ్లయిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయమంటారు ?

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ ! పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు .

కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారని విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు ! ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు .

సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే . ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు , వ్రతాలు మారె మహర్షీ అందించలేదేమో ! అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావొచ్చు . ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విబేధాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు . స్త్రీలుకూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు .

ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి , సకల సంపదలూ సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని , అదీ అదీ అననేల, సకల సౌభాగ్యాలూ వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చేప్పారు .

పైగా సత్యనారాయణుడు అంటే, కేవలం విష్ణు స్వరూపము కాదు ! ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం . అందుకే శ్రీ సత్యనారాయణ స్వామివారిని

” మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః ” అని స్తుతిస్తారు.

ఇక, వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది . కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందుకు , ఆ సత్యనారాయణుని ఆసీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . ఇంకా గర్భాదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వశిస్తారు. అందువలనే , నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు .

సాధారణంగా ఎప్పుడైనా కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే, ఒక మంచి రోజు చూసి, బంధు మిత్రులను పిలిచి, పంచభక్ష్య పరమాన్నాలు చేసి, పూలు, ఫలము భగవంతునికి సమర్పించి , భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి, బంధు మిత్రులకు, విందు భోజనాలు పెట్టి, ప్రసాదము తాను తిని యితరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు.

ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష పలితాన్నిస్తుంది. అని విష్ణుమూర్తి నారదునికి చెప్పి నట్లు సూత మహాముని శౌనకాది మునులకు వివరించారని , ఈ వ్రత విధానమంతా కూడా మనకి నారద , నారాయణ సంవాదంగా స్కాందపురాణంలోని రేవాఖండంలో వివరించబడింది .

– బాపనయ్య కుక్కపల్లి

Leave a Reply