– ప్రాజెక్ట్ నిర్మాణంలో అయితే స్పష్టంగా నాణ్యత లోపం తెలుస్తోంది
– ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే మాత్రం ఎప్పుడు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలి
– రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవటం లేదు
– ఇక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటున్నాడు
– పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
– ఉద్దండపూర్ నిర్వాసిత రైతులతో కవిత సమావేశం..వారి బాధలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు
మహబూబ్ నగర్ జిల్లా: ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి. ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలి. 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదు. పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందే. తప్పు బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలకు మంచి జరగాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నా.
ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ప్రభుత్వం చేస్తుందా? లేదా? చెప్పాలి. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌలత్ మంచిగా చేసుకున్నాం.
చెరువులు బాగా అయినయ్. ఎండకాలంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులు కళకళలాడేవి. తెలంగాణ వచ్చాక చాలా మంచి పనులు జరిగాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కృష్ణా నది నీళ్లను వినియోగించుకోవాలని కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు అప్పుడే పూర్తయ్యాయి.
ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గెలిచి కూడా రెండేళ్లు అయ్యింది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయటం లేదు. ప్రాజెక్ట్ కోసం భూములు ఇవ్వటానికి ఇక్కడి ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు.
2 వందల ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ను ఆలస్యం చేస్తున్నారు. పైగా నిర్వాసితులైన రైతులకు కటాఫ్ ఏజ్ 2021 నాటికే పెడుతున్నారు. ఇప్పుడు 18 ఏళ్లు ఉన్నవారికి పరిహారం ఇవ్వమంటున్నారు. ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందా లేదా? ప్రాజెక్ట్ నిర్మాణంలో అయితే స్పష్టంగా నాణ్యత లోపం తెలుస్తోంది.
ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే మాత్రం… ఎప్పుడు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలి. ఆనాటికి 18 ఏళ్లు ఉన్న వాళ్ల అందరికీ పరిహారం ఇవ్వాల్సిందే. దాదాపు 286 మంది డబ్బులు రావని ఆందోళన చెందుతున్నారు. భూమి పోతున్న యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. పోలేపల్లి లో ఎకరాకు పన్నెండున్నర లక్షలు ఇచ్చి, మిగతా ప్రాజెక్టుల ముంపు గ్రామాల ప్రజలకు ఆరున్నర లక్షలు ఇస్తున్నారు. అందరికీ ఒకటే ధర కట్టి ఇవ్వాలి.
ఇక్కడి ఎమ్మెల్యే డిసెంబర్ 9వ తేదీలోపు నిర్వాసితులకు ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం, రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీ ఇప్పిస్తానని మాట ఇచ్చారు. అప్పటి వరకు వేచి చూద్దాం. ఆ తర్వాత మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ చేద్దాం. ప్రాజెక్టు విషయంలో అందరీ తప్పు ఉంది. తప్పు బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు.
ఇక్కడ ఇంకో 20 శాతం పనులు చేస్తే చాలు ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. నన్ను గెలిపిస్తే మహబూబ్ నగర్ కు మంచి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవటం లేదు. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటున్నాడు. ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన ముందుకు పోతుండు. దీంతో జరగాల్సినంత మేలు జరగటం లేదు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఏనుగు వెళ్లి తోక చిక్కింది. ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు వద్దు. ప్రజలకు మేలు జరగాలి. ఇప్పుడు 18 ఏళ్లు నిండిన 286 మందికి కూడా పరిహారం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఏరోజు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలి. ఎకరానికి రూ. 25 లక్షలు కట్టి ఇవ్వాలి. నిర్వాసితులకు మంచి జరగాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నా.
ఇళ్లు, భూములు కోల్పోతున్న రైతుల బాధ నాకు తెలుసు. వారి విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కాంగ్రెస్ గెలిస్తే తమకు మేలు జరుగుతుందని ఆశ పెట్టుకొని ప్రజలు గెలిపించారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలి. పెన్షన్, రైతు భరోసా, బోనస్, మహిళలకు రూ. 2500 సాయం అంశాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఉద్యమకారులకు ఇస్తామన్న డబ్బులు ఇస్తలేరు.
షాద్ నగర్ లో నన్ను కలిసిన మహిళలు ప్రభుత్వం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదని చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వారందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలి. పాలమూరు- రంగారెడ్డి నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నా.