Suryaa.co.in

Telangana

కష్టపడండి.. కలిసికట్టుగా ముందుకు సాగండి

-మెదక్ సీటు మనకు ప్రతిష్టాత్మకం
-మహానేత ఇందిరా గాంధీ ప్రాతినిథ్యం వహించిన స్థానం ఇది
-మెదక్ లో పార్టీ కి పూర్వవైభవం తీసుకుని వద్దాం..
-సీటును కాంగ్రెస్ ఖాతాలో వేద్దాం
-మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జి లు శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

బుధవారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గల ఇంచార్జిలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహానేత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం మనకు ప్రతిష్టాత్మకమని ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, బిజెపి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఇదే అదనుగా నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని ప్రచారంలో మన పథకాలే ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు.

LEAVE A RESPONSE