– రాష్ట్రంలో గ్రంధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు
– అమరావతిలో అత్యాధునిక సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం
– రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు
విజయవాడ: అమరావతిలో అధ్బుతమైన అత్యాధునిక వసతులతో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు.
ప్రపంచ స్థాయి లో గుర్తింపు ఉండేలా ఐదు ఎకరాల స్థలంలో ఈ లైబ్రరీ నిర్మాణం ఉంటుందన్నారు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా వేలాది మందికి హైద్రాబాద్ లో ఉద్యోగాలు పొందారన్నారు. 2025లో నిర్మాణం చేయబోయే ఈ లైబ్రరీ కూడా భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు, ఉపాది కల్పించేలా ఉంటుందన్నారు.
ఇతర దేశాల్లో కూడా పలు లైబ్రరీలను సందర్శించి వచ్చానన్నారు. ఆ వివరాలతో పాటు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని అందరికీ నచ్చేలా మెచ్చేలా గ్రంధాలయం ఉంటుందన్నారు.
దేశంలోనే అత్యాధునిక సెంట్రల్ లైబ్రరీ ని అమరావతిలో నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నమూనా ఎలా ఉండాలి, ఏ విధంగా రూపకల్పన చేయాలనే అంశాలపై వర్క్ షాపు నిర్వహించామన్నారు. అనేక ప్రాంతాల నుంచి నిపుణులైన ఆర్కిటెక్చరర్లు వచ్చారన్నారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సాప్ట్ వేర్ లకు సంబంధించిన అంశాలను నిపుణులు వివరించారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నైపుణ్యం కల్గిన వారి నుంచి, వివిధ యూనివర్శిటీ ప్రొఫెసర్ల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు.
వచ్చే రెండేళ్ళల్లో ఈ సెంట్రల్ లైబ్రరీ దేశానికే ఆదర్శంగా ఉండబోతుందన్నారు.. ఈ గ్రంధాలయం నిర్మాణం కోసం త్వరలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ కాంపిటేషన్స్ నిర్వహిస్తామన్నారు.. ప్రముఖ ఆర్కిటెక్చర్లు కూడా ఈ పోటీలో పాల్గొని వివిధ నిర్మాణ ఆకృతులను కూడా అందించ వచ్చునన్నారు. అనంతరం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అద్భుతమైన డిజైన్ తో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలియజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర మౌలిక వసతులు కల్పన బోర్డు చైర్మన్ రాజశేఖర్, గ్రంథాలయ సంస్థ బోర్డు డైరెక్టర్ డైరెక్టర్ రాసాని పద్మజ, రామూర్తి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణ మోహన్, తదితరలు పాల్గొన్నారు.