ఏపీలో క్షీణిస్తున్న పారిశ్రామికాభివృద్ధి

 -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ

01.11.2022
గౌరవ శ్రీ.వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

విషయం : ఏపీలో క్షీణిస్తున్న పారిశ్రామికాభివృద్ధి – తరలిపోతున్న పరిశ్రమలు – ఉద్యోగ, ఉపాధి అవకాలు లేక నిర్వీర్యమైపోతున్న యువత – మెరుగైన పారిశ్రామిక విధానాలకు చర్యలు

రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం గత మూడున్నరేళ్లుగా అధోగతి పాలైంది. మైనస్ గ్రోత్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సున్నా పెట్టుబడులతో బడుగుల సంక్షేమం సంక్షోభంలో చిక్కుకుంది. టీడీపీ హయాంలో పారిశ్రామిక, సేవారంగాలు జెట్ స్పీడ్ తో పరుగులుతీస్తే ప్రస్తుతం అన్ని రంగాలు కూడా తిరోగమనంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ విద్వేష, వికృత, విధ్వంసకరమైన విధానాలతో రాష్ట్రానికి కొత్తగా ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. ఉపాధి కల్పన లేదు. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయాలతో ఏపీలో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, ప్రతి పనిలో నీకది-నాకిది(కమిషన్లు)కు భయపడి.. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతున్నారు. గత మూడున్నరేళ్లలో రూ.17లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ వెళ్లిపోయాయి. అదానీ డేటా సెంటర్ రద్దు చేశారు. లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేశారు.

ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఏషియన్ పల్ప్ పేపర్ పరిశ్రమ పెట్టుబడులు ఉపసంహరించుకుంది. బీఆర్ షెట్టి సంస్థలు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు, రేణిగుంటలో రిలయన్స్ పెట్టుబడులు, వరల్ట్ బ్యాంకు రుణాలు వెనక్కి రూ.2,100 కోట్లు, ఏషియన్ బ్యాంకు రుణాలు రూ.1,400 కోట్లు, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ విశాఖ రుషికొండ ఐటి సెజ్ నుండి కంపెనీలు తరలిపోయాయి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లో వచ్చిన పెట్టుబడులెన్ని, నెలకొల్పిన పరిశ్రమలెన్ని, కల్పించిన ఉద్యోగాలెన్ని.? సిబిఐసి కారిడార్ పురోగతి ఏమిటి..? చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కు వచ్చిన పెట్టుబడులెన్ని, నెలకొల్పిన పరిశ్రమలెన్ని, కల్పించిన ఉద్యోగాలెన్ని..? వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏమైంది.? దానివల్ల రాష్ట్రానికిగాని, యువతకు గాని ఒరిగిందేమిటి.? ఇలా.. ఒక్కటేమిటి.. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేశారు. కేటాయించిన భూములు వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయాలతో.. పెట్టుబడులు, పరిశ్రమలు ఏపీకి దూరం కావడమే కాకుండా.. రాష్ట్ర యువత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కనీసం పత్రికా స్వేచ్ఛ కూడా లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు మాత్రం ఎందుకు వస్తారో ఆలోచించుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ పేపర్లకే పరిమితమైంది. విద్యాధికులైన యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆర్ధిక స్థితిగతులు తలకిందులవుతున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో.. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్ధాలకు బానిసలవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం.. వైఎస్సార్ నవోదయం, వైఎస్సార్-జగనన్న బడుగు వికాసం, 2020-23 నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చింది. కానీ ప్రోత్సాహకాలకు మాత్రం ఎలాంటి నిధులివ్వకుండా నీరుగార్చారు. దావోస్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా కమిటీ వెళ్లినప్పటికీ.. పైసా పెట్టుబడి వచ్చినట్లు ఎక్కడా ఎవరూ చెప్పలేదు.

2021-22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల కింద రూ.24.40 కోట్లు, బీసి పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలుగా రూ.101కోట్లు, జనరల్ కేటగిరీ వారికి రూ.191కోట్లు మాత్రమే ఖర్చు చేయడమంటే ఏ స్థాయిలో పారిశ్రామిక వేత్తలను నిర్వీర్యం చేస్తున్నారో అర్ధమవుతోంది. ఇలాంటి ప్రోత్సాహకాలు బడుగు బలహీన వర్గాల పారిశ్రామిక వేత్తలను ఎదగనీయకుండా చేయడమే. బీసీ, ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధిని పూర్తిగా అటకెక్కించారు. టీడీపీ హయాంలో ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లను గుర్తించి వాటిపైనే పూర్తిగా దృష్టిపెట్టి GSDP పెంపునకు కృషి చేశాం. ఫలితంగా నాలుగేళ్లు డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైంది. కానీ గత మూడున్నరేళ్ల పాలనలో గ్రోత్ ఇంజన్లన్నీ రివర్స్ లో నడుస్తున్నాయి. హార్టీకల్చర్(-8%), లైవ్ స్టాక్(-6.5%), మత్స్య ఆక్వారంగం(-14%), మొత్తం అగ్రికల్చర్ సెక్టార్(-4.8%), తయారీరంగం(-5.4%), నిర్మాణరంగం(-2.6%), పారిశ్రామిక రంగం (1.4%), ట్రేడ్ అండ్ రెస్టారెంట్ (-4%), సేవారంగం (-1.7%) ఓవరాల్ GSDP గ్రోత్(-1.8%)గా నమోదయింది. చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం రెండంకెల్లో ఉంటే, గత మూడున్నర సంవత్సరాలుగా సింగిల్ డిజిట్ కు పరిమితమైంది.

ఈ మూడేళ్ళలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయింది. అదే 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.19,671 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు ఆకర్షణతో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. 2019 అక్టోబరు-2021 జూన్‌ మధ్యలో తమిళనాడు రూ.30 వేల కోట్లు, కర్ణాటక రూ.1.49 లక్షల కోట్లు, తెలంగాణ రూ.17,709 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగా, 2019 అక్టోబర్-2021 జూన్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిన పెట్టుబడులు రూ.2,577 కోట్లు మాత్రమే. 2018-19లో జీవీఏ లెక్కల ప్రకారం ఏపీ పారిశ్రామిక వృద్ధి రేటు 10.24 శాతం కాగా. 2020-21లో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు -3.26 శాతం (మైనస్) నమోదైంది. ఇది సున్నా శాతం కంటే తక్కువ. 2019 అక్టోబర్ – 2020 డిసెంబర్ మధ్య ఏపీకి కేవలం రూ.1975 కోట్ల FDIలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా వచ్చిన FDIలలో కేవలం 0.32శాతం మాత్రమే.

రాష్ట్రంలో వనరులు, పరిశ్రమల ఏర్పాటులో మనం కల్పించే సౌలభ్యాలను, ప్రోత్సాహకాలను, ప్రాజెక్టులను నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధత బట్టి పరిశ్రమలు ఏర్పాటుకు సుముఖత చూపిస్తారు. పారిశ్రామికాంధ్ర ఆవిష్కారారానికి చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అన్ని విధాలా అవిరళ కృషి చేశారు. అందుకే పెట్టుబడులు బారులు తీరాయి. ఆటోమొభైయిల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారత్ పోర్డ్, హీరో గ్రూపు రాగా, సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్ కాన్, ప్లెక్స్ ట్రానిక్స్, డిక్సన్, రిలయన్స్, టీసియల్, ఓల్టాస్ వంటి సంస్థలు వచ్చాయి. ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా టీడీపీ ఐదేళ్ల పాలనలో పారిశ్రామికాంధ్ర ఆవిష్కారానికి కృషి జరిగింది.

అధికారంలోకి రాగానే విద్యుత్ పీపీఏలను రద్దు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ కాంట్రాక్టు సంస్థలను వెంటబడి వేధించారు. సాగునీటికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రశ్నార్ధకం చేశారు. రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. అలాంటి రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే విషయాన్ని పరిశీలించి.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నాం.

యనమల రామకృష్ణుడు
(పోలిట్ బ్యూరో సభ్యులు)

Leave a Reply