రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళతా: అచ్చెన్నాయుడికి వైసీపీ ఎమ్మెల్సీ వార్నింగ్

ఒంగోలులో నిర్వహించిన మహానాడులో టీడీపీ నేతలు సీఎం జగన్ పై ధ్వజమెత్తడం తెలిసిందే. పార్టీలో ఓ మోస్తరు నేతల నుంచి అధినేత చంద్రబాబు వరకు అందరూ సీఎంను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు.

జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, తాట తీస్తానని అన్నారు. అంతేకాదు, అంకుశం సినిమాలో విలన్ ను కొట్టినట్టు రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళతానని ఘాటుగా హెచ్చరించారు. రాజకీయంగా అచ్చెన్నాయుడి అంతుచూస్తానని, అదే తన ఆశయం అంటూ స్పష్టం చేశారు.

జగన్ కోసం తాను ఏమైనా చేస్తానని, ఆత్మాహుతి దళంగా మారేందుకైనా తాను సిద్ధమని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జీవితం మీద, ప్రాణం మీద ఆశ లేని వ్యక్తినని, టీడీపీ నేతలు ఈ విషయం గమనించి జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దువ్వాడ పైవ్యాఖ్యలు చేశారు.

Leave a Reply