Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పేరు ఇక రప్పా..రప్పా పార్టీ.. ఎన్నికల గుర్తు గొడ్డలి!

– సైకో మనస్తత్వం కలిగిన జగన్ రెడ్డి పార్టీకి అవే కరెక్ట్
– దళిత సోదరుడు సింగయ్యది జగన్ రెడ్డి చేసిన హత్యే
– జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలి
– కాకులు, కోతులకు ఉండే జాలి, దయ కూడా వాళ్లకు లేకుండా పోయింది
– నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు: దళిత సోదరుడు సింగయ్యది జగన్ రెడ్డి చేసిన హత్యే. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి చేపట్టిన ర్యాలీలో సింగయ్య మెడను కారు కింద నలిపేశారు. సాటి మానవుడి ప్రాణం పోతుందనే కనికరం కూడా లేకుండా సింగయ్య శరీరాన్ని లాగి పక్కన పడేశారు.

జగన్ రెడ్డి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చింది రెంటపాళ్లలో..అది కూడా 3 కార్లు,,వంద మందికి. 9 గంటల సేపు 80 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి ముగ్గురు ప్రాణాలను బలితీసుకున్నాడు. రెంటపాళ్లకు వెళ్లింది బెట్టింగ్ లో నిండామునిగిపోయి ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు 2024 జూన్ 9న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన ప్రాణాలు తీసుకున్నాడు.

వై నాట్ 175 అని జగన్ పలికిన ప్రగల్భాలను గుడ్డిగా నమ్మి బెట్టింగులు కట్టి నష్టపోయాడు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారణం కూడా జగన్ రెడ్డే. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మాజీ సీఎం వెళ్లడం కంటే దుర్మార్గం మరొకటి లేదు. గంగమ్మ జాతరలో పోతును నరికినట్టు టీడీపీ కార్యకర్తలను రప్పా రప్పా నరికేస్తామనడం తప్పుకాదని సమర్ధించుకోవడం జగన్ రెడ్డి లాంటి సైకోకే చెల్లింది.

వైసీపీ పేరు మార్చి రప్పా రప్పా పార్టీ అని పెట్టుకోవాలి. ఎన్నికల గుర్తుగా గొడ్డలిని మార్చుకోవాలని హితవు పలుకుతున్నా. దళితుల ప్రాణాలు బలితీసుకోవడం వైసీపీ నాయకులకు మొదటి నుంచి అలవాటే. గతంలో డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణాకర్..ఇప్పుడు సింగయ్యతో పాటు మరొకరు. ఏ రోజూ ఆ దళిత కుటుంబాలను జగన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎందుకు పరామర్శించలేదు?

బెట్టింగులో నష్టపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించే పేరుతో ర్యాలీ నిర్వహించి మూడు ప్రాణాలను బలితీసుకున్నాడు. సింగయ్యతో పాటు మరొకరు కార్ల కింద పడి చనిపోతే..మరొకరు అంబులెన్సులో వెళుతూ ట్రాఫిక్ లో చిక్కుకుని సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. జగన్ రెడ్డి కారులో ఆయనతో పాటు డ్రైవర్, పీఏ, సీనియర్ వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. మరో వాహనంలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయకుండా రోడ్డు పక్కన చెట్లలోకి లాగేయడం దుర్మార్గం.

జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలి. జగన్ రెడ్డి లాంటి వ్యక్తులకు దళితులు, గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోతోంది. 80 కిలోమీటర్ల పొడవునా రోప్ పార్టీ పోలీసులను పెట్టలేదని మాట్లాడటానికి జగన్ రెడ్డికి నోరెలా వస్తుందో? రెంటపాళ్లలో పరామర్శ పేరుతో అనుమతి తీసుకుంటే దారంతా రోప్ పార్టీ పెడతారా?

జగన్ రెడ్డి భద్రత కోసం ఆ కార్యక్రమంలో ప్రభుత్వం 679 మంది పోలీసులను నియమించింది. జెడ్ ఫ్లస్ కేటగిరి భద్రతలో ఉండే చంద్రబాబు నాయుడుపై పుంగనూరులో రాళ్లు వేయించాడు. రాళ్లు వేయడమే గాక చంద్రబాబు నాయుడుతో పాటు వందల మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాడు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు జైళ్లకు పోవడం,,ఊళ్లు వదిలిపెట్టి పోవడం జరిగింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అప్పట్లో నడిరోడ్డుపై కూర్చోపెట్టాడు. విశాఖలో జనసైనికులపైనా రాళ్లు వేయించాడు. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబును చిత్రహింసలు పెట్టారు. సొంత పార్టీ ఎంపీలను సైతం వదిలిపెట్టకుండా కక్షసాధింపులకు పాల్పడ్డాడు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వీడియో కాల్ లో చూసి పైశాచిక ఆనందం పొందగా, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై గ్రావెల్ దొంగతనం కేసు పెట్టించారు.

ఇలాంటి ఎన్నో దుర్మార్గాలు చేసిన వైసీపీ పేరుతో పాటు ఎన్నికల గుర్తు కూడా మార్చేయాలి. ఒక సీఎం కుటుంబం, ఆయన సన్నిహితులు అవినీతికి పాల్పడితే ఏ విధంగా చేయొచ్చనేందుకు లిక్కర్ స్కామే నిదర్శనం. ఏపీ మద్యం స్కాముకు సంబంధించి అంశాలు పత్రికల్లో పుంఖానుపుంకాలుగా వస్తున్నాయి. మద్యం స్కాములో జరిగిన అక్రమాల విలువ అధికారికంగా రూ.3200 కోట్లు అయితే..అనధికారిక విక్రయాలతో కలిపి స్కామ్ విలువ రూ.10 వేల కోట్లపైనే.

తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి రూ.43 వేల కోట్లు దోపిడీ చేసి 13 సీబీఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఢిల్లీలో రూ.150 కోట్ల లోపు మద్యం స్కాముకే సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కీలక నేతలు నెలల తరబడి జైళ్లకు వెళ్లారు. లిక్కర్ స్కామ్ లో వెలుగుజూస్తున్న నిజాలు చూస్తే సిట్ అధికారులకే మైండ్ బ్లాక్ అవుతోందంట.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రూటింగ్, డిస్టలరీల స్వాధీనం, విదేశీ అకౌంట్లు, బంగారు నగలు, వజ్రాల లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. సెన్సేషనల్ కరప్షన్ కేసు అయిన లిక్కర్ స్కామ్ డైవర్షన్ కోసమే రోజూ ప్రెస్ మీట్లు పెట్టి జగన్ రెడ్డి హడావుడి చేస్తున్నాడు. రాష్ట్రం సజావుగా నడవడం, అభివృద్ధి చెందడం జగన్ రెడ్డికి సాక్షికి ఇష్టం లేదు. ప్రాణాలకు రక్షణ లేదని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఓ వైపు ఊళ్లోళ్ల ప్రాణాలు తీసే జగన్ రెడ్డికి ప్రాణభయం అనడం విచిత్రమే.

679 మంది పోలీసులు భద్రతగా ఉంటే ప్రాణభయమెందుకో? కాకులు, కోతులు చనిపోయినప్పుడు వందల కొద్ది కాకులు, గుంపులుగా కోతులు అక్కడకు చేరుకుని మూగవేదన అనుభవిస్తాయి. కనీసం పక్షులు, జంతువులకు ఉన్నంత జాలి, దయ కూడా జగన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు లేకుండా పోయాయి. ఇలా క్రూరంగా ప్రవర్తించే వారి గురించి ఎక్కడో పత్రికల్లో వార్తలు చదువుతుంటాం. వైసీపీ నాయకుల ముందు వారికి డిపాజిట్లు కూడా దక్కేలా లేవు. ముగ్గురు ప్రాణాలు పోతే ప్రెస్ మీట్లు పెట్టి జోకులేస్తున్నాడు. సైకో మనస్తత్వం కలిగిన వారికే ఇలాంటివి సాధ్యమవుతాయి.

LEAVE A RESPONSE