– రైతుకు నష్టం వస్తే… ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు
– ఈనెల 15,16 నుంచి మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు
– మార్కెటింగ్ ఇబ్బందుల దృష్ట్యా… వ్యాపారులూ సహకరించాలి
– ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు: హై, మీడియం గ్రేడ్ తో పాటు లో గ్రేడ్ పొగాకును కూడా రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకిలోని …. వేలం కేంద్రాన్ని సహచర మంత్రి డోలాతో కలిసి పరిశీలించిన ఆయన… పొగాకు కొనుగోలుకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
గడిచిన రెండేళ్లుగా పొగాకు కొనుగోలుతో వ్యాపారులు, కంపెనీ ప్రతినిధులు లాభాలు పొందారని గుర్తు చేశారు. అధిక ఉత్పత్తితో ప్రస్తుతం ఉన్నతక్కువ డిమాండ్ దృష్ట్యా రైతుల నుంచి పూర్తి స్థాయిలో పొగాకు కొనుగోళ్లకు బయ్యర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతులకు నష్టం వస్తుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల వచ్చిన మార్కెటింగ్ ఇబ్బందులను అధిగమించి… వ్యాపారులు కూడా పొగాకు రైతులకు సహకరిచాలని కోరారు. దీనిపై అవసరం అయితే పొగాకు బోర్డు కూడా ముందుకు వచ్చి.. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. బ్లాక్ బెర్లీ రకం పొగాకును కూడా కొనుగోలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించామని చెప్పిన మంత్రి.., బ్లాక్ బెర్లీ పొగాకును కూడా వెంటనే కొనుగోలు చేయాలని వ్యాపారులకు చెప్పారు.
రైతులకు ముఖ్యమంత్రి బాసట….
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని చెప్పిన మంత్రి గొట్టిపాటి.., మామిడి సీజన్ లో రైతులకు సమస్య ఉత్పన్నం అయితే స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి సమస్య పరిష్కరించిన విషయాన్నిగుర్తు చేశారు. ప్రస్తుతం బ్లాక్ బెర్లీ పొగాకు విషయంలోనూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ నెల 15, 16 తేదీల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా… బ్లాక్ బెర్లీ రకం నల్ల పొగాకు కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలోనూ ఆయల్ పామ్, కోకో పంటల రైతులకు సమస్యలు ఎదురైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలూ చేపడుతున్నామన్నారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా… వాటిని వెంటనే పరిష్కరించి ముందుకు వెళ్తామని గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.