వైసీపీ ప్లీనరీ: జగన్ నుంచి కార్యకర్త వరకు అందరికీ ఒకటే మెనూ!

-నేటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌స్థాయి ప్లీనరీ స‌మావేశాలు

గుంటూరు: వైసీపీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమయింది. రెండు రోజుల రాష్ట్ర స్థాయి ప్లీన‌రీ స‌మావేశాలు ప్రారంభం కావ‌డంతో పార్టీ శ్రేణుల గుండెలు నిండుగా మారాయి. పండుగ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు గుంటూరుకు ప‌య‌న‌మ‌య్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైయ‌స్ఆర్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు.

సర్వత్రా ఆసక్తి..
అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రం నలు మూలల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. వర్షం వచ్చినా ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీ విస్తీర్ణంలో వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేశారు.

వందేమాతరం గీతాలాపనతో..
వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలవుతుంది. ఆ తర్వాత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయ‌స్‌ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సందేశం ఇస్తారు.

ప్లీనరీలో కార్యక్రమాలు ఇలా..
వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం జరుగుతుంది. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్లీనరీ వేదికపైకి సీఎం వైఎస్‌ జగన్‌ను, ప్రధాన నాయకులను ఆహ్వానిస్తారు.

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం
మూడేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్, పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులను గుర్తు చేస్తూ నమూనా ఏర్పాటు చేశారు. విద్యుత్‌ దీప కాంతులతో ప్రాంగణం ధగధగలాడుతోంది. రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు. కాగా, కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలిస్తుండటంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ క్రమంలో ప్లీనరీకి భారీ స్థాయిలో శ్రేణులు తరలి వస్తున్నాయి.

పారదర్శకత అంశాలపై చర్చలు.. తీర్మానాలు..
పార్టీ ఆడిట్‌ ఖర్చుల స్టేట్‌మెంట్‌ను పి.కృష్ణమోహన్‌రెడ్డి ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా నియమావళికి సవరణలు ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. ఆ తర్వాత మహిళా సాధికారత – దిశ చట్టం, విద్య, నవరత్నాలు-డీబీటీ, వైద్యం, పరిపాలన-పారదర్శకత అంశాలపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెడతారు.

అందరికీ ఒకే మెనూ
ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్‌vjr అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు.

Leave a Reply