2022లో వైయస్‌ఆర్సీపీ విజయాలు ఎన్నో.. ఎన్నెన్నో…!

– మూడున్నరేళ్ళలోనే 98.4 శాతం వాగ్దానాలు అమలు– సంక్షేమ రాజ్యం స్థాపన
– సంక్షేమం అంటే జగన్‌.. జగన్‌ అంటే సంక్షేమం అన్నట్టుగా పరిపాలన
– డీబీటీ–నాన్‌ డీబీటీ ద్వారా మూడున్నరేళ్ళలో దాదాపు రూ. మూడున్నర లక్షల కోట్లు పేదలకు పంపిణీ
– రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు – వికేంద్రీకరణతో గడప వద్దకే పరిపాలన
– 2022లోనే 2024 టార్గెన్‌ ను నిర్దేశించిన ముఖ్యమంత్రి జగన్‌
– 2024లో వార్‌ వన్‌ సైడే.. 175కు 175 గెలుపే లక్ష్యంగా అడుగులు
– వెనుకబడిన కులాలకు వెన్నుదన్నుగా జగన్‌ .. పార్టీకి బ్యాక్‌ బోన్‌ గా బీసీలు
– సామాజిక న్యాయానికి పెద్దపీట–మహిళలకు అన్నింటా అగ్రతాంబూలం

నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుంటే.. ఎవరైనా గడిచిన సంవత్సరంలోని జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనులను, టార్గెట్‌ లను నిర్దేశించుకుంటారు. మన జీవితాల్లోనూ గతానికి, వర్తమానానికి ఉన్న తేడాను, జయాపజయాలను బేరీజు వేసుకుంటాం. రాజకీయాల్లోనూ అంతే. గతంలో పాలన ఎలా ఉంది.. వర్తమానం ఎలా ఉంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ప్రతి ఒక్కరూ అంచనా వేసుకుంటారు.

లాక్‌ డౌన్‌ రోజుల్లో పేదవాడి ఊపిరి నిలబెట్టింది ఆ పథకాలే
ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలన ఆరంభమైంది. పాలన ప్రారంభమైన ఏడాదిలోనే.. యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ రాష్ట్రంపైనా తీవ్ర ప్రభావం చూపింది. కొవిడ్‌ సమయంలో ఉపాధి లేక, తిండిగింజలకే గగనమైన ఆ భయంకరమైన రోజుల్లో.. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అమలు చేసిన సంక్షేమ పథకాలే పేదలకు ఆలంబన అయ్యాయి. ‘ఆ సంక్షేమ పథకాలే లేకపోతే.. మా ప్రాణాలు ఏమైపోయేవో.‘ అని ఆ లాక్‌ డౌన్‌ రోజులను ఇప్పటికీ పేదలు జ్ఞప్తికి తెచ్చుకుంటుంటారు.

దాదాపు రెండేళ్ళపాటు కరోనా సమయంలో, ప్రజలను, ముఖ్యంగా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలను ఆదుకున్నది జగన్‌ మోహన్‌ రెడ్డి తెచ్చిన సంక్షేమ పథకాలే. కొవిడ్‌ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆదాయం పడిపోయి, ప్రభుత్వం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నా, మానవత్వంతో, మనసున్న ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందించిన వైద్య సేవలుగానీ, సంక్షేమ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసిన సొమ్ములుగానీ.. ప్రజలను బతికించాయంటే అతిశయోక్తి కాదు. పరిపాలన అంటే ఇదే కదా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే కదా పాలకుడు ఆదుకోవాల్సింది.. అని అంతా భావించారు. అందుకే జగన్‌ మోహన్‌ రెడ్డిగారు తెచ్చిన పథకాలుగానీ, చేసిన సంస్కరణలుగానీ దేశానికే ఆదర్శంగా నిలిచాయి, నిలుస్తున్నాయి.

జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన జనరంజకమైంది. పేదోళ్ళ రాజ్యమైంది. బడుగు, బలహీనవర్గాల రాజ్యమైంది. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ విధానాలు బలహీనుడికి బలమయ్యాయి. అధికారం కొందరిది కాదు.. ప్రజలందరిదీ, ముఖ్యంగా పేదలందరిదీ అని నిరూపించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి . ప్రజలు అధికారం ఇచ్చింది, పదవులు కట్టబెట్టిందీ అధికారం చలాయించడానికి కాదు.. సేవ చేయడానికే అని తాను నమ్మి, అదే విధానాన్ని తన సహచర మంత్రుల నుంచి కిందిస్థాయి సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్ల వరకు అమలు చేస్తున్న నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి.

అవినీతికి తావు లేకుండా, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క కనిపించేలా, ప్రతిదీ పారదర్శకంగా, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా గడప గడపకూ ప్రభుత్వ పథకాలూ, సేవలు అందించే పాలన తెచ్చారు. రేషన్‌ కార్డు కావాలన్నా, పింఛను రావాలన్నా, ఇళ్ళు మంజూరు కావాలన్నా.. ఎవరినీ దేబిరించాల్సిన పనిలేదు, ఏ రాజకీయ నాయకుడికీ ఊడిగం చేయాల్సిన అవసరం అసలే లేదు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గతంలో మాదిరిగా చెప్పులు అరిగేలా తిరగాల్సిన పని అంతకన్నా లేదు. ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే, సచివాలయాల్లో ఒక దరఖాస్తు చేసుకుంటే.. పథకాలు అర్హుల గడపకే వస్తున్నాయి, పథకాల సొమ్ము నేరుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది.

మేనిఫెస్టోనే వైఎస్‌ఆర్సీపీ ఆత్మ
ప్రతి పార్టీకీ ఒక పొలిటికల్‌ ఫిలాసíఫీ ఉంటుంది. వైఎస్‌ఆర్సీపీ పొలిటికల్‌ ఫిలాసíఫీ ఆ పార్టీ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఆత్మే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేదల సంక్షేమం. ఇదే వైఎస్‌ఆర్సీపీ ఫిలాసఫీ. కులం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడం అంటూ ప్రతి గడపకూ సంక్షేమ పాలన అందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ఇళ్ళకు వెళ్ళి మరీ పథకాలు అందిస్తున్నారు. ఎన్నికల వరకే పార్టీలు.. ఎన్నికల తర్వాత అందరూ నా వాళ్ళే.. అన్నదే జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధాంతం. నవరత్నాల పాలనకు అర్ధం చెబుతూ… ఇంటింటికీ గడప గడపకూ అందే సామాజిక న్యాయం, సాధికారత. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఐదు రకాల సాధికారతలు లక్ష్యంగా ఈ మూడున్నర ఏళ్ళలో అడుగులు వేసింది. ఇందులో
మొదటిది ఆర్ధిక సాధికారత– డీబీటీ, నాన్‌ డీబీటీ పరంగా అడుగులు వేసింది.
రెండోది రాజకీయ సాధికారత– దీనికి అద్దం పట్టే విధంగా పదవులు, నియామకాలు.
మూడోది సామాజిక సాధికారత– ఇందుకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎన్టీ, మైనార్టీ, పేదలే లక్ష్యంగా పథకాలు.
నాలుగోది మహిళా సాధికారత– అన్నింటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు భద్రత, భరోసా.
ఐదోది విద్యా సాధికారత– విద్య ద్వారానే అందరి జీవితాల్లో మార్పులు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
ఈ విధానాలే జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామని ఎప్పుడూ చెప్పే జగన్‌ మోహన్‌ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక తూ.చ తప్పకుండా ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాట మేరకు.. ఇప్పటికి 98.4 శాతం హామీలు అమలు చేశారు. దేశ రాజకీయాల్లోనే మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అని చెప్పుకోవాలి. రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా జగన్‌ అడుగులు వేస్తున్నారు.

చేతల్లో సామాజిక న్యాయం
మరీముఖ్యంగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జగజ్జీవన్‌రామ్, పూలే, కొమరం భీమ్, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ల వంటి మహనీయులు కలలుగన్న సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. అమరావతి రాజధానిలో పేదలకు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇళ్ళ పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని వాదించిన పచ్చ పాలకుల ఆలోచనలు, విధానాల నుంచి.. బ్యాక్‌ వర్డ్‌ వర్గాలే తమ ప్రభుత్వానికి బ్యాక్‌ బోన్‌ వర్గాలని ఢంకా బజాయించి చెప్పిన నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి . బడుగు, బలహీనవర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా చైతన్యాన్ని మూడున్నరేళ్ళలోనే మంత్రివర్గం నుంచి క్షేత్రస్థాయి వరకు అమలు చేసి చూపించిన నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి.

మంత్రి వర్గంలో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది మొదలు.. 139 కులాల బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు నుంచి.. కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవులు, దేవాదాయ శాఖ ఆలయ కమిటీలు, ట్రస్టు బోర్డులు పదవుల్లో, గ్రామ పంచాయితీ నుంచి మండలస్థాయి, మున్సిపల్, జిల్లా పరిషత్‌ పదవుల వరకు.. అన్నింటా 50 శాతంకుపైగా పదవులు అణగారిన వర్గాలే దక్కించుకున్నాయి.

ఈ వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి. అందులో మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్లు చేయించి, జగనన్న కాలనీల ద్వారా ఇళ్ళు నిర్మిస్తున్న నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. ఇందులో ఇప్పటికే 21.20 లక్షల ఇళ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఇంతకాలం సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం మహిళలకు… అన్న నినాదాలను.. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ లో విధానంగా మార్చారు. మొత్తంగా బడుగు, బలహీనవర్గాలకు జగన్‌ మోహన్‌ రెడ్డిసంక్షేమ పరిపాలన గోల్డెన్‌ యుగంగా మారింది.

ఈ రోజు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిలో ఒక మైనార్టీ సోదరుడు అంజాద్‌ భాషా ఉన్నాడంటే మార్పు గమనించవచ్చు. అదే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నలుగురు మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా నియమించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇవాళ శాసనమండలి ఉపాధ్యక్షపదవిలో మైనార్టీ మహిళ ఉంది. ఆర్టీఐ చీ‹ఫ్‌ కమిషనర్‌గా కూడా మైనార్టీనే ఉన్నాడు.
ముస్లిముల్లోని పేదలందరికీ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి రిజర్వేషన్లు కల్పిస్తే, ఆయన కొడుకుగా ముఖ్యమంత్రి జగన్‌ మరో రెండు అడుగులు ముందుకు వేసి, పదవుల విషయంలోనూ, వారికి సంక్షేమం అందించే విషయంలోనూ ఏ రకంగా చూసుకున్నా.. రాష్ట్రంలో 2019 నుంచి ముస్లిముల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చారు.

సామాజిక న్యాయం ఇలా
మంత్రివర్గంః జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రిమండలిలో మొదటి విడతలో 56 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు స్ధానం కల్పిస్తే.. రెండో విడతలో ఏకంగా 70 శాతానికి తీసుకెళ్ళారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇస్తే, అందులో నలుగురు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చారు. 25 మంది మంత్రుల్లో 11 మంది ఈ రోజు బీసీలే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వంలో కేవలం మూడున్నర ఏళ్ళలో రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు బీసీలే.
కౌన్సిల్; శాసనమండలిని తీసుకుంటే పార్టీ తరపున 32 మంది ఎమ్మెల్సీలను చట్టసభలకు పంపితే.. అందులో 18 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే.ఈ రోజు శాసనసభ స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారామ్‌ బీసీ. శాసనమండలి చైర్మన్‌గా ఉన్న మోషెన్‌ రాజు ఒక ఎస్సీ. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ మైనార్టీ వర్గానికి చెందిన జకియాఖానం

స్ధానిక సంస్ధల పదవులుః
మొత్తంగా 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేసింది.అందులో ఒక్క బీసీలకు మాత్రనే 237 మండల ప్రెసిడెంట్‌ పదవులు. అంటే 38 శాతం. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే మండల ప్రెసిడెంట్లలో 67 శాతం పదవులు వీళ్లకే.
రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవుల్లో బీసీలకు 6 పదవులు అంటే 46 శాతం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 9 పదవులు అంటే 69 శాతం ఛైర్మన్‌ పదవులు. 14 నగర కార్పొరేషన్‌ మేయర్‌ పదవులలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేస్తే.. బీసీలకు ఏకంగా 9 పదవులు అంటే 64 శాతం బీసీలే ఉన్నారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కు గానూ 12 పోస్టులు అంటే 86 శాతం మేయర్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారంలో ఉన్నారు.
మొత్తం 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే అందులో 84 మున్సిపాల్టీలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేసింది. ఇందులో 44 మున్సిపల్‌ ఛైర్మన్లుగా బీసీలు 53 శాతం..
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 84 స్ధానాలను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెల్చుకుంటే.. అందులో 58 స్ధానాల్లో వీళ్లే, అంటే 69 శాతం రాజ్యాన్ని పాలిస్తున్నారు.
–196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్ల పదవుల నియామకం చేస్తే.. అందులో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 196లో 117 అంటే 60 శాతం పదవులు వీరికే ఇచ్చారు.

కార్పొరేషన్ల ఛైర్మన్లుః
వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవుల్లో 53 పదవులు (39శాతం) బీసీలకే. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 అంటే 58 శాతం పదవులు వీరికే రాజ్యాధికారం. 137 ప్రభుత్వ కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి… 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులుంటే అందులో 201 బీసీలకు 41 శాతం వీళ్ళకే. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484లో 280 అంటే 58 శాతం వీరికే.

జయహో బీసీ– వెనుకబడిన కులాలే వెన్నెముకః
బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు. వీటిలో మరో 684 డైరెక్టర్‌ పదవులు ఉంటే అవన్నీ బీసీలకే. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్‌ పదవులు తీసుకున్నా అందులో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే. చరిత్రలో ఏ ప్రభుత్వం ఇన్ని పదవులు బీసీలకు ఇవ్వలేదు. దాదాపుగా 7006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3503 సగభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. ఇందులో బీసీలు ఒక్కరే 2650 పదవుల్లో అంటే 38 శాతం ఉన్నారు. ఇది జయహో బీసీ అంటే. జయహో బీసీ ఈ ప్రభుత్వ నినాదం కాదు, విధానం. అలానే, జయహో ఎస్సీ.. ఇదీ జయహో ఎస్టీ.. జయహో మైనార్టీ అంటూ.. ఈ వర్గాలను రాజకీయంగా వెన్నుముక కులాలుగా మారుస్తున్నారు.
07.12–.2022: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో.. వెనుకబడిన కులాలే వెన్నెముక నినాదంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ మహాసభ విజయవంతమైంది. ఈ సభలో గ్రామస్థాయి నుంచి మంత్రులు, పార్లమెంటు వరకు.. ఆయా పదవుల్లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు దాదాపు 84 వేల మంది హాజరయ్యారు. జయహో బీసీ మహాసభకు ముఖ్యఅతిధిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ హాజరై బీసీల్లో మరింత చైతన్యం నింపారు.
ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో చెప్పినదానికి మించిః
2019 పిబ్రవరిలో ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన వాగ్దానాలకు మించి బీసీలకు న్యాయం చేయడం జరిగింది. డిక్లరేషన్‌ లో జగన్‌ మోహన్‌ రెడ్డి, అన్న మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లోని ప్రతి పథకం కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సాధికారత కోసమే. ప్రత్యేకించి ఈ వర్గాల అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ… ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇస్తే.. అందులోనూ 56 శాతం బీసీలకే మేలు జరిగింది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అక్కచెల్లెమ్మలను కలుపుకుంటే… 88 శాతం వీళ్లకే ఇళ్ల పట్టాలు. ఇళ్లు కట్టడం కూడా పూర్తయితే.. ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతిలో రూ.5 నుంచి 10 లక్షలు ఆస్తి వారి చేతిలో పెట్టినట్లవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే… అక్కచెల్లెమ్మల చేతిలో కనీసం రూ.2 నుంచి 3 లక్షల కోట్లు ఆస్తి వాళ్ల చేతుల్లో పెట్టినట్లవుతుంది.

సచివాలయాలు– ఉద్యోగాలుః
గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే, 89 శాతం ఇళ్లకు పూర్తి పారదర్శకంగా ప్రతి ఒక్క పథకం అందుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేదు. సచివాలయాల ద్వారా ఇంటి గడప వద్దే సేవలందిస్తున్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఇక వాలంటీర్‌. ప్రతి ఒక్కరిని చేయి పట్టుకుని నడిపిస్తున్న వ్యవస్థ వాలంటీర్‌ వ్యవస్థ. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇస్తే.. 84 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేస్తూ 25–06–2022న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రెండేళ్లు పూర్తిచేసుకుని పరీక్ష పాస్‌ అయిన అందరికీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ జీవో ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ, వార్డ్‌ సెక్రటరీలకు బేసిక్‌ పే రూ.23,120 – 74,770– ఇతర సచివాలయం ఉద్యోగులకు బేసిక్‌ పే రూ.22,460 – 72,810గా నిర్ణయించారు. ఉద్యోగాల విషయానికొస్తే.. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో 1.30 లక్షల ఉద్యోగులు సచివాలయాల్లో కొత్తగా కనిపిస్తున్నారు. మరో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో రెగ్యులరైజ్‌ అయిన వాళ్లు కనిపిస్తారు. మరోవైపు ఆరోగ్యరంగంలో 46 వేల పోస్టులు భర్తీ. అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌ ) ద్వారా మరో లక్ష మందికి ఎటువంటి దళారులు లేకుండా, లంచాలిచ్చే పరిస్థితి లేకుండా, ఎవరికీ కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మెరుగైన జీతాలు. కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న వారికి తొలిసారిగా మినిమమ్‌ టైం స్కేల్‌ తీసుకొచ్చింది కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే. ఇంకా ప్రతి గడపకూ సేవలందించేందుకు సచివాలయాల పరిధిలో 2.60 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే.
మొత్తంగా 6 లక్షలకుపై చిలుకు ఈ ప్రభుత్వంలో కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి.

ఆర్థిక సాధికారత– మూడున్నర లక్షల కోట్లు
– గత మూడున్నర సంవత్సరాల కాలంలో, అంటే జూన్‌ 2019 నుంచి నవంబరు 2022 వరకు డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ది పథకాల ద్వారా ఇంటింటికీ, మనిషి మనిషికీ అందించిన లబ్ధి అక్షరాలా రూ. 3,19,228 కోట్లు. ఇందులో మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలకు అందించింది అక్షరాలా రూ. 2,50,358 కోట్లు. అంటే దాదాపు 80 శాతం నగదు. బడుగు, బలహీన, పేద వర్గాల ఆర్థిక న్యాయం కోసం, వారి కాళ్ళపై వారిని నిలబెట్టేందుకే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు. నవరత్నాలలో ఏ పథకం తీసుకున్నా, వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ సున్నా వడ్డీ, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా, పొదుపు సంఘాలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, వైయస్సార్‌ జగనన్న ఇళ్ళపట్టాలు, ఇళ్ళ నిర్మాణం, వైయస్సార్‌ నేతన్న నేస్తం, వైయస్సార్‌ మత్య్సకార భరోసా, వైయస్సార్‌ వాహన మిత్ర, వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న గోరుముద్ద.. ఇలా ఏ స్కీమ్‌ తీసుకున్నా కూడా అంతా పేద, బడుగు, బలహీనవర్గాల కోసమే ఖర్చుచేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం పేరు కూడా గుర్తుకు రాదు. ఇప్పటికీ చంద్రబాబు ఎన్టీఆర్‌ పథకాలనే చెప్పుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాడు. రాష్ట్ర బడ్జెట్‌ ను చూస్తే.. గత చంద్రబాబు హయాంలోనూ దాదాపు ఇప్పుడు ఉన్నంతే ఉన్నప్పటికీ.. జగన్‌ మోహన్‌ రెడ్డి మూడున్నరేళ్ళలో ప్రజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పంచింది ఏకంగా సుమారుగా మూడున్నర లక్షల కోట్లు. మరి చంద్రబాబు హయాంలో ఈ డబ్బులన్నీ ఏమైపోయాయి, ఎవరు తిన్నారన్నదే ప్రశ్న.

2022లోనే 2024 టార్గెట్‌ 175
2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల టార్గెట్‌ ను 2022లోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఫిక్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టార్గెట్‌ 175 స్థానాలకు 175. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కోటలను కూడా బద్దలు కొట్టాలన్నదే జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ వ్యూహం. కుప్పంలో గతంలో వేరే పార్టీ గెలవలేదు. కానీ, జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. సర్పంచ్‌ పదవులు, మున్సిపాలిటీతో సహా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ వైఎస్‌ఆర్సీపీ గెలుచుకుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు తన సమీప వైఎస్‌ఆర్సీపీ ప్రత్యర్థిపై 30, 722 ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీపై వైఎస్‌ఆర్సీపీ 64, 851 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 30 ఏళ్ళ చంద్రబాబు ఏలుబడిలో, కుప్పం నుంచే 1989 నుంచి 2019 వరకు ఏడు సార్లు గెలిచి, కుప్పాన్ని మున్సిపాల్టీ కూడా చేసుకోలేక పోయిన ప్రతిపక్ష నేతకు బుద్ధి వచ్చేలా.. జగన్‌ మోహన్‌ రెడ్డి కుప్పాన్ని మున్సిపాల్టీగా అప్‌ గ్రేడ్‌ చేసి, రెవెన్యూడివిజన్‌గా మార్చి, మౌలిక వసతులు కల్పించారు.దీంతో మున్సిపాల్టీ ఎన్నికల్లో మొత్తం 24 వార్డుల్లో మెజార్టీ వార్డులు అంటే 18 వైఎస్‌ఆర్సీపీ గెలిస్తే.. కేవలం 6 వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్సీపీ ఘన విజయం సాధించింది.

2019 నుంచి విజయాల పరంపరః
2019 శాసనసభ ఎన్నికల్లోనే 50 శాతం ఓట్లతో 151 స్థానాలను (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాలు (88 శాతం) గెల్చుకున్న వైఎస్సార్‌ సీపీ ఆ విజయాల పరంపరను అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉంది. రాష్ట్రంలో 2021 మార్చి, నవంబరు నెలల్లో రెండు విడతలుగా 14 నగర పాలక సంస్థలు, 86 నగర పంచాయతీ, మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లోనూ అఖండ విజయాన్ని సాధించింది. 14 నగరపాలకసంస్థల్లోనూ విజయదుందుభి మోగించి, టీడీపీని అడ్రస్‌ లేకుండా చేసింది. 87 నగర పంచాయతీ, మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో 84 నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో విజయ ఢంకా మోగించింది. అంటే 98 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 13,092 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే…అందులో 10,536 స్థానాలను వైఎస్సార్‌ సీపీ మద్దతు దారులు విజయం సాధించారు. విశ్లేషిస్తే… 80.4 శాతం స్థానాలను తన ఖాతాలో పదిలపరుచుకుంది.

మరో ఆసక్తికర పరిణామాన్నీ గమనిస్తే…ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 89 పంచాయతీలకు 74 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే విజయబావుటాను ఎగరేశారు.. కుప్పం నియోజకవర్గంలోనే నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఇక్కడే 68 ఎంపీటీసీ స్థానాలకు 63 స్థానాలనూ వైఎస్సార్‌ సీపీ గెలుచుకుని, బాబు తప్పిదాలకు గుణపాఠం చెప్పింది. తద్వారా బాబు ఉనికిని కుప్పంలో ఆనవాలే లేకుండా చేశారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?. రాష్ట్రంలో 652 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక స్థానాలు (జెడ్పీటీసీ), 9717 మండల పరిషత్‌ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ) కు ఎన్నికలు నిర్వహిస్తే…642 జెడ్పీటీసీ స్థానాలు (98.48 శాతం) వైఎస్సార్‌సీపీ గెలుచుకుని, అఖండ విజయం సాధించింది.అంతే కాదు …13 జెడ్పీ ఛైర్మన్‌ పదవులనూ వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎంపీటీసీ కేటగిరీలో 9,717 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే… 8,380 స్థానాలను (86.24 శాతం) వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

ఈ క్రమంలోనే.. 96 శాతం మండల పరిషత్‌ అధ్యక్ష పదవులనూ వైఎస్సార్‌ సీపీ తన ఖాతాలో జమ చేసుకుంది.శాసనమండలిలో 58 స్థానాలు ఉంటే… వైఎస్‌ఆర్సీపీ మెజార్టీ స్థానాలను, అంటే 32 స్థానాలను సాధించి మండలిలోనూ విజయ బావుటా ఎగురవేసింది.2021లో తిరుపతి పార్లమెంటు స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఒక సామాన్యుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల ఆధిక్యతతో గెలిపించారు. 2021 అక్టోబరులో జరిగిన బద్వేలు ఉప ఎన్నికలో, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ రికార్డు స్థాయిలో 90,533 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 53.22 శాతం ఓటర్లు మద్దతిస్తే… మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో 2022 జూన్‌ 23న నిర్వహించిన ఉప ఎన్నికల్లో 74.47 శాతం ఓటర్లు మద్దతిచ్చారు. దాంతో ఆత్మకూరు నియోజకవర్గంలో 82,888 అత్యధిక మెజార్టీతో వైఎస్‌ఆర్సీపీ గెలుపొందింది.

నాలుగు రాజ్యసభ స్థానాలు బీసీలకేః
రెండేళ్ల కిందట నాలుగు ఖాళీలు ఏర్పడితే.. అందులో ఇద్దరు బీసీలకు… పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ అవకాశం కల్పించగా, 2022లో మరో ఇద్దరు బీసీలకు అవకాశమిచ్చారు.రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు స్థానాలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాజ్యసభకు పంపారు.2022 జూన్‌ 21తో పదవీ కాలం ముగిసిన వి. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. మరో స్థానానికి సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌ రెడ్డిని ఎంపిక చేశారు.

Leave a Reply