Suryaa.co.in

Telangana

ఎకరానికి 25 వేల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలి

– గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. రైతు కోసం గేట్లు తెరువు. – సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండి.
– ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నాడు
– రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదు. ధైర్యం చెప్పడం లేదు
-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
– సాగునీరు లేక పంటలు నష్టపోతున్న రైతుల కష్టాలు విన్న మాజీ మంత్రి హరీశ్ రావు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్లు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు హరీశ్ రావు తో ఆవేదన వ్యక్తం చేశారు.

నీళ్లు లేక ఎండిపోయిన పంటలను చూపి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడు నెలల్లో శివశంకర్ అనే రైతు 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నర్సింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేసినా నీళ్లు పడలేదని వివరించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా తో మాట్లాడుతూ:రైతుల బాధలను చూస్తుంటే గుండె కదిలిపోతోంది. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఒక్కోరైతు నాలుగైదు బోర్లు వేసి అప్పుల పాలయ్యారు.

గోదావరి నదిలో నీళ్లు ఉన్నప్పటీ ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసింది.ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. రైతులను, రైతు కూలీలను, కౌలు రైతులను మోసం చేసింది. ఎన్నికల ముందు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపింది.

డిసెంబర్ 9న 2 లక్షల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి వంద రోజులు దాటినా నెరవేర్చలేదు.రైతుబంధు కింద 15 వేలు ఇస్తామని మోసం చేసిండ్రు. గతంలో మేమిచ్చిన పది వేలు కూడా ఇవ్వడం లేదు.కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని మోసం చేసిండ్రు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువకు పుష్కలంగ నీళ్లు వచ్చినయి. రైతులు రెండు పంటలు పండించుకుని సంతోషంగా ఉండేవారు. బంగారు పంటలు పండేవి.కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు, కరెంటు లేదు. మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నయి. కేసీఆర్ రైతు బిడ్డ కనుక రైతుల కోసం తండ్లాడిండు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, కరెంటు, నీళ్లు ఇప్పించిండు. రైతుబంధు, రైతు బీమాతో రైతులకు ఆదుకున్నడు.

ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వడగండ్ల వానలో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది.అయినా ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏమాత్రం పట్టడం లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నాడు.

రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదు. ధైర్యం చెప్పడం లేదు.పొలాలను కాపాడి నీళ్లివ్వమంటే చీమ కుట్టినట్టయినా లేదు. కేసీఆర్ హయాంలో ఎక్కడా ఈ పరిస్థితి కనిపించలేదు. ఈ కాంగ్రెస్ హయాంలో ఊరికి వంద బోర్లు వేస్తున్నరు.

గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. రైతు కోసం గేట్లు తెరువు. సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండి.నీళ్లందించడం విఫలమైన ప్రభుత్వం రైతుకు వెంటనే ఎకరానికి 25 వేల నష్ట పరిహారం చెల్లించాలి.

దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మస్థైర్యం కోల్పోతారు. కాంగ్రెస్ హామీ ప్రకారం వచ్చని వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. బోనస్ ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్‌కు లేదు.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు వాళ్లు గుణపాఠం చెప్తారు. ప్రభుత్వం ఆదుకోకపోతే భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే రైతులతో చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తాం.

 

LEAVE A RESPONSE