పాకిస్థాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారులపై బలవంతపు మత మార్పిడులు, వివాహాల పేరిట జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఐరాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్థాన్లో హిందూ, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు అపహరణకు గురవుతున్నారు.
ఆ దేశంలో బలవంతపు మతమార్పిడులకు గురవుతున్న వారిలో అత్యధికం హిందూ, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందినవారేనని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు జెనీవాలోని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2025లో బలవంతపు మతమార్పిడి వివాహాలకు గురైన బాధితుల్లో 75 శాతం మంది హిందువులు ఉండగా, 25 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు.
మొత్తం నమోదైన కేసుల్లో 80 శాతం ఘటనలు ఒక్క సింధ్ ప్రావిన్స్లోనే జరిగాయి. ముఖ్యంగా 14 నుంచి 18 ఏళ్ల వయసున్న, అంతకంటే తక్కువ వయసున్న మైనర్ బాలికలే లక్ష్యంగా ఈ దారుణాలు జరుగుతున్నాయి.
వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ మైనారిటీ ప్రకారం, 2025లో 6,543 లింగ-ఆధారిత హింసా సంఘటనలు నమోదయ్యాయి. 2024లో 5,253గా ఉన్న ఈ సంఖ్య, కేవలం ఒక్క సంవత్సరంలోనే 25 శాతం భారీ పెరుగుదలను సూచిస్తూ, ఆందోళనకరంగా పెరిగింది.
ఆ నివేదిక ప్రకారం, ఒక్క 2024లోనే 24,000కు పైగా అపహరణలు నమోదయ్యాయి. అంటే సుమారుగా ప్రతిరోజూ 67 మంది మహిళలు అపహరణకు గురయ్యారు. దీనితో పాటు, 5,000కు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు ప్రతిరోజూ 19 కేసులు.
కాగా, “పరువు” పేరుతో 405 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పేదరికం, సామాజిక వెలివేత వంటి కారణాల వల్ల వీరు మరింత సులభంగా బలవుతున్నారని ఐరాస నిపుణులు పేర్కొన్నారు.
2023 లెక్కల ప్రకారం పాకిస్థాన్లో మొత్తం 24 కోట్ల జనాభా ఉంది. అందులో హిందువులు దాదాపు 39 లక్షలు ఉండగా క్రైస్తవులు 33 లక్షల వరకు ఉన్నారు. వీరు ప్రధానంగా సింధ్ ప్రావిన్స్లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
అయితే వీరి ప్రాణాలకు, మత విశ్వాసాలకు రక్షణ లేకుండా పోయింది. ముస్లిమేతర బాలికలను కిడ్నాప్ చేసి ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లిళ్లు చేయడం పాక్లో మైనారిటీలపై ఉన్న వ్యవస్థాగత వివక్షను స్పష్టంగా చూపిస్తోందని ఐరాస నిపుణులు తెలిపారు.
బాధితులు శారీరక, లైంగిక హింసను ఎదుర్కోవడమే కాకుండా, సామాజిక బహిష్కరణకు గురై తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మైనారిటీ హక్కుల బృందం నివేదికల ప్రకారం అక్కడి హిందువులు నిరంతరం మత ఛాందసవాదుల బెదిరింపుల నడుమ బతుకుతున్నారని, వారి ప్రార్థనా మందిరాలకు సైతం రక్షణ లేదని స్పష్టమవుతోంది. మైనారిటీలపై జరుగుతున్న ఈ అకృత్యాలను వెంటనే అరికట్టాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి నిపుణులు గట్టిగా కోరారు.
బలవంతపు మతమార్పిడిని ఒక ప్రత్యేక నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకురావాలని, దేశవ్యాప్తంగా అన్ని ప్రావిన్సుల్లో వివాహ కనీస వయసును 18 ఏళ్లకు పెంచాలని సూచించారు. మానవ అక్రమ రవాణా, లైంగిక హింసకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నేరాలకు శిక్షల రేటు అత్యంత దారుణంగా తక్కువగా ఉంది. అత్యాచార కేసులలో 2 శాతం కంటే తక్కువ, అపహరణ కేసులలో కేవలం 0.1 శాతం మాత్రమే ఉంది.
ఇది జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. “ఇవి బాధితుల బాధ ఎప్పటికీ గుర్తించబడదనే సంకేతాన్ని, నేరస్థులు ఎప్పటికీ జవాబుదారీగా ఉండరనే సంకేతాన్ని కూడా ఇవి ఇస్తున్నాయి” అని వీఓపీఎం తెలిపింది. ఈ సంక్షోభం, నమోదైన నేరాలకు మించి చాలా విస్తృతంగా ఉందని అది తెలిపింది. ఒక అంచనా ప్రకారం 90 శాతం మంది మహిళలు గృహ హింసను అనుభవిస్తుండగా, 85 నుండి 90 శాతం మంది కార్యాలయాల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారు.
ఈ గణాంకాలు చాలా మంది మహిళల జీవితాల్లో ప్రమాదం దాదాపు నిరంతరం ఎలా ఒక భాగంగా మారిపోయిందో స్పష్టం చేస్తున్నాయి. సింధ్, బలూచిస్తాన్ వంటి ప్రావిన్సులలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని భావిస్తున్నారు. అక్కడ భయం, సామాజిక ఒత్తిడి, శక్తివంతమైన స్థానిక వ్యక్తుల ప్రభావం వంటి పొరల కింద లెక్కలేనన్ని కేసులు పూడ్చిపెడుతున్నారు.
బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదులను లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టించుకోకపోవడం, విచారణలో జాప్యం చేయడం, బాధితుల వయసును నిర్ధారించడంలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడం వంటి చర్యలను ఐరాస తీవ్రంగా తప్పుబట్టింది.
మైనారిటీ బాలికలకు సురక్షిత ఆశ్రయాలు, ఉచిత న్యాయ సహాయం, మానసిక కౌన్సెలింగ్ వంటి సహాయక సేవలు అందించాలని పాకిస్థాన్కు దిశానిర్దేశం చేసింది. వివక్ష లేకుండా పౌరులందరికీ మత స్వేచ్ఛను కల్పించాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది.