– మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డల కోసం అదనంగా మరో 8 ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు నెలకొల్పనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. వీటి ద్వారా అదనంగా 80 పడకలు (వార్మర్స్) అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
ఒక్కో ఎస్ఎన్సియు ఏర్పాటుకు రూ.60 లక్షలు అవసరం కాగా, 8 ఎస్ఎన్సియులకు మొత్తం రూ.4.80 కోట్లు ఖర్చవుతుందన్నారు. అలాగే ఒక్కో ఎస్ఎన్సియుకు నెలకు రూ. 8.91 లక్షలు చొప్పున 8 ఎస్ఎన్సియుల నిర్వహణకు దాదాపు రూ.1.07 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
పిపిపి విధానంలో 8 ఎస్ఎన్సియులు
పబ్లిక్ ప్రైవేట్ పార్టర్న్షిప్(పిపిపి) విధానంలో ఈ 8 ఎస్ఎన్సియులు నడుస్తాయి. కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రి, చిత్తూరు జిల్లాలోని కుప్పం ఏరియా ఆసుపత్రి, అనంతపురం జిల్లా గుంతకల్ ఏరియా ఆసుపత్రి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీహెచ్సీల్లో ఈనెలాఖరులోగా సేవలు అందుబాటులోకొస్తాయి. ఏలూరు జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రి, నెల్లూరు జిల్లా కావలి ఏరియా ఆసుపత్రి, సత్యసాయి జిల్లా కదిరి ఏరియా ఆసుపత్రి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులలో కొత్త ఎస్ఎన్సియులు నవంబరులో అందుబాటులోకొస్తాయి.
రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే 62 ఎస్ఎన్సియులు పనిచేస్తున్నాయని, వీటిలో 28 ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 10 వార్మర్లు గల 11 ఎస్ఎన్సియులు, 5 వార్మర్లు గల 23 ఎస్ఎన్సియులలో అత్యవసర వైద్యాన్ని అవసరమైన శిశువులకు అందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా నవజాత శిశువులకు అధునాతన వైద్యం అందుతోందని పేర్కొన్నారు.
ఇప్పటికే 4 ఎస్ఎన్సియులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇప్పటికే అనకాపల్లి, ప్రత్తిపాడు, హిందూపురం, నంద్యాలలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్ని వైద్యారోగ్య శాఖ నెలకొల్పింది. అలాగే సత్తెనపల్లిలోని న్యూ బోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్ ను ఎస్ఎన్సియుగా అప్గ్రేడ్ చేశారు.
శిశువులకు ఉత్తమ సేవలు
పుట్టినప్పట్నించి 28 రోజుల వరకు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో సేవలందిస్తారు.
తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, పచ్చకామెర్లు(నియోనేటల్ జాండిస్) వచ్చిన శిశువులు, హైపో థెర్మియా, ఎఆర్డియస్(శ్వాశ కోస సంబంధిత సమస్యలు), సెప్సిస్ వంటి సమస్యలు గల నవజాత శిశువులకు ఇక్కడ చికిత్స అందిస్తారు.