– మంత్రి లోకేష్ చొరవతో ఇంటికి చేరిన చందు!
-కాంబోడియా నుంచి క్షేమంగా రాక
– మంత్రికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
మంగళగిరి: ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి పెనుమాక గ్రామానికి చెందిన వేమవరపు చందు… రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విముక్తి అయ్యాడు. చందు ఇంటర్ వరకూ చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలో క్యాటరింగ్ నిర్వహించుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. గత కొన్ని నెలల క్రితం వింజనంపాడులో జరిగిన తన సోదరి వివాహ కార్యక్రమంలో పర్చూరుకు చెందిన మోజెస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతని మాటలు నమ్మిన చందు ఈ ఏడాది జూన్ 24వ తేదీన ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు.
సైబర్ క్రైమ్స్ చేయాలంటూ మోజెస్, అతని ముఠా సభ్యులు చందును వేధించారు. చందు అంగీకరించకపోవడంతో చీకటి గదిలో బంధించి తిండి కూడా సరిగా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేశారు. దీనికి తోడు అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల యువకుడు చందుకు గొంతు నుంచి గుండె వరకూ ఇన్ఫెక్షన్ అయింది. ఎలాగైనా సైబర్ ముఠా చెర నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉన్న చందు హలో డాట్ నారా లోకేష్ కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాడు. స్పందించిన మంత్రి లోకేష్ యువకుడు చందును క్షేమంగా స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంత్రి లోకేష్ ఆదేశాలతో కాంబోడియా ఎంబసీ అధికారులతో మాట్లాడిన వారు యువకుడు చందును ఈనెల ఒకటో తేదీన క్షేమంగా స్వస్థలానికి చేరేలా చర్యలు తీసుకున్నారు. కాగా, తనను సైబర్ నేరగాళ్ల చెర నుంచి ప్రాణాలతో కాపాడిన మంత్రి నారా లోకేష్ కు యువకుడు చందు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.