– గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా?
– పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో కొండవీటి వాగు వరద నీరు నిలిచిపోయింది
– కారణాలు తెలియకుండా వైసీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరు
– మంత్రి నారాయణ హెచ్చరిక
అమరావతి: రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోన్న వైసీపీ నాయకులపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ఏడుపులు ఇకనైనా ఆపాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. అమరావతిలో కొండవీటి వాగు నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు.
అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్థసారథితో కలిసి ఆయా ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. విజయవాడ పశ్చిమ బైపాస్ పై ఈ – 11 రోడ్డు వద్ద కొండవీటి వాగుపై నేషనల్ హైవేస్ అధికారులు ఓ వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో అక్కడ మట్టిని అలాగే వదిలేయడంతో అక్కడే కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీంతో వంతెన దిగువ నుంచి నీరు వెళ్లే మార్టం లేక నీరుకొండ పరిసర ప్రాంతాల్లో పొలాల్లో వరద నీరు నిలిచిపోయింది.
వాస్తవపరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి నారాయణ అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రొక్లెయిన్ లు ఏర్పాటు చేసి మట్టి తొలగించడంతో పాటు జాతీయ రహదారి పై కూడా స్వల్పంగా గండి కొట్టి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఆ తర్వాత అక్కడికొచ్చిన మీడియాతో మంత్రి నారాయణ మాట్తడుతూ వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు.
అమరావతిపై ఇకనైనా మీ ఏడుపులు ఆపాలంటూ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ప్రజలు మీకివ్వరన్నారు. ఎక్కడైనా నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా? గుంతల్లోకి నీరు వస్తె ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా? అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. అమరావతిపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు సహించరని అన్నారు.
పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందన్న మంత్రి… అది కూడా కేవలం రెండు గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందన్నారు. మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే నీరు బయటికి వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిని వేగంగా తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి. ఎవరెన్ని అనుకున్నా అమరావతి పనులు జరిగిపోతూనే ఉంటాయన్నారు. వచ్చే మార్చి నాటికి అధికారులు,ఉద్యోగుల క్వార్టర్లు కూడా సిద్దం చేస్తున్నామన్నారు. రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేస్తున్న వారు అమరావతికి వచ్చి పరిస్థితి చూడాలని మంత్రి సూచించారు.