– మిగతా 3 డీఏల పరిస్థితి ఏంటి?
– పీఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తారు?
– పీఆర్సీ కమిషన్ వేసేలోపు తక్షణం 30 శాతం ఐఆర్ ప్రకటించాలి
– ఉద్యోగుల బకాయిలు రూ.34 వేల కోట్లు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి
– నెల్లూరు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు: ఒకపక్క ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకుంటోందని, మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డీఏ కూడా మోసమేనని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.
నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒక్కటి రిలీజ్ చేస్తామని చెప్పా రని అన్నారు. ఆ అరియర్స్ని కూడా రిటైర్మంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీ కమిషన్, ఐఆర్, రూ. 34 వేల కోట్ల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని ధ్వజమెత్తారు.
వారికి హక్కుగా దక్కాల్సినవే ఇవ్వకుండా ఒక డీఏ రిలీజ్ చేసి వారికి బిక్షం వేస్తున్నట్టు మట్లాడుతున్నారు. రెండు రోజుల క్రితం దీపావళికి ముందు నేరుగా సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడంతో ఈసారి ఉద్యోగుల హామీలన్నీ నెరవేరుస్తారని అనుకున్నారు. నాలుగు డీఏలు ఇవ్వడంతోపాటు పీఆర్సీ కమిషన్ వేస్తారు, పెండింగ్ అరియర్స్ రిలీజ్ చేస్తారని, 30 శాతం ఐఆర్ ఇస్తారని ఉద్యోగులంతా భావించారు.
2024 లో జనవరి, జూన్ తోపాటు 2025 జనవరి జూన్ నెలల డీఏలు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన డీఏలను కూడా జగన్ ఖాతాలో వేసి తప్పించుకోవాలని చూడటం హేయం.
డీఏ అరియర్స్ ని కూడా రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామనడం దారుణం. చంద్రబాబు తప్ప దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చెప్పడం చూడలేదు. పైగా ఈ అమౌంట్ను పీఎఫ్ అకౌంట్ లో కూడా జమ చేస్తామని చెప్పకపోవడం దుర్మార్గం. ఇప్పుడు ఎంత బకాయి ఉందో ఆ మొత్తమే వడ్డీ కూడా లేకుండా 30 ఏళ్ల తర్వాత ఇస్తామని చెప్పడం ఉద్యోగులను దారుణంగా వంచించడమే. రిటైర్ అయిన ఉద్యోగుల డీఏల గురించి ఏమీ ప్రస్తావించడం లేదు.
పీఆర్సీ కమిషన్ కాల పరిమితి ముగిసి ఇప్పటికే రెండేళ్ళ మూడు నెలలు గడిచిపోయింది. అయినా కొత్త పీఆర్సీ వేయలేదు. ఈరోజుకీ పీఆర్సీ కమిషన్ వేయడానికి కూడా చంద్రబాబుకి మనసు రావడం లేదు. ఈరోజు పీఆర్సీ కమిషన్ వేసినా దాని నివేదిక వచ్చి అమలు చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కర్నాటక, తమిళనాడుతో పోల్చి చూపించి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి, ఉద్యోగుల జీతాలు తగ్గించుకోవాలని చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఏం, మంత్రులు చేస్తున్న దుబారాను తగ్గిస్తే, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీకు అనవసరంగా జీతాలిస్తున్నామని సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి అనడం సరికాదు. పోలీసులకు 4 సరెండర్ లీవ్లకు గానూ ఒక్కదానికే అనుమతి ఇస్తూ, రెండు నెలల తర్వాత రూ.105 కోట్లు విడుదల చేస్తాను అని చెప్పడం దారుణం.