ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మహిళ షాక్

– ఈనాడు, జ్యోతి చదువుతున్నారా అని వంశీ వ్యంగ్యం
– వాటివల్లేగా మీరు గెలించిందంటూ మహిళ కౌంటర్
– బిత్తరపోయిన ఎమ్మెల్యే వంశీ
– వాలంటీరు తీసిన ఫొటోలను డిలీట్ చేయించిన ఎమ్మెల్యే
– గడపగడపకూలో ఇదో ఓ విచిత్ర సన్నివేశం

తనను నిలదీసిన మహిళలనుద్దేశించి.. గన్నవరం వైసీపీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ వేసిన వ్యంగ్యాస్త్రాలు, చివరాఖరకు ఆయనకే బెడిసికొట్టాయి. సమస్యలు ప్రస్తావించిన మహిళలను, ‘ మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి చదువుతున్నారా? ’ అని ప్రశ్నించిన ఎమ్మెల్యేకు… వాటి వల్లనే కదా గత ఎన్నికల్లో మీరు గెలించింది? అంటూ కౌంటర్ ఇవ్వడంతో పాపం వంశీ బిత్తరపోవాల్సి వచ్చింది.

రామవరప్పాడు : ‘నువ్వు ఆ రెండు పత్రికలు బాగా చదువుతున్నట్లున్నావు..’ అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా..‘వాటివల్లేగా మీరు పైకొచ్చింది’ అంటూ ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు.
ఈ ఉదంతం విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో జరిగింది.

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం ఇంటింటికీ తిరిగారు. సీహెచ్‌.భవాని అనే మహిళ వచ్చి ‘గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. మీ జగన్‌ను అడిగి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకురండి’.. అని సూచించారు.

దీనికి స్పందించిన వంశీ ‘చూడండి అక్కా.. మీరు ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలను బాగా చూస్తున్నట్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. దానికి ఆ మహిళ ‘మీరు పెద్దవాళ్లు అయ్యింది ఆ పత్రికల వల్లనేగా’ అంటూ ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో తమాయించుకున్న వంశీ మాట్లాడుతూ.. ‘ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోవడంతో చాలా కంపెనీలు వెళ్లిపోయాయి’ అని వివరించారు.

దీనికి ఆమె ‘ఇంకా హైదరాబాద్‌నే అభివృద్ధి చేయాలని చూస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల గురించి ఎమ్మెల్యే వంశీ మహిళలతో మాట్లాడుతుండగా వాలంటీరు ఫొటోలు తీశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా.. వ్యక్తిగత సిబ్బంది ఆ ఫొటోలను డిలీట్‌ చేయించారు.

Leave a Reply