– స్వచ్చందంగా బంద్ పాటించిన వ్యాపారులు
– పెరిగిన టూరిజంతో ఆదాయ వృద్ధే కారణం
– మళ్లీ హింస పెరిగితే వ్యాపారాలు బందవుతాయన్న భయం
– ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
– మారిన కాశ్మీరం
అవును.. కాశ్మీరం మారుతోంది. ఒకప్పుడు పోలీసులు, భద్రతాదళాలపై రాళ్లు వేసేందుకు కిరాయి తీసుకున్న వాళ్లు.. ఇప్పుడు నిక్షేపంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. శాంతి కోరుకుంటున్నారు. దానిలో ఉన్న ఆనందం-ఆదాయాన్ని గ్రహించారు. పెరిగిన పర్యాటకులతో పాటే పెరుగుతున్న తమ ఆదాయం చూసి మురిసిపోతున్నారు. మళ్లీ హింస పెరిగితే ఆదాయం పోయి, మరోసారి రోడ్డెక్కి పోలీసుల చేత తన్నులు తినాల్సి ఉంటుందన్న ఊహనే.. వారిని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినదించేందుకు కారణమవుతోంది. కాశ్మీర్లో జరిగిన తాజా హత్యాకాండను నిరసిస్తూ తమ దుకాణాలు బంద్ చేసి, ఉగ్రవాదుల చర్యను నిరసించారు.
ఏ ఉద్దేశ్యంతో ఉగ్రవాదులు దాడులు చేశారో తెలియదు కానీ.. కాశ్మీరీల నుంచే ఈ దారుణ మారణ కాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాశ్మీరీలు ఒక్కటి అయ్యారు. స్వచ్చందంగా వారంతా బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులు, ఇతర వర్గాలతో పాటు స్థానిక ప్రజలు అంతా ఉగ్ర దాడిని ఖండిస్తూ రోడ్ల పైకి రావడం మారిన కాశ్మీర్ దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.
భారత్ లో కాశ్మీర్ అంతర్భాగం అంటూ ఆరేళ్ళ క్రితం 370 అధికరణను తొలగించారు. స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి దేశంతో కాశ్మీర్ ని పూర్తిగా కలిపారు. దీని మీద మొదట ఎలాంటి భిన్న వాదనలు ఉన్నా, గడచిన ఆరేళ్ళ కాలంలో కాశ్మీరులో సామాజిక ఆర్ధిక జీవనం మెరుగు పడింది.
దేశం నలుమూలల నుంచి కాశ్మీర్ కి పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతే కాదు వ్యాపారాలు విస్తరించాయి ఒక విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయింది. యాక్టివిటీ బాగా పెరిగింది. దాంతో స్థానికంగా ఉన్న అత్యధిక శాతం ప్రజలకు ఇదంతా బాగానే ఉంది.
ఈ నేపథ్యంలో ఉగ్ర దాడి జరగడంతో స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలకు లోను అవుతున్నారు. దీని వల్ల బయట సమాజం ప్రజలు కాశ్మీర్ కి రారని, నమ్మరని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఏటికి ఆ ఏడు కాశ్మీర్ కి వెళ్ళే పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతోంది. గత ఏడాది చూస్తే కనుక మూడు కోట్ల మందికి పైగా టూరిస్టులు కాశ్మీర్ ని సందర్శించారు అన్న లెక్కలు ఉన్నాయి.
ఇంత ఆదాయం వ్యాపారం బాగా పెరిగిన నేపథ్యంలో.. మళ్ళీ పాత కాశ్మీర్ ని చూపించాలనుకున్న ఉగ్ర మూకలు చేసిన ఈ వికృత చేష్టలు వల్ల, సగటు కాశ్మీరీలు మండిపడుతున్నారు. దాంతో వారే పాకిస్థాన్ మురదాబాద్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్ల మీదకు రావడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని నిత్యం డిమాండ్ చేసే వారు, వివిధ వర్గాలు అంతా కూడా ఈ ఉగ్ర దాడిని ఖండించడం జరిగింది. అంతే కాదు వారంతా కూడా బంద్ కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. ఇది మారిన కాశ్మీర్ రాజకీయ ముఖ చిత్రాన్ని స్పష్టం చేస్తోంది.
ఆరేళ్ళుగా కాశ్మీర్ లో జరిగిన అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కి ఇది ఒక అచ్చమైన నిదర్శనం అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కాశ్మీర్ సోదరులకు సాయం చేస్తామని ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ప్రకటించడం ఆ వెంటనే ఉగ్ర దాడులు జరగడంతో కాశ్మీరీలు అంతా పాక్ మీద విరుచుకుపడుతున్నారు.
భారత్ నుంచి కాశ్మీర్ ని వేరు చేయాలని చూసిన పాక్ కానీ లేదా తెర వెనక శక్తులకు కానీ ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కాశ్మీర్ లో స్థానిక ఉగ్ర వాదులు బాగా తగ్గిపోయారు. ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులే ఉన్నారని అంటున్నారు. అయితే వారికి కొంతమంది నుంచి ఎంతో కొంత సాయం లభిస్తోంది అన్నది ఉన్నప్పటికీ మునుపటిలా కాశ్మీర్ లో భయోత్పాతం క్రియేట్ చేసి అక్కడ ప్రజలను తమ వైపునకు తిప్పుకునే సన్నివేశం అయితే ఇపుడు లేదనే అంటున్నారు. కాశ్మీర్ నుంచే పాక్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్లు రావడం కూడా ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. మొత్తంగా మారిన కాశ్మీరాన్ని దేశం దర్శించింది.