• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
• ఆన్ లైన్ ఉచిత డీస్సీ కోచింగ్ ప్రారంభించిన మంత్రి
• ఆచార్య యాప్ తో అభ్యర్థులకు కోచింగ్
• 24 గంటలూ యాప్ ఓపెన్ చేయొచ్చు…
• యాప్ లో మెటీరియళ్లు, నిష్ణాతుల బోధనలు, పాత డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు లభ్యం : మంత్రి సవిత
అమరావతి : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులందరికీ ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందివ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఆచార్య యాప్ రూపొందించామని, ఈ యాప్ ద్వారా 24 గంటల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆన్ లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చుతూ, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై మొదట సంతకం చేశారన్నారు. డీఎస్సీ ద్వారా అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు బీసీ అభ్యర్థులే సాధించాలన్నది లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభించామన్నారు.
26 జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు నిర్వహించామన్నారు. ఈ కేంద్రాల ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేశామన్నారు. ఈ శిక్షణా కాలంలో నెలకు రూ.1500ల స్టయిఫండ్ తో పాటు మరో రూ.1000ల పుస్తకాల కొనుగోలుకు అందజేశామన్నారు.
ఆన్ లైన్ కోచింగ్ కు అందరూ అర్హులే…
ఆఫ్ లైన్ లో కోచింగ్ కు పొందలేని గృహిణులు, సుదూర ప్రాంతవాసులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారితో ఆర్థికంగా ఉన్న వెనుకబడిన వారికి లబ్ధి కలిగే ఆన్ లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. దరఖాస్తు చేసుకున్న బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ ఉచిత కోచింగ్ అందజేస్తామన్నారు. ప్రస్తుతం 3,189 మంది దరఖాస్తులొచ్చాయన్నారు. ఇంకెంతమందైనా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ ఉచిత కోచింగ్ అందజేస్తామన్నారు.
ఆచార్య యాప్ ద్వారా కోచింగ్
కాకినాడకు చెందిన శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఆన్ లైన్ డీస్సీ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఆచార్య పేరుతో యాప్ రూపొందించారన్నారు. ఈ 24 గంటలూ పనిచేయడంతో పాటు అభ్యర్థులు రోజులు ఎన్ని పర్యాయాలైనా యాప్ ను ఓపెన్ చేసేలా రూపొందించామన్నారు. ఈ యాప్ లో నిష్ణాతులైన అధ్యాపకుల బోధనలు, అన్ని సబ్జెక్టులకు చెందిన మెటీరియళ్లు, పాత డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉంటాయన్నారు.
యాప్ చార్ట్ బాక్స్ రూపొందించామని, ఆ బాక్స్ లో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు తెలిపితే తక్షణమే సిబ్బంది స్పందించిన సమాధానాలు తెలుపుతారన్నారు. టెక్నికల్ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రతి జిల్లాకు ఇద్దరిని నియమించామన్నారు. ఆ ఇద్దరితో వాట్సాప్ గ్రూప్ రూపొందించామని, టెక్నికల్ సమస్యలు ఆ గ్రూప్ లో చెబితే, వారు పరిష్కరిస్తారని మంత్రి సవిత వెల్లడించారు.
ఆఫ్ లైన్ శిక్షణ పొందిన వారికీ ఆన్ లైన్ శిక్షణ
ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ కు ఆఫ్ లైన్ ద్వారా శిక్షణ పొందిన డీఎస్సీ అభ్యర్థులే అర్హులేనని మంత్రి సవిత వెల్లడించారు. మెగా డీఎస్సీ పోస్టుల భర్తీలో అత్యధిక మంది బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించడమే లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్సీ అభ్యర్థులతో మంత్రి సవిత తమ సెల్ ఫోన్లలో శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఆచార్య యాప్ ను డౌన్ లోడ్ చేయించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, జేడీ తునాజరాణి, శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.