Suryaa.co.in

Andhra Pradesh

టెండర్ల ముసుగులో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్

• తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన రూ.1250కోట్లను జగన్, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ధారాధత్తం చేశాడు
• డైరెక్టర్ మైన్స్ & జియాలజీ వెంకటరెడ్డి, డైరెక్టర్ జనరల్ GST ఇంటిలిజెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ఇండియా) వారికి రాసిన లేఖతో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థల మధ్య ఉన్న దోపీడీ బంధం బయటపడింది
• జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టకముందు ఏపీఎండీసీ సెప్టెంబర్ 2019 నుంచి మే 2021 వరకు 20నెలలు ఇసుక అమ్మకాలు సాగించి రూ.1900కోట్ల విలువైన ఇసుక అమ్మినట్టు GST ఇంటిలిజెన్స్ వారికి తెలియచేశారు
• 4 నెలలు లాక్ డౌన్ సమయం పోతే కేవలం 16నెలల్లోనే ఏపీఎండీసీ రూ.1900కోట్ల విలువైన ఇసుక అమ్మగలిగింది. అంటే నెలకు రూ.115కోట్లు
• ఆ ప్రకారం 2021లో 2 సంవత్సరాల కాలానికి ప్రభుత్వం ప్రకటించిన ఇసుక తవ్వకాల టెండర్ కు నెలకు రూ.115 కోట్ల చొప్పున 24 నెలల కాలానికి రూ.2,764కోట్ల బేస్ ప్రైస్ గా టెండర్ ధర నిర్ణయించాలి
• ఆ మొత్తం బేస్ ప్రైస్ కాదని, రూ.1250కోట్ల భారీ డిస్కౌంట్ తో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు, రూ.1528కోట్లకు ఇసుక టెండర్ కట్టబెట్టడం జగన్ రెడ్డి దోపీడీ కోసమేనని తేలిపోయింది
• డైరెక్టర్ జనరల్ GST కి వెంకటరెడ్డి రాసిన అదే లేఖలో సెప్టెంబర్ 2023 నాటికి జేపీ పవర్ వెంచర్స్ తాను కట్టాల్సిన సొమ్ములో కేవలం రూ.1059 కోట్లు మాత్రమే చెల్లించి ఇంకా సుమారు రూ.500 కోట్లు బాకీ ఉన్నట్టు తెలిపారు
• జేపీకి దోచిపెట్టిన రూ.1250కోట్లు.. కాలపరిమితి ముగిసినా సదరు సంస్థ ప్రభుత్వానికి బకాయిపెట్టిన రూ.500 కోట్లు రాష్ట్ర ఖజానాకు జగన్ రెడ్డి కడతాడా.. పెద్దిరెడ్డి కడతాడా.. లేక వెంకటరెడ్డి కడతాడో జవాబు చెప్పాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

5 ఏళ్లుగా ఇసుకాసురుడు అడ్డగోలుగా సాగించిన ఇసుకదోపిడీ గురించి ప్రజలకు తెలిసిందేనని, జగన్ రెడ్డి సాగించిన రూ.50వేలకోట్ల ఇసుకదోపీడీ గురించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు అనేక వాస్తవాలు తెలియచేశారని, మే 2021 నుంచి బూటకపు టెండర్ల ద్వారా బినామీ కంపెనీలను తెరపైకి తెచ్చిన జగన్ రెడ్డి రెండున్నరేళ్లపాటు 2023 నవంబర్ వరకు యథేచ్ఛగా ఇసుకను స్వాహాచేశాడని, తర్వాత కొత్త టెండర్ల పేరుతో మరో రెండు కంపెనీలను ముందుకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఏకంగా తన సోదరుడు అనిల్ రెడ్డికి రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను అప్పగించి, తన దోపిడీని మరింత విస్తృతం చేశాడని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వివరించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. “ జగన్ రెడ్డి కొత్త ఇసుకపాలసీ పేరుతో 2021లో టెండర్లు పిలిచినప్పుడే టీడీపీ వాటిలోని లొసుగుల్ని బయటపెట్టింది. ముందుగా తాను అనుకున్న విధంగా ఒక కంపెనీని తెరపైకి తెచ్చిన జగన్ రెడ్డి, అడ్డగోలుగా ఇసుకదోపిడీకి పాల్పడు తున్నాడని, రూ.1528కోట్ల నామమాత్రపు చెల్లింపులకు అనుభవం లేని కంపె నీకి టెండర్లు ఎలా కట్టబెడతారని ఆనాడు టీడీపీ ప్రజలపక్షాన వైసీపీప్రభుత్వా న్ని నిలదీసింది. ఆనాడు తాము లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ త్రివేదీ మాట్లాడుతూ… పారదర్శకంగా టెండర్లు పిలిచామని, రెండున్నరేళ్లపాటు ఆ కంపెనీకి ఏమీ మిగలదని, ఇసుకతవ్వకాలు నిర్వహించే కంపెనీకి మిగిలేది కేవలం రూ.72కోట్లే నని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ఏటా కేవలం 2కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు మాత్రమే జరుగుతాయని, తద్వారా సంవత్సరానికి రూ.950కోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతుందని, ఆ మొత్తంలో రూ.765కోట్లు జయప్రకాశ్ పవర్ వెంచ ర్స్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాలి.. మిగతా సొమ్ములో నిర్వహణ ఖర్చులు తీసేయగా ఆ సంస్థకు మిగిలేది ఏడాదికి రూ36కోట్లు మాత్రమేనని, రెండు సంవత్సరాలకు మిగిలేది కేవలం రూ.72కోట్లమేనని ఆనాడు గోపాలకృష్ణ ద్వివేదీ కాకిలెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి కూడా అదే పాట పాడుతూ ఏడాదికి ఇసుక అమ్మకాలు కేవలం రూ.950కోట్లు మాత్రమేనని, జేపీ (జయప్రకాశ్ పవర్ వెంచర్స్) సంస్థ ప్రభుత్వానికి కట్టాల్సింది కట్టగామిగిలేది నామమాత్రమేనని, దానిలో వేలకోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ వితండవాదం చేశారు. ఆనాడు వారు చెప్పింది.. వాస్తవంలో జరిగింది ఏమిటో ఇప్పుడు చూద్దాం.

డైరెక్టర్ ఆఫ్ మైన్స్ & జియాలజీ వెంకటరెడ్డి, డైరెక్టర్ జనరల్ GST ఇంటిలిజెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) వారికి రాసిన లేఖతో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు దోచిపెట్టిన రూ.1250 కోట్ల బాగోతం బట్టబయలైంది
డైరెక్టర్ ఆఫ్ మైన్స్ & జియాలజీ వీ.జీ.వెంకటరెడ్డి స్వయంగా డైరెక్టర్ జనరల్ GST ఇంటిలిజెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) వారికి 11-09-2023న రాసిన లేఖలోని అంశాలను పరిశీలిద్దాం. GST ఇంటిలిజెన్స్ వారు ఆగస్ట్ 31-2023న డైరెక్టర్ మైన్స్ & జియాలజీ వారికి ఇసుక అమ్మకాలకు సంబంధించి సమాచారం కోరుతూ సమన్లు జారీచేశారు. ఆ సమన్లు అందుకున్నాక డైరెక్టర్ మైన్స్ & జియాలజీ విభాగం అడిషనల్ డైరెక్టర్ బాలచంద్రశేఖర్, జనరల్ మేనేజర్ (అకౌంట్స్) నాగేశ్వరరావులు GST ఇంటిలిజెన్స్ ముందు విచారణకు హాజరయ్యా రు. ఆనాడు సదరు అధికారులిద్దరూ GST ఇంటిలిజెన్స్ విభాగం అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లునమిలారు.

తర్వాత సదరు విభాగం అడిగి న ఆ ప్రశ్నలకు వీ.జీ.వెంకటరెడ్డి 11-09-2023న లేఖద్వారా సమాధానమిచ్చా రు. ఆ లేఖలో GST ఇంటిలిజెన్స్ వారు అడిగిన ప్రశ్నలు..వాటికి వెంకటరెడ్డి చెప్పిన సమాధానాలున్నాయి. అవన్నీ పరిశీలిస్తే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు ఇసుక టెండర్ ఖరారుచేసిన రోజునే జగన్ ప్రభుత్వం ఏవిధంగా ఆసంస్థకు రూ.1250 కోట్ల నజరానా ప్రకటించిందనే వాస్తవం బయటపడింది.

సెప్టెంబర్ 2019 నుంచి జూలై 2023 వరకు రాష్ట్రంలో జరిగిన ఇసుక విక్రయం వివరాలు తమకు తెలియచేయాలన్న GST ఇంటిలిజెన్స్ విభాగం ప్రశ్నకు వెంకట రెడ్డి సమాధానమిస్తూ.. సెప్టెంబర్ – 2019 నుంచి మే :15, 2021 వరకు అంటే 20 నెలల 15రోజుల పాటు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేముందు ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) దాదాపు 20నెలలపాటు ఇసుక అమ్మకాలు సాగించిందని, దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.2,610 కోట్ల విలువైన ఇసుకఅమ్మకాలు జరిపినట్టు చెప్పారు.

రూ.2,610 కోట్లలో డోర్ డెలివరీ ఛార్జీలనిమిత్తం రూ.710,09,74,485 లు వసూలు చేశారని చెప్పారు. ఆ డోర్ డెలివరీ ఛార్జీలను మినహాయిస్తే నికరంగా ఇసుక అమ్మకాలు రూ.1900.49 కోట్లుగా (పంతొమ్మిది వందల కోట్ల నలభై తొమ్మిది లక్షలరూపాయలు) తేల్చారు. ఆ మొత్తానికి ఇసుక అమ్మినట్టు వెంకటరెడ్డి GST ఇంటిలిజెన్స్ వారికి రాసిన లేఖలో చెప్పారు. ఆయన చెప్పిన 20నెలల కాలంలో 2020లో మార్చి నుంచి జూన్ నెలవరకు కరోనా కారణంగా దాదాపు 4 నెలలు లాక్ డౌన్ విధించడమైంది.

ఆ 20నెలల 15రోజుల్లో 4 నెలలుపోతే, మిగిలింది 16నెలల 15రోజులు. ఆ కాలంలోనే రూ.1900.49 కోట్ల విలువైన ఇసుక అమ్మినట్టు ప్రజలు భావించాలి. అంటే ఏపీఎండీసీవారు, తాము ఇసుక అమ్మకాలు జరిపిన కాలంలో నెలకు సుమారు రూ.115.18 కోట్ల విలువైన ఇసుకఅమ్మకాలు జరిగినట్టు వెంకటరెడ్డి GST వారికి తెలియచేసినట్టు అయ్యింది.

రూ.1528 కోట్లకే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు టెండర్ ఫైనలైజ్ చేయడం ఇసుకాసురుడు జగన్ రెడ్డి తన ఇసుక దోపిడీకోసం చేసిన పనికాదా?
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారికి ఇసుక తవ్వకాలు కట్టబెట్టకముందు నెలకు సుమారు రూ.115కోట్ల18లక్షల విలువైన ఇసుకను ఏపీఎండీసీ అమ్మడం జరిగింది. ఆ తర్వాత 2021లో 2 సంవత్సరాలకు ఇసుక తవ్వకాలకు సంబంధిం చి టెండర్లు పిలిచినప్పుడు రాష్ట్రప్రభుత్వం, ఏపీఎండీసీ ఒక నెలలో జరిపిన రూ.115.18 కోట్ల విలువైన ఇసుక అమ్మకాలను ప్రాతిపదికగా తీసుకొని 2 ఏళ్ల కు రూ.2,764 కోట్లను బేస్ ప్రైస్ గా తీసుకొని టెండర్లు పిలవాలి. టెండర్లలో పాల్గొనే ఏ కంపెనీ అయినా ఆ మొత్తం కంటే అధిక ధరకు పాడుకోవాలి.

కానీ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు రూ.1528కోట్లకే టెండర్ ఖరారు చేసి, దాదాపు రూ.1250కోట్ల (2764-1528) భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఒకపక్క ఇంత భారీ డిస్కౌంట్ ను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు అందించి, రూ.1528కోట్లను ప్రీమియం అమౌంట్ గా ప్రభుత్వం పేర్కొనడం అనేది అత్యంత విడ్డూరం. కేవలం జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ను అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి అడ్డగోలుగా ఇసుక దోపిడీ సాగించడానికే ఆ సంస్థకు రూ.1250కోట్ల భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఈ విషయం స్వయంగా వెంకటరెడ్డి GST ఇంటిలిజెన్స్ వారికి రాసిన లేఖలోని గణాం కాల ద్వారా తేటతెల్లమైంది.

రూ.1528 కోట్లకు టెండర్ కట్టబెడితే, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది రూ.1059 కోట్లే. చివరకు సుమారు రూ.500 కోట్లు ప్రభుత్వానికి బాకీ పెట్టింది.

జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ప్రభుత్వం సమర్పించిన రూ.1250కోట్ల భారీ డిస్కౌంట్ అందుకొని మరీ తాము చెల్లించాల్సిన రూ1528కోట్లు కూడా సక్రమంగా చెల్లించలేదు. ఈ విషయం కూడా వెంకటరెడ్డి రాసిన లేఖలోనే ఉంది. రూ.1528 కోట్లకు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు ఇసుక తవ్వకాల టెండర్ కట్టబెడితే, ఆసంస్థ ప్రభుత్వానికి చెల్లించింది కేవలం రూ.1059కోట్లని వెంకటరెడ్డే చెప్పారు. మే 2021 నుంచి మే 2023 వరకు కాంట్రాక్ట్ కాలపరిమితి పొందిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ తర్వాత కాలపరిమితి ముగిశాక కూడా దాదాపు 6 నెలలు (నవంబర్ 2023వరకు) యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపింది.

ఆ విధంగా విచ్చలవిడిగా ఇసుకదోపిడీ చేసిమరీ ప్రభుత్వానికి తాను చెల్లించాల్సిన సొమ్ములో మరలా రూ.500కోట్లు బాకీ పెట్టింది. ప్రభుత్వం ఆ సంస్థకు టెండర్ ఇవ్వడమే డిస్కౌంట్ ధరకు ఇస్తే, మరలా ఆ సంస్థ మరింత ఎగ్గొడితే వెంకటరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ఏం చేశారు? ఏపీఎండీసీ గతంలో నెలకు రూ.115 కోట్ల ఆదాయం అర్జించిందనే వాస్తవం తెలియకుండానే వెంకటరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ఆ సంస్థకు డిస్కౌంట్ ధరకు కాంట్రాక్ట్ కట్టబెట్టారా?

జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకే ఇంత భారీ మొత్తంలో రూ.1250 కోట్ల డిస్కౌంట్ ఇస్తే, కొత్త ఇసుక టెండర్ల ద్వారా తెరపైకి వచ్చిన ప్రతిమా, జేసీకేసీ సంస్థలకు ఎంత డిస్కౌంట్ ఇచ్చారో బహిర్గతం చేయాలి. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు రూ.1250కోట్లు దోచిపెట్టిన జగన్ రెడ్డిసర్కార్…కొత్తగా పిలిచిన ఇసుక టెండర్లలో పాల్గొని టెండర్ పొందిన కంపెనీలకు ఎంత దోచిపెట్టిందో తక్షణమే వాస్తవాలు బయటపెట్టాలి.

నేటికీ కొత్త టెండర్ దక్కించుకున్న రెండు కంపెనీలకు ఎంతధరకు ఇసుక తవ్వకాలు కట్టబెట్టారనే వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారో జవాబు చెప్పాలని, ఆ వివరా లన్నీ వెంటనే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు ఇచ్చిన భారీ డిస్కౌంట్ రూ.1250కోట్లు, ఆ సంస్థ ప్రభుత్వానికి బకాయిపెట్టిన రూ.500కోట్ల సంగతేంటో… ఆ మొత్తం సొమ్ము ఎవరు చెల్లిస్తారో కూడా మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలి.

 ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.500 కోట్లు ఇసుకాసురుడు జగన్ రెడ్డి కడతాడా.. పెద్దిరెడ్ది కడతాడా?
వెంకటరెడ్డి GST ఇంటిలిజెన్స్ వారికి రాసిన లేఖలోని సమాచారాన్ని బట్టే రాష్ట్ర ఖజానాకు మే 2021 – మే 2023 మధ్య రూ.1250కోట్ల నష్టం వాటిల్లింది. ఆ మొత్తం సొమ్ము ముఖ్యమంత్రి కడతాడా… మంత్రి పెద్దిరెడ్డి కడతాడా.. టెండర్లు ఫైనల్ చేసిన గోపాలకృష్ణ ద్వివేదీ కడతాడో సమాధానం చెప్పాలి. ఆ సొమ్ము కట్టేవరకు ఇసుకాసురుడిని, అతని దోపిడీకి సహకరించిన వారిని వదిలేది లేదు. ఇలా ప్రజలసొమ్ము నచ్చిన కంపె నీలకు దోచిపెట్టింది కాక పారదర్శకత అంటూ కబుర్లు చెబుతారా?

అదేవిధంగా నేటికీ జేపీ పవర్ వెంచర్స్ వారు చెల్లించని ఆ రూ.500 కోట్ల సంగతేమిటో కూడా జగన్ రెడ్డి చెప్పాలి. మేం లేవనెత్తిన అంశాల పై డైరెక్టర్ మైన్స్&జియాలజీ వెంకటరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సాక్షిగా నోరు విప్పాలి. ఇంకొక 60రోజుల్లో ఏర్పడబోయే టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం కచ్చితంగా ఈ ఇసుకదోపిడీ దారుల్ని వదిలిపెట్టదు. వారు దోచుకున్న ప్రతిరూపాయిని ముక్కుపిండి వసూలుచేసి, వారిని కటకటాల పాలు చేస్తాం” అని పట్టాభిరామ్ హెచ్చరించారు

LEAVE A RESPONSE