Suryaa.co.in

Andhra Pradesh

పేదల్ని అప్పులపాలు చేసి, రోడ్డున పడేసిన జగన్ రెడ్డి

• 5 ఏళ్లలో పేదలకు 25 లక్షలఇళ్లు నిర్మిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, చివరకు 10శాతం ఇళ్లు కూడా నిర్మించలేదు
• టీడీపీప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే, జగన్ రెడ్డి ట్రాక్టర్ రూ.10వేలకు అమ్మాడు. సిమెంట్..ఇనుము ధరలు పెంచి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసేలా పేదల్ని భయపెట్టి చివరకు ఒక్కో కుటుంబంపై రూ.5 లక్షల అప్పు వేశాడు
• అప్పులు తీర్చలేని పేదకుటుంబాలు చివరకు తమకు వచ్చిన ఇళ్లనే అమ్ముకునే దుస్థితికి దిగజారాయి
• తెలుగుదేశం-జనసేన ‘జెండా’ సభ విజయవంతంతో ముఖ్యమంత్రి సహా వైసీపీనేతలకు నిద్ర కరువైంది
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్

5 ఏళ్ల తన దోపిడీ పాలనలో జగన్ రెడ్డి పేదల బలహీనతను కూడా సొమ్ము చేసుకున్నాడని, 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి పేదలకు ఉచితంగా ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదనేది అక్షరసత్యమని, గతంలో చంద్రబాబు నిర్మించిన ఇళ్లను కూడా పాడుపెట్టాడని, చివరకు ఇళ్లనిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలుచేశాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలపై పైసా భారం పడకుండా ప్రభుత్వఖర్చు తో వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానన్న జగన్ రెడ్డి, చివరకు నివాసానికి పనికిరాని సెంటు పట్టాలు వారికిచ్చి, ఆ స్థలాల్లో ఇళ్లుకట్టుకోకుంటే వాటిని వెనక్కుతీసు కుంటామని పేదల్ని బెదిరించాడు. దాంతో చేసేది లేక వారు అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది.

టీడీపీప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే, జగన్ రెడ్డి ట్రాక్టర్ రూ.10వేలకు అమ్మాడు. సిమెంట్..ఇనుము ధరలు పెంచి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసేలా పేదల్ని భయపెట్టి చివరకు ఒక్కో కుటుంబంపై రూ.5 లక్షల అప్పు వేశాడు
టీడీపీప్రభుత్వంలో ఉచితంగా ఇసుక అందిస్తే…నేడు జగన్ రెడ్డి ఇసుకదోపిడీతో ట్రాక్టర్ ఇసుక ధర రూ.10వేలకు చేరింది. దాంతో పాటు ఇనుము, సిమెంట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రిధరలు.. అందుబాటులో లేని ఇసుకతో చాలీచాలని సెంటు స్థలంలోనే ఇల్లు కట్టుకోవడానికి పేదలు నరక యాతన పడ్డారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.1.80లక్షలు తప్ప, జగన్ సర్కార్ ఇళ్లనిర్మాణానికి పేదలకు ఒక్కరూపాయి ఇవ్వలేదు. దాంతో ఇంటినిర్మాణం తల పెట్టిన ప్రతి పేదకుటుంబంపై దాదాపు రూ.5లక్షల అప్పుభారం పడింది. కొండంత రాగం తీసి.. చివరకు తుస్సుమన్నట్టు ఇళ్లనిర్మాణం పేరుతో జగన్ రెడ్డి పేదల్ని దారుణంగా వంచించాడు.

అంతటితో ఆగకుండా గతంలో స్వర్గీయ ఎన్టీఆర్… చంద్రబాబుల హయాంలో ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముకు కొంత సొమ్ముకలిపి ఇళ్లు నిర్మించుకున్న పేదలు, మధ్యతరగతి వర్గాల నుంచి వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో జగన్ అదనంగా డబ్బులు గుంజాడు. గ్రామీణప్రాంతాల్లో రూ.10వేలు.. పట్టణాల్లో రూ.30వేల చొప్పున ఓటీఎస్ కింద పేదల ముక్కుపిండి మరీ సొమ్ము వసూలు చేశారు. బాధితుల వద్ద నుంచే పరిహారం వసూలు చేసిన జగన్ రెడ్డి తనఖజానా నింపుకున్నాడు. పేదలు సుఖంగా నివాసముండాలని భావించి చంద్రబాబు వారికోసం టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని కూడా జగన్ అప్పులకోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టేశాడు.

టిడ్కోఇళ్లకోసం గతప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న పేదలకు ఈ ప్రభుత్వంలో బ్యాంకుల నుంచి నోటీసులు ఎందుకు వస్తున్నాయో ముఖ్యమంత్రే చెప్పాలి. ఈ విధంగా ఇళ్ల నిర్మాణం పేరుతో జగన్ రెడ్డి పేదల్ని అప్పులపాలు చేసి రోడ్డున పడేట్టు చేశాడు. జగన్ రెడ్డిని నమ్మిన పాపానికి నేడు పేదలంతా అప్పులభారంతో తాము పొందిన ఇళ్లను అమ్మకానికి పెట్టి, చివరకు మరలా ఎప్పటిలానే గూడులేని దుస్థితికి చేరే పరిస్థితి వచ్చింది

జగన్ రెడ్డికి సంపాదన తప్ప, పేదలు సంతోషంగా వారి సొంతఇళ్లలో ఉండాలనే ఆలోచన లేదు తాను వినియోగించే బాత్రూమ్ విస్తీర్ణమంత జాగా కూడా పేదల ఇంటి నిర్మాణానికి ఇవ్వలేదు
పేదలకు నిజంగా ఇళ్లు కట్టించే ఆలోచనే జగన్ రెడ్డికి ఉంటే ఈ విధంగా తన కమీషన్ల కోసం సిమెంట్.. ఇనుము ధరలు పెంచుతాడా? కమీషన్లకోసం తన భారతిసిమెంట్స్ సహా సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కు అవుతాడా? ఇసుక అందుబాటులో లేకుండా చేస్తాడా? చివరకు తాను నివాసముండే రాజభవనాల్లోని బాత్రూమ్ విస్తీర్ణమంత కూడా లేకుండా పేదలకు ఇళ్ల జాగాలు కేటాయిస్తాడా?

డ్వాక్రా సంఘాల్లోని ప్రతిమహిళ పేరుతో రుణాలు తీసుకొని, తద్వారా వచ్చే సొమ్ముతో ఇళ్లు నిర్మించాలని చూస్తున్న జగన్ రెడ్డి కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్ రెడ్డికి సంపాదనే ధ్యేయం తప్ప.. పేదలు సంతోషంగా, సుఖంగా వారి సొంత ఇళ్లలో ఉండాలనే ఆలోచన ఏమాత్రం లేదు. జగన్ రెడ్డి సాగించిన నయా ఇసుకదోపిడీతో ప్రేమరాజ్ వంటి ఎందరో అమాయకులు బలైపోయారు.

5 ఏళ్లలో పేదలకు 25 లక్షలఇళ్లు నిర్మిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, చివరకు 10శాతం ఇళ్లు కూడా నిర్మించలేదు
సంవత్సరానికి 5 లక్షల ఇళ్లు కడతానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి చివరకు 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లలో 10శాతం కూడా నిర్మించలేదని కేంద్రప్రభుత్వమే చెప్పింది. 2014 నుంచి 2018 వరకు చంద్రబాబునాయుడి ప్రభుత్వం రాష్ట్రంలో 1,25,186 ఇళ్లు నిర్మించి పేదలకు అందించింది. కానీ జగన్ రెడ్డి సెంటు స్థలాల పేరుతో.. ఇళ్ల నిర్మాణం ముసుగులో భారీ అవినీతికి పాల్పడి చివరకు పేదల్ని రోడ్డున పడేశాడు.

నెలలో అధికారం కోల్పోతున్న జగన్ రెడ్డి డీఎస్సీ పేరుతో యువతను వంచించడానికి సిద్ధమయ్యాడు. జగన్ అనాలోచిత చర్యలతో డీఎస్సీ కి సన్నద్ధం కాలేక..ఒత్తిడి తట్టుకోలేక యువత ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి రావడం నిజంగా బాధాకరం. జగన్ గొప్పగా చెప్పిన నవరత్నాల్లో ఇళ్లనిర్మాణ మనే నవరత్నం నేలరాలిపోయిందని ప్రజలు గ్రహించారు.

తెలుగుదేశం-జనసేన పార్టీలు నిన్న తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ పండుగతో ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలకు నిద్ర కరువైంది. భవిష్యత్ లో తమకు నమస్కారం పెట్టే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వైసీపీనేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది.” అని జవహర్ ఎద్దేవాచేశారు

LEAVE A RESPONSE