అమృతోత్సవం జరుపుకుంటున్న దేశం పౌష్టికాహార లోపాన్ని జయించలేదా?

మన్ కీ బాత్ 92వ ధారావాహికం లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దేశంలో ప్రజలు భజనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది.

కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పోషకాహార లోపం సమస్య ఉంది కానీ ఈ సమస్య తీవ్రత మన దేశంలో అధికంగా ఉంది. ఉండవలసిన బరువుకంటే తక్కువ బరువు వున్న పిల్లలు 40 శాతం ఇండియాలోనే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఏటా మన దేశంలో సగంవరకూ శిశు మరణాలు పౌష్టికాహార లోపంవల్లే సంభవిస్తున్నాయి. మహిళల్లో కూడా పౌష్టికాహార లోపం సమస్య తీవ్రంగా ఉండి, 56 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వేలు తలియజేశాయి.

దీనికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, ఎక్కువ వున్న కుటుంబాల పిల్లల్లో పౌష్టికాహారం లోపాలు ఎక్కువగా ఉన్నాయి. పౌష్టికాహార లోపాలను సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఐసిడిఎస్, గర్భిణీల, బాలల ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతున్నాయి. మన దేశంలో 1982 నుంచి పౌష్టికాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రజల్లో పౌష్టికాహారంపై అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రదర్శనలు ఏర్పాటుచేస్తారు. యూనెసెఫ్ 2022 నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక చూస్తే భయానక నిజాలను బయటపెట్టింది. పౌష్టికాహార లోపంతో 6నుంచి 36 నెలల్లోపు పిల్లలు 47 శాతం మంది ఉండగా, 6 నుంచి 8నెలల్లోపు 52శాతం మంది పిల్లలు చనిపోతున్నారని వెల్లడించింది. 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 33.23 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని పోషక ట్రాక్ యాప్ లో పొందుపరచిన సమాచారం. అంతేకాకుండా గర్భస్థ శిశువుతో పాటు తల్లుల మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మూడు పూటలు పిల్లలకు సరిపడ తిండలేక న్యూమోనియాతో బాధపడుతూ 28.9శాతం పిల్లలు ప్రతి ఏటా చనిపోతున్నారు.

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతో శరీరంలో కాల్షియం, ఐరన్ లోపం వల్ల ప్రసవం కాకుండానే 32శాతం మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడం లేదని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మన రాష్ట్రంలో రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల ఆకలి చావులను నివారించవచ్చునని ప్రభుత్వం చెబుతున్నది.

కానీ రూపాయి కిలో బియ్యం పంపిణీ చేసినప్పటికీ వాటికి తోడు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు. పైగా రాష్ట్రవ్యాప్తంగా 49శాతం మంది కుటుంబాలకు మూడు పూటల తిండి దొరకడం లేదని సమాచారం. ఒకవేళ దొరికిన అన్నం కారంపొడి వేసుకొని తింటున్నారని పలు అధ్యయన నివేదికల్లో బయటపడింది. దీంతో అయా కుటుంబాలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా పిల్లలకు సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని తేలింది.

చాలా వరకూ అంగన్ వాడీ కేంద్రాలు పెద్దగా నడవడం లేదని, ఈ కేంద్రాలకు సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లేదని పలువురు ఆరోపించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులో మితిమీరిన అవినీతి ఉండడం వల్ల గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందక మృత్యువాత పడుతున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆకలిచావులు, వలసల నివారణకు యూపిఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని 2005 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంత కూలీల వలసల నివారణ జరిగినప్పటికీ 100 రోజుల పనులతో పేదరిక నిర్మూలనను రూపుమాపడం కష్టమని తెలుస్తుంది.

100 రోజులు పని కల్పించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా 100 రోజులు ఖాళీగా ఉండే పరిస్థితులున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపోవడంతో గ్రామీణ కూలీలకు పనులు దొరకడం లేదు. దీంతో మరింత పేదరికంలో వెళ్లుతున్నట్లు పలు అధ్యయన సంస్థలు వెల్లడించాయి. దీన్నిబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలనకు పెద్దగా ఉపయోగకరంగా లేవని అర్థమౌతుంది. దీంతో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు మెరుగైన ఉపాధి అవకాశాలతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని పలువురు నిపుణులు చెబుతున్నారు.

దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది అక్షరసత్యం. ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నపుడే ఆరోగ్యవంతమైన సమాజం, రాష్ట్రం, దేశం ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. పోషకాహారం, ఆహారం ఈ రెండూ కవల పిల్లల వంటివి. శరీరం విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి అవసరమైన శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. ఎదిగే వయసులో తగినంత పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది.

పిల్లల్లో శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వారి ఆహారం పట్ల ప్రదాన శ్రద్ధపెట్టాలి. పోషకాహార లోపంగల పిల్లలకు రెట్టింపు ఆహారం ఇవ్వాలి.మన పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉన్నప్పుడే మన దేశం మంచి ఆరోగ్యకరమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. బడికి వెళ్ళే వయసుకంటే ముందున్న శైశవ దశలోనే పిల్లలు ఎక్కువగా పోషకాహార లోపం, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. వీరిలో పోషకాహార లేమి, అంటువ్యాధులను ఆకర్షిస్తాయి. పోషకాహార లోపం ఉన్నపుడు అంటురోగాల తీవ్రత ఎక్కువగా ఉంటాయి. పోషకాహర లోపం వల్ల పల్లెల్లో ఎక్కువగా డయేరియా, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి.

అంతేగాక పోషకాహార లోపంవల్ల రక్తహీనత, పొంగు, ఆటలమ్మ మొదలైన అంటువ్యాధుల బారిన పిల్లలు పడతారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు, విటమిన్లు, ఖనిజ లవణాలు- వీటితోపాటు శరీరానికి నీరు కూడా ఎంతో అవసరం. ఈ పోషకాలన్నింటిని సరైన పరిమాణంలో శరీరానికి అందించే ఆహారమే సమతుల ఆహారంలేక సంపూర్ణ ఆహారం. బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, నూనె మొదలగునవి శక్తినిచ్చే ఆహార పదార్థాలైతే, పప్పు్ధన్యాలు, సోయా చిక్కుడు, పాలు, మాంసం, గుడ్లు, మొదలగునవి పెరుగుదలకు తోడ్పడే ఆహార పదార్థాలు. ఆకుకూరలు, పండ్లు మొదలగునవి శరీర రక్షణకు తోడ్పడే ఆహార పదార్థాలు.

కానీ దేశంలో 80 శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం. ఈ సమస్య తీవ్రతను గుర్తించి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తోంది. ‘మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది’- వాటిలో ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలన్నీ ఉండాలి. మనిషి మానసికంగా శారీరకంగా ఎదిగేందుకు ఎంతో ఉపకరిస్తాయి.

ఈ రకమైన సమతుల ఆహారాన్ని తీసుకోలేని స్థితే పోషకాహార లోపానికి దారితీస్తుంది. పోషకాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు వ్యక్తి, కుటుంబం, సమాజంపైనా ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ లోపాలు అధికోత్పత్తిని దెబ్బతీసి పేదరికాన్ని పెంచుతుంది. ప్రతిరోజు సమతుల ఆహారం అందితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్లు.

పోషకాహర లోపం లోపిస్తే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి. అందుకే ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్, ఆరోగ్య శాఖలు కీలకంగా కృషి చేస్తున్నారు. పోషకాహార లోపం ఉంటే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే వీలుంది.

మాతా శిశు మరణాలు జరుగుతాయి. గర్భస్రావం జరిగే అవకాశం వుంది. నెలలు నిండకముందే ప్రసవించే అవకాశముంది. కడుపులో బిడ్డకు సరియైన పోషకాహారం అందకపోతే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వకపోవచ్చు. పుట్టిన పిల్లల్లో శారీరక, మానసిక వికాసం లోపించవచ్చు. తక్కువ బరువుతో జన్మించడం, ఎముకలు పలుచబడటం వంటివి ఉంటాయి. పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లోపం వస్తుంది. పుట్టినప్పటినుంచి 6 నెలల వరకు తల్లిపాలు సరిపోతాయి. ఆ తర్వాత తల్లిపాలతోపాటు అదనపు ఆహారం రోజుకు కొంచెం కొంచెం తినిపించాలి.

పిల్లలకు ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, సెలినియం అవసరం. ఆకుకూరలు, కూరగాయలు, పొట్టుతో తృణధాన్యాలు, పండ్లు, బెల్లం, గుడ్లు, మాంసం, చేపల్లో ఉంటాయి. ఎదిగే సమయంలో సరైన ఆహారం అందకోతే బుద్ధిమాంధ్యం ఏర్పడుతుందని చిన్నపిల్లల వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వయస్సుకు తగ్గ బరువు లేకుంటే భవిష్యత్తులో రక్తపోటు, మధుమేహం, హృద్రోగాల బారిన పడే ఆస్కారముం దని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు జంక్ ఫుడ్ నిరోధించి పౌష్ఠికాహారం అందించడం తల్లిదండ్రుల మొదటి బాధ్యత.

దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంలో సరైన పోషకాహారం కరువై రక్తహీనత వల్ల ఎన్నో అనర్థాలు దాపురించాయని ఇదివరకే కేంద్ర ఆరోగ్య పరిశోధన నివేదిక వెల్లడించింది. మొత్తం వ్యాధుల వ్యాప్తిలో అంటువ్యాధులు, ప్రసవసమయంలో అంటువ్యాధులు, రోజుల పసికందులకు వ్యాపించే వ్యాధులు మొదలైనవి 28 శాతం వరకు ఏయే కారణాలవల్ల వ్యాపిస్తున్నాయో వివరించింది. తెలుగు రాష్ట్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు అందించే ఆహారం లోపభూయిష్టంగా ఉందనీ, అంగన్‌వాడీ కేంద్రాలకు నాసికరకం గుడ్లు, బియ్యం సరఫర అవుతున్నాయని ఆపణలు ఉన్నాయి.

నేటి బాలలే రేపటి పౌరులు. అటువంటి పౌరులు ఉత్పాదక శక్తి కలిగి వుంటే వారిని మించిన పెట్టుబడి మరొకటి లేదు. ఈసురోమని దేశముంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్నాడు మహాకవి గురజాడ. శాస్త్రీయ ఆహార అలవాట్లు, పౌష్టికాహారం, పరిశుభ్రత, ఆరోగ్యం ఆహారం పై శ్రద్ద వహించాలి. ప్రజలను ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్యవంతులను చేయాలి. ఆరోగ్యంగా ఉందాం, మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం.

– డా. ముచ్చుకోట సురేష్ బాబు
( అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక)

Leave a Reply