– రూ.210 కోట్లతో 3 అయుష్ కళాశాలల నిర్మాణం
– 6 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రుల ఏర్పాటు
– ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.166 కోట్లు కేటాయింపు
– 2014–24 మధ్యకాలంలో రూ.120 కోట్లు మాత్రమే
– గత ప్రభుత్వ హయాంలో రూ.38.09 కోట్లు రాక
– కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో ‘అయుష్’ వైద్య సేవల విస్తరణ, మెరుగు కోసం రూ.166 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.166 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ముఖ్యంగా రూ.210 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా రెండు ఆయుర్వేద, ఒక యూనాని వైద్య కళాశాల రానున్నాయి. ఆరు జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు కూడా ఏర్పాటుకాబోతున్నాయి. ఒక్కో ఆనువత్రి ఏర్పాటుకు రూ.7 కోట్ల వరకు వ్యయం కానుంది. అంతేకాకుండా ఆయుర్వేద ఆరోగ్య మందిరాల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు కేటాయించింది.
కిందటేడాది నుంచి ఇప్పటివరకు రూ.248 కోట్లు మంజూరు
2014-24 మధ్య రాష్ట్రానికి రూ.120.17 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో గత ప్రభుత్వ పాలనలో కేంద్రం నుంచి రూ.38.09 కోట్లు విడుదలయ్యాయి. 2021 నుంచి మూడేళ్లపాటు అసలు వైకాపా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. కేంద్రం, రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఆయుష్ శాఖకు నిధులు భారీగా వస్తున్నాయి. 24-25లో రూ.83.23 కోట్లు, 2025-26లో రూ.165.65 కోట్లు కేంద్రం కేటాయించింది. రాష్ట్ర ఆయుష్ శాఖ చరిత్రలో రెండేళ్ల వ్యవధిలో రూ.248.89 కోట్లు మంజూరు కావడం ఇదే తొలిసారి.
కేంద్రం భారీస్థాయిలో నిధుల విడుదలకు ఆమోదం తెలుపడంపట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఆయుష్ వైద్య విద్యారులు నిర్వహించిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ధర్మవరం, కాకినాడలో కొత్తగా ఆయుర్వేద వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమలోనే యూనాని వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఒక్కో కళాశాల నిర్మాణానికి రూ.70 కోట్ల వరకు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు.
కేంద్రంతో వార్షిక నిధుల ఖరారు సమయంలో ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్ చూపిన చొరవను మంత్రి సత్యకుమార్ అభినందించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో యోగా రీసెర్చి సెంటర్ ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
2 ఆయుర్వేద వైద్య కళాశాలలు, 1 యూనాని కళాశాల ఏర్పాటు
ధర్మవరం, కాకినాడలో ఒక్కొక్క ఆయుర్వేద, రాయలసీమలో ఏర్పాటుకానున్న ఒక యూనాని వైద్య కళాశాలకు కలిపి రూ.70 కోట్ల చొప్పున రూ.210 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇందులో 2025-26 ఆరిక సంవత్సరానికిగాను రూ.46.10 కోట్లు వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు హోమియో, ఒక ఆయుర్వేద వైద్య కళాశాల చొప్పున ఉన్నాయి.
2026-27 విద్యా సంవత్సరం నుంచి విశాఖలోని నేచురోపతి కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కొత్తగా రానున్న వాటితో కలిపితే రాష్ట్రంలో కళాశాలల సంఖ్య 8కు చేరుకుంటుంది. విశాఖలో ని ప్రభుత్వ నేచురోపతి (ప్రకృతి వైద్యం), యోగా కళాశాల (100 పడకలు) కోసం రూ.23 కోట్లు కేంద్రం కేటాయించింది.
రూ.52.35 కోట్లతో 6 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు
శ్రీకాకుళం, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 50 పడకల సమీకృత (ఇంటిగ్రేటెడ్) ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు రూ.52.35 కోట్లు కేంద్రం మంజూరుచేసింది. ఇందులో ఈ ఆర్ధిక సంవత్సరానికి రూ.30.34 కోట్లు విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
276 ఆయుష్ డిస్పెన్సరీల అభివృద్ధికి రూ.49.76 కోట్లు
శిథిలావస్థలో ఉన్న 90 ఆయుష్ ఆరోగ్య మందిర (డిస్పెన్సరీలు) భవనాల పునర్నిర్మాణానికి రూ.27 కోట్లు, జిల్లా, సీహెచ్సీ, పీహెచ్సీల ఆవరణలో ఉన్న 60 డిస్పెన్సరీల భవనాల అభివృద్ధికి రూ.16 కోట్లను కేంద్రం మంజూరుచేసింది. మరో 126 ఆయుర్వేద మందిరాల రికరింగ్ ఖర్చుల అవసరాలకు రూ.5.75 కోట్లను కేంద్రం కేటాయించింది.