– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈనెల 13న జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
హైదరాబాద్ సచివాలయం ముందు ఉన్న మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బీసీ రిజర్వేషన్ రక్షించుకోవడానికి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
అందులో భాగంగానే రేపు 11వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ భవన్ లో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, సామాజిక తత్వవేత్తలతో విసృత స్తాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు
ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ లను రక్షించుకోవడానికి, తదుపరి బీసీ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేయడానికి రేపు జరిగే అఖిలపక్ష పార్టీలు మరియు బిసి సంఘాల సమావేశంలో విసృతంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రేపు ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు
బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల వైఖరిని ఎండగడుతూ, హైకోర్టు స్టేను నిరసిస్తూ నేడు తెలంగాణలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని హైదరాబాదులోని బషీర్బాగ్ లో ఉన్న బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద, ఉస్మానియా యూనివర్సిటీలో సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించామని, ఈరోజు జరిగిన ఆందోళనలు ప్రారంభం మాత్రమేనని, రేపటినుండి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి బిసీల తడఖా చూపిస్తమని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు
మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, గూడూరు భాస్కర్ మేరు, నరసింహ, తారకేశ్వరి, సమత యాదవ్, సంధ్యారాణి, గౌతమి, శారద, లావణ్య తదితరులు పాల్గొన్నారు.